Sunday 15 November 2015

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!! - ఎం.వి.ఆర్. శాస్త్రి

టిప్పు సుల్తాన్ ఒప్పు... హిందువులదే తప్పు!!
-ఎం.వి.ఆర్. శాస్త్రి 14/11/2015 - ఆంధ్రభూమి

టిప్పు సుల్తాన్ సెక్యులరా, కాదా అని వేరెవరినో అడగవలసిన పనిలేదు.
ఆ సంగతి టిప్పు సుల్తానే చెబుతాడు ఎంచక్కా.
‘‘మీర్ హుస్సేన్ అలీతో మావాళ్లు ఇద్దరిని పంపుతున్నాను. వారి సాయంతో నువ్వు హిందువులందరినీ పట్టి, చంపాలి. 20 ఏళ్ల లోపు వాళ్లని ఖైదు చేయాలి. మిగతావారిలో 5000 మందిని చెట్లకు వేలాడదీసి చంపాలి. ఇది నా ఆజ్ఞ.’’

‘ఆదర్శ ప్రభువు’ టిప్పు సుల్తాన్ 1788 డిసెంబర్ 14న కాలికట్‌లోని తన సేనాపతికి రాసిన జాబు ఇది.
‘‘పనె్నండు వేల మంది హిందువులు ఇస్లాంను స్వీకరించారు. వారిలో చాలా మంది నంబూద్రి బ్రాహ్మణులు ఉన్నారు. ఈ సంగతి హిందువుల్లో బాగా ప్రచారం చేయించు. అప్పుడు హిందువులని నీ దగ్గరికి రప్పించి ఇస్లాంలోకి మార్పించు. నంబూద్రి బ్రాహ్మణుడు ఒక్కడిని కూడా వదలొద్దు.’’

1788 మార్చి 22న ‘మోడల్ కింగ్’ టిప్పు సుల్తాన్‌గారు అబ్దుల్ కదీర్‌కి రాసి పంపిన ఉత్తర్వు ఇది.
‘‘ఇటీవల మలబార్‌లో నాలుగు లక్షల మందికి పైగా హిందువులను ఇస్లాంలోకి మార్పించి గొప్ప విజయం సాధించాను. ఈ సంగతి నీకు తెలియదా?’’

1790 జనవరి 19న బుద్రుజ్ జుమాన్ ఖాన్‌కి ‘‘జాతీయ వీరుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన ఉత్తరం ఇది.
‘‘మహమ్మద్ ప్రవక్త, అల్లాల దయవల్ల కాలికట్‌లోని హిందువులందరూ ఇస్లాంలోకి మార్చబడ్డారు. కొచ్చిన్ రాజ్య సరిహద్దుల్లోని కొందరు మాత్రమే ఇంకా మారకుండా మిగిలారు. వాళ్లనీ అతిత్వరలో మార్చెయ్యాలని నిశ్చయించాను. ఇదే ‘జిహాద్’ అని నేను అనుకుంటున్నాను.’’

1790 జనవరి 18న సయ్యద్ అబ్దుల్ దులాయ్‌కి ‘‘సెక్యులర్ పాలకుడు’’ టిప్పు సుల్తాన్ రాసిన లేఖ ఇది.
ఈ ఉత్తరాలన్నీ నిన్నో మొన్నో నరేంద్ర మోదీ గ్యాంగు బనాయించిన బాపతు కాదు. సుప్రసిద్ధ చరిత్రకారుడు కె.ఎం.పణిక్కర్ కష్టపడి సేకరించి నేటికి తొంభై ఏళ్లకింద ‘్భషా పోషిణి’ పత్రిక (1923 ఆగస్టు సంచిక)లో వెలువరించిన ఉత్తరాలివి. దానికి నూరేళ్ల కింద William Kirkpatrick 1811లో ప్రచురించిన Selected Letters of Tipoo Sultan గ్రంథంలోనూ ఇలాంటి లేఖామాణిక్యాలు చాలా దొరుకుతాయి.

ఉత్తరాల్లో రాసుకున్నవి బడాయి గొప్పలు అయి ఉండొచ్చు కదా? ఆదేశాలు పంపినంత మాత్రాన అవన్నీ అక్షరాలా అమలయ్యే ఉంటాయని ఎలా నమ్మగలం?

నమ్మవద్దు. 19వ శతాబ్దపు ‘మైసూర్ గెజిటీర్’ని చూడండి. దక్షిణ భారతంలో టిప్పు సేనలు 8000 దేవాలయాలను సర్వనాశనం చేసినట్టు కనపడుతుంది. ముఖ్యంగా మలబార్, కొచ్చిన్‌లలో జరిగిన దోపిడీలకు, దేవాలయ విధ్వంసాలకు మేర లేదని అర్థమవుతుంది.

పోనీ మనవాడు కాని Lewis B. Boury ని కదపండి. మలబార్‌లో హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద టిప్పు సుల్తాన్ చేయించిన ఘోర దురాగతాలు గజనీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, నాదిర్షా, ఔరంగజేబుల ప్రతాపాలకు ఏమాత్రం తీసిపోవని మొత్తుకుంటూ ఆయన పెద్దపుస్తకమే రాశాడు.

‘కేరళలో టిప్పు సుల్తాన్ దండయాత్రల ఘాతుకాలు చూస్తే చెంఘిజ్‌ఖాన్, తైమూర్‌లు గుర్తుకొస్తారని సుప్రసిద్ధ మహమ్మదీయ చరిత్రకారుడు పి.ఎస్.సయ్యద్ ముహమ్మద్ ‘‘కేరళ ముస్లిమ్ చరిత్రమ్’’ గ్రంథంలో వర్ణించాడు.
పుస్తకాలకేమి? తెలిసో తెలియకో ఎవడైనా ఏదైనా రాసి పడెయ్యవచ్చు- అని కొట్టేద్దామా?

1783 నుంచి 1791 వరకు మలబార్‌లో టిప్పు సుల్తాన్ రాక్షస కృత్యాల మూలంగా 30,000 మంది బ్రాహ్మణులు, ఇంకా ఎన్నో వేలమంది నాయర్లు ఇళ్లు, ఆస్తులు విడిచిపెట్టి ప్రాణభయంతో తిరువాన్కూరు రాజ్యానికి పారిపోయారని టిప్పు మరణానంతరం బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు నియమించిన విచారణ సంఘం దర్యాప్తులో తేలింది. ఆ నివేదిక కేవలం బ్రిటిషు ప్రభువులకు తెలియడం కోసం రూపొందిందే తప్ప పుస్తకం రాద్దామన్న ఉద్దేశంతో పోగేసింది కాదు. 1866-86 మధ్యకాలంలో ఆ ప్రాంతాన కలెక్టరుగా పనిచేసిన William Logan రికార్డులు ఫరిశీలించి, ప్రజలతో మాట్లాడి, విస్తృతంగా సమాచారం సేకరించి వెలువరించిన Malabar Manual లోనూ టిప్పు చేయించిన అత్యాచారాలు, సామూహిక సున్తీలు, ‘కత్తి లేదా టోపీ’ నినాదంతో నెత్తిన ముస్లిం టోపీ పెట్టుకోవటానికి ఒప్పుకోనివారిని వేల సంఖ్యలో నరికేసిన ఉదంతాలు, దేవాలయాలను మలిన పరిచి, బలవంతంగా ఆవు మాసం నోట కుక్కించి, స్ర్తిలను చెరిచి, పసిపిల్లలనూ చంపించిన పైశాచిక కృత్యాలు ఏకరవు పెట్టారు. దాని తాజాముద్రణను కొచ్చిన్, కేరళ యూనివర్సిటీల సహకారంతో విఖ్యాత ముస్లిం చరిత్రకారుడు డాక్టర్ సి.కె.కరీమ్ సరిచూసి ప్రచురించాడు.

పోనీ - బ్రిటిషు వారికి టిప్పు సుల్తాన్ బద్ధ శత్రువు కాబట్టి ఇంగ్లిషు వాళ్ల కళ్లకి అతడిలో అన్నీ తప్పులే కనపడి ఉండొచ్చు; ఆ ‘స్వాతంత్య్ర యోధుడి’ని భ్రష్టు పట్టించేందుకే వాళ్లు లేనిపోనివి కల్పించి ఉండవచ్చు అనుకుందామా?
ఇంగ్లిషు వాడు కాని విదేశీయుడు, 1790లో టిప్పు యుద్ధ బీభత్సాన్ని అక్కడే ఉండి కళ్లారా చూసిన పోర్చుగిసు యాత్రికుడు Barthoelomeo తరవాత కాలంలో రాసిన 'A Voyage to East Indies' లో ఛెప్పిందిది:
First a corps of 30,000 barbarians butchered everybody on the way... Tipu was riding an elephant behind which another army of 30,000 soldiers followed. Most of the men and women were hanged in Calicut. First mothers were hanged with their children tied to necks of mothers. That barbarian Tipu Sultan tied the naked Christians and Hindus to the legs of elephants and made the elephants to move around till the bodies of the helpless victims were torn to pceces. Temples and Churches were ordered to be burned down, desecrated and destroyed...

(ముందు 30 వేల దండు వెడలి దారిలో కనపడ్డ వాళ్లనల్లా నరికేసింది... టిప్పు ఏనుగు మీద ఉన్నాడు. ఇంకో 30వేల సైనికులు అతడి వెనుక నడిచారు. కాలికట్‌లోని స్ర్తి పురుషుల్లో అత్యధిక సంఖ్యాకులను ఉరి తీశారు. బిడ్డలని మెడలకు కట్టి తల్లులను ఉరి తీశారు. కిరాతకుడు టిప్పు సుల్తాన్ క్రైస్తవులను, హిందువులను నగ్నంగా ఏనుగుల కాళ్లకు కట్టేయించి, వారు ముక్కలయ్యేదాకా ఏనుగుల చేత తొక్కించాడు. దేవాలయాలను, చర్చిలను తగలబెట్టి, మలినపరిచి, నాశనం చేయించాడు.)

అదీ సంగతి! అన్ని మతాలనూ సమానంగా చూడవలెను అన్నది సెక్యులరిజం-ట కదా? చంపి పోగులు పెట్టే విషయంలో హిందూ, క్రైస్తవ మతాలకు చెందినవారిని సమానంగా చూశాడు కాబట్టి బహుశా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారి కాంగ్రెసు కళ్లకు టిప్పు సుల్తాన్ సిసలైన సెక్యులరిస్టుగా, ‘మోడల్ కింగ్’గా, ‘జాతీయ వీరుడు’గా కనపడి ఉండవచ్చు.

పూర్వపు కాంగ్రెసు ఇలవేల్పులు ఆ మహా ‘స్వాతంత్య్ర యోధుడి’ సంస్మరణార్థం ప్రత్యేక తపాలా బిళ్లను వెలువరించారు. సెక్యులర్ రాజ్యంలో సర్కారీ దూరదర్శన్The Sword of Tipu Sultan అనే పేర టిప్పుగారిని ఆకాశానికెత్తి మహావీరుడిగా, సుగుణాల రాశిగా చిత్రిస్తూ పక్కా అబద్ధాల అల్లికతో పెద్ద సీరియలే తీసి తరించింది. అలాంటప్పుడు తాను మాత్రం ఆ ‘మైసూర్ టైగర్’కి ఘన నివాళి ఇవ్వకపోతే మర్యాదగా ఉండదని తలచినవాడై, ఇనే్నళ్లకి ఆ ‘జాతీయ వీరుడి’ జయంతిని కన్నడ సిద్దుడు ప్రభుత్వ పరంగా ఏటేటా మహా ఘనంగా జరిపించబట్టాడు.

అది చూసి గిరీష్ కర్నాడ్ అనే ‘జ్ఞానపీఠ’మెక్కిన మహాజ్ఞానికి ఆనందబాష్పాలురాలి, ఉత్సాహం ఉప్పొంగింది. టిప్పు సుల్తాన్ అనేవాడు శివాజీ, నేతాజీల సరసన అర్జంటుగా చేర్చదగిన మహానుభావుడనీ, అంతటి పుణ్యాత్ముడిని అనుక్షణం గుర్తుపెట్టుకునేలా బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడను పక్కకు తనే్నసి టిప్పు సుల్తాన్ పేరు తగిలిస్తేగానీ సెక్యులర్ భారత్ కీర్తి ప్రతిష్ఠలు ఇంకా మండిపోవనీ ఆ మహామేధావి ఓవరైపోయాడు.
హిందువులను హింసించిన వాడు ఎవడైనా ఆటోమెటిగ్గా సెక్యులరిస్టే అయి తీరతాడు కాబట్టి మన పుణ్యభూమిలోని సమస్త వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర మేధావులు కూడా అమందానందభరితులయ్యారు.

ఎటూచ్చీ మతోన్మాదులైన హిందూ జనాలే ఈ లోకోత్తర జయంతి అద్భుతంగా సాగకుండా పెద్ద న్యూసెన్సు చేస్తున్నారు.

వాళ్లకి మరీ బుద్ధి లేకుండా పోయింది. ‘మా దేశం మీద దాడికి రండి. మీతో చేతులు కలుపుతా’నని టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వాళ్లను పిలవనంపి, దేశ ద్రోహానికి పాల్పడితేనేమి? ఇంగ్లిషు వాళ్లని తీవ్రంగా ఎదిరించాడు కాబట్టి అతడిని స్వాతంత్య్ర వీరుడు, జాతీయ యోధుడు అని పొగిడి, సెక్యులర్ బుద్ధి జీవుల్లా హిందువులు కూడా పొంగి పోవచ్చు కదా? శృంగేరి మఠానికి చేసిన సహాయాన్ని మాత్రమే గుర్తుంచుకోవచ్చు గదా? ఉత్తర కర్ణాటకలో, కూర్గ్‌లో వేలాది హిందువులను చంపి, లక్షల మందిని బలవంతంగా మతం మార్పించి, వందల దేవాలయాలు కూల్చిన ‘టైగర్’ చేతలను మన సెక్యులర్ మేధావుల్లాగే వారూ మరచిపోవచ్చు గదా?

అందులోనూ ‘మహా జయంతి’కి సిద్ద రామయ్య ఎంచుకున్న తేదీ ఏది? టిప్పు సుల్తాన్ పుట్టిన నవంబర్ 20నా? కాదండి. కాదు. మేల్కొటేలో ఒకే రోజు 700 మంది అయ్యంగార్లను టిప్పు సాహెబ్ ఉరి తీయించిన నవంబర్ 10ని! ఆ భయానక దుర్దినాన్ని మరచిపోలేక మేల్కొటే అయ్యంగార్లు ఈనాటికీ దీపావళి పండుగ జరుపుకోరట. అది వారి ఖర్మ. మిగతా ఊళ్ల హిందువులకు ఏమయ్యింది? సిద్దరాముడి సెక్యులర్ ప్రభుత్వం అంతలా పనిగట్టుకుని, ఒక సెక్యులర్ మహావీరుడిని - చచ్చిన రెండు శతాబ్దాలకు గోరీ లోంచి లేపి ‘జయంతి’ని వైభవంగా చేయిస్తూ... పుండుమీద కారం చల్లేలా టిప్పు బాధిత కూర్గ్ ప్రాంతంలో కిరాయి మూకతో పెద్ద ఊరేగింపు కూడా తీయిస్తే హిందువులు నోరు మూసుకుని బుద్ధిగా పడి ఉండవచ్చు కదా?

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతి పౌరుడికీ ఇచ్చి ఉండవచ్చు. అలాగని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ వంటి హిందూ మతోన్మాద ఫాసిస్టు సంస్థలు అలాంటి ప్రజాస్వామిక హక్కును తమ చేతిల్లోకి తీసుకుంటే ఎలా సహించగలం? హిందుత్వం వాలాలు శాంతియుతంగానే గుమికూడి నినాదాలు ఇస్తూ ఉండి ఉండవచ్చు. వారి చేతిలో ఏ ఆయుధాలూ లేకపోవచ్చు. కేరళ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్పెషల్ డ్యూటీ మీద రప్పించిన బంగ్లాదేశీ ముస్లింలూ, ఇతర దౌర్జన్య శక్తులే వారి మీద నిష్కారణంగా విరుచుకుపడి నానా ఆగం చేసి ఉండవచ్చు. ఆ దాడిలో 70వ ఏడు దగ్గరపడ్డ ఒక పరువుగల వి.హెచ్.పి. నాయకుడి ప్రాణం పోయి ఉండొచ్చు.

కాని - దాడి జరిగింది హిందువుల మీద అయినప్పుడు దాన్ని ‘రెండు వర్గాల ఘర్షణ’ గానే చూడాలి అని సెక్యులర్ శాస్త్రం కదా? హిందూ సంస్థలు నిరసనకు దిగడంవల్లే నడిరోడ్డుమీద పెద్ద మనిషి ఖూనీ జరిగింది కాబట్టి తప్పు ముమ్మాటికీ ఆ సంస్థలదే; రెచ్చగొట్టబడిన ఉడుకు రక్తపు వారి కంటపడటంవల్లే కదా దురదృష్టవశాత్తు అతడి ప్రాణం పోయింది?

ఒకవేళ మైనారిటీ మతస్థుల మీదే ఇలాంటి దాడి జరిగి ఉంటే ఈపాటికి సెక్యులర్ మేధావులు రంకెలు వేసేవాళ్లు. సాహిత్యకారులు అరిగిపోయిన చచ్చు అవార్డులను వెనక్కిచ్చేవారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక హిందూ ఫాసిజాన్ని ఖండిస్తూ సంపాదకీయం రాసేది. దాడి జరిగింది హిందువుల మీద కాబట్టి, మరణించినవాడు హిందూ సంస్థ ప్రముఖుడు కాబట్టి దాని గురించి మాట్లాడటం మర్యాదస్తులకు నిషిద్ధం. టిప్పును ఒప్పుకోని హిందువుల అసహనానే్న పవిత్ర సెక్యులరిస్టులు ఎంతసేపూ ఖండించాలి... హిందువులను నిరసన అయనా తెలపనివ్వని అన్యుల అసహనాన్ని పట్టించుకుంటే సెక్యులర్ మడి చెడుతుంది. గిరీష్‌కర్నాడ్ అనే సెక్యులర్ దేశభక్తుడిని ఎవడో కడుపు మండినవాడు ట్విట్టర్‌లో బెదిరించాడన్న కబురే ఈ మొత్తం ఉదంతంలో పత్రికలకు పతాక శీర్షిక.
ఇండియన్ బ్రాండు సెక్యులరిజం జిందాబాద్!

సేకరణ: ఆంధ్రభూమి దినపత్రిక 14-11-2015

32 comments:

  1. "ఎటొచ్చీ మతోన్మాదులైన హిందూ జనాలే ఈ లోకోత్తర జయంతి అద్భుతంగా సాగకుండా పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు"...

    టిప్పు సుల్తాన్ చరిత్రపై అవగాహన తక్కువగా ఉండి అతన్ని కేవలం ఒక దుర్మార్గుడిగానే చూస్తూ వచ్చాను ఇన్నాళ్ళూ, అసలిన్నిన్ని ఆకృత్యాలకు టిప్పు సుల్తాన్ ఒడిగట్టాడన్న విషయం మీరు సోదాహరణంగా వివరిస్తుంటే తప్ప అతనెంత క్రూరుడో తెలియరాలేదు.

    గుప్పెడు వోట్లు వేసేవాళ్ళను నెత్తికెక్కించుకుంటూ, బండెడు వోట్లను వేసే వాళ్ళను చీదరించి, చీత్కరించి, చిన్నచూపు చూసి, ఇక్కట్ల పాలు చేసే నాయకులను, పార్టీలను నెత్తికెక్కించుకునే జనం మరింకే దేశంలో వుండరు, ఎందుకనంటే వాళ్ళు హిందువులు కారు గనుక ...

    ReplyDelete
  2. అదేమో అంటారు చూడండీ, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళ మీద పడ్డా అట్లా అయి పోయింది ఈ దేశం లో హిందువుల పరిస్థితి !

    టైటిల్ చదివి ఇదేమిటి ఈకో గణేష్ గారు ఇట్లా వ్రాస్తున్నారు అనుకున్నా . !

    జిలేబి

    ReplyDelete
  3. ఇటువంటి టిప్పుసుల్తాన్ కోసం సంస్మరణ. ఆయన జ్ఞాపకార్థం మన దొరతనవారు తపాలాబిళ్ళ విడుదల చేయట! ఔరా కలికాలం. అంతా చూస్తూ ఊరుకోవటం! ఈ హిందువులం అందరమూ ఇంత బుధ్ధి లేని వాళ్ళం ఐపోయామేమిటండీ!

    ReplyDelete
  4. < "ఈ హిందువులం అందరమూ ఇంత బుధ్ధి లేని వాళ్ళం ఐపోయామేమిటండీ!"

    బుద్ధి లేని వాళ్ళం మాత్రమే కాదు శ్యామలరావు గారూ, నిర్వీర్యులం కూడా అయిపోతున్నాం.

    టిప్పు సుల్తాన్ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. చిన్నప్పుడు చదివిన చరిత్ర పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ ఇంతవాడు, అంతవాడు, ఆంగ్లేయులతో Anglo-Mysore Wars వీరోచితంగా పోరాడాడు అనే వ్రాసుండేది గానీ హిందువుల్ని ఊచకోత కోసాడు (తతిమ్మా కొంతమంది ముసల్మాన్ పాలకుల దారుణాల గురించి వ్రాసినట్లుగా) అని వ్రాసున్నట్లు గుర్తులేదు. బహుశ: ఇది కూడా రాజకీయ సెక్యులర్ కుట్ర అనుకోవాలేమో.

    ReplyDelete
    Replies
    1. రావు గారూ, టిప్పు సుల్తాన్ గురించిన అభిప్రాయాలు ప్రాంతం & మతం ఆధారంగా మారుతాయి. కొందరు (ఉ. ఆర్యెస్యెస్ నాయకుడు & కర్నాటక బీజేపీ స్థాపకుడు ఏకే సుబ్బయ్య) ఆయనను మైసూరు పులి & భారత స్వాతంత్ర్య పోరాట సేనాని అంటారు. టిప్పు శృంగేరీ మఠాన్ని మరాఠీల దాడి నుండి కాపాడడం, హైదరాబాదు నిజాం & ఇంగ్లీష్ వారిపై పోరాడడం దీనికి ముఖ్య కారణాలు.

      కూర్గు & మలాబారు ప్రాంతాలలో హిందువులను అలాగే కాసర్గోడ్ & మంగళూరు ప్రాంతాలలో హిందువులను & క్రైస్తవులను ఊచకోత కోసినందుకు ఆయా ప్రాంతాల వారి దృష్టిలో టిప్పు ఒక ముస్లిం దురహంకారి & జెహాదీ.

      I guess all these versions are true depending on which hat (Kannada, anti-Maratha, anti-Nizam, anti-British, Coorgi, Malayalee, Tulu or Christian) one wears.

      Delete
    2. జై గారూ,
      మీ అభిప్రాయంతో విబేధించవలసి వస్తున్నది. టిప్పు స్వయంగా వ్రాసిన వ్రాతలూ వెర్షన్లు అని పక్కకు ఎలా తోసేస్తారూ? హ్రస్వదృష్టికల కొందరు చరిత్రకారుల పుణ్యమా అని చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళలాగా చలామణీలోనికి వచ్చేసినంతమాత్రాన మంచివాళ్ళైపోరు కదా. కుహనా సెక్యులరిష్టులు ఆకాశానికి ఎత్తేసినంతమాత్రాన టిప్పు గొప్పవాడు కాడు. ఇలా అసందర్భంగా తిమ్మినిబమ్మిని చేసి అబద్ధాలను సృజించటానికి ఈ దేశపు చరిత్రకారుల్లో కొందరు స్వయంకృషికన్నా ఇతరుల మాటల్ని వల్లెవేయటమే చేయటం కారణం - జాతీయధృక్పథం లేని ఇలాంటి హీనచరిత్రకారులకు ఈ నాడూ కొదవలేదు.

      Delete
    3. @జై, వాళ్ల సంగతి సరే, ఇంతకి మీ దృష్టి లో టిప్పు సుల్తాన్ పై అభిప్రాయమేమిటి?

      Delete
    4. మాస్టారూ, నేను ఎవరినీ పక్కకు తోయలేదు. పరస్పర విరుద్ధమయిన అవగాహనలు ఉన్నాయని, వేటంతిటికి వాటిని మాత్రమె పరిశీలిస్తే పప్పులో కాలేసే ప్రమాదం ఉంటుంది.

      ఏకే సుబ్బయ్య కరుడు కట్టిన ఆర్యెస్యెస్ కట్టర్ హిందువు, మీరనుకున్నట్టు "కుహనా లౌకికవాది" కాదు.

      చరిత్రకారులలో ఎవరు వాస్తవాన్ని చెప్తున్నారో ఎవరు వక్రీకరిస్తున్నారో చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు. ఈ వైరుధ్యాలను పరిష్కరించాల్సినంత అవసరం ఉందా అన్నది నా అనుమానం. టిప్పులో ఆంగ్ల వ్యతిరేకత, మైసూరు (లేదా కన్నడ) అభిమానం & ముస్లిం దురహంకారం మూడూ ఉండవచ్చు: వీటిలో వైరుధ్యం లేదేమో ఆలోచించండి.

      @UG SriRam:

      I don't wear any of the hats I mentioned.

      Delete
    5. @జై గారు...

      అభిప్రాయాలు ప్రాంతం, మతం, వ్యక్తిగతం ఆధారంగా మారినా నిజమనేది మారదు కదా? ఒకటో రెండో కోణాల్లో ఓ వ్యక్తి కొన్ని మంచి పనులు చేసినా, ఆతని ఇతర దుష్ట చేష్టలు, మారణ కాండల మూలంగా ఆ మంచితనమనేది శూన్యంగా మారటం లేదా? బ్రిటిష్ వాళ్ళు మనను ఏళ్ళ తరబడి హింసించి, పాలించినా - వాళ్లు రోడ్లు వేశారనో, బ్రిడ్జీలు కట్టారనో లేక పోర్టులు తవ్వారనో మనం వాళ్ళను మంచివాళ్ళుగా భావించి తరమకుండా ఉండలేదుగా? అవన్నీ వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకున్న ఏర్పాట్లు. అలాగే టిప్పు ఇంగ్లీష్ వాళ్ళపై పోరాడటం, శృంగేరి పీఠాన్ని కాపాడటం అనే చర్యలు రాజ్యకాంక్షతో కూడిన ఆతని రాజకీయ ప్రయోజనా వాంచిత కార్యక్రమాలే తప్ప ప్రజోపయోగ కార్యాల వలె అగుపించవు - ఆతను చేసిన అమానవీయ దారుణాల వర్ణనలు గమనించాక. మీరు ఏ కే సుబ్బయ్య గారనబడే ఆరెస్సెస్స్ ప్రముఖుడిని, సుల్తాను గారికి అనుకూలుడిగా ప్రస్తావించినట్లుగానే - వ్యతిరేక కోణంలో సి కె కరీం గారనబడే విఖ్యాత చరిత్రకారుడిచే malabar manual లో వర్ణించబడిన అదే సుల్తాను గారి పైశాచిక కృత్యాలు సాధికారంగా శోధింపబడి ప్రచురింపబడినట్లుగా కూడా ప్రస్తావించడం జరిగింది. రావణాసురుణ్ణి, దుర్యోధనుణ్ణి మంచివాళ్ళనే వారున్నారని మనం వాళ్ళని ఉత్తములుగానే స్వీకరిస్తామా? పూజలు చేస్తామా? మరి ఇక్కడ జరుగుతున్నదదే!!

      "I guess all these versions are true depending on which hat one wears" ...

      true. but finally the truth weighs and establishes the true character of the chosen one.

      చరిత్ర వక్రీకరణకు గురైన సత్యాన్ని కప్పిపెడుతూ, రాజ్యకాంక్షా స్వార్ధ చింతనతో, స్వజనులను ఊచకోత కోసి దారుణ ఆకృత్యాలకు ఒడిగట్టిన వాళ్ళను వీరులుగా, శూరులుగా, దేశభక్తులుగా కీర్తిస్తూ తిలకం దిద్దడం - ఊరేగించి ఉత్సవాలు జరపడం మన దేశ నాయకులకే చెల్లింది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వెధవలు. అధికారం కోసం పరాయి వాళ్ళ పంచన చేరి కాళ్ళు పిసికి, చెప్పులు మోసే నీచులు,నిక్రుష్టులు. వీళ్ళను ఎన్నన్నా తక్కువే.

      Delete
    6. రావు గారూ, టిప్పు గురించి మీరు చెప్పిన మలాబార్ మాన్యువల్ సహా అన్ని వ్యతిరేకాదారాలు కూర్గు/మలాబారువే. నాకు తెలిసి (subject to correction as my knowledge is limited) కన్నడిగులు ఎవరూ ఈ అత్యాచారాల గురించి రాయలేదు.

      దీని అర్ధం ఏమిటి? టిప్పు మైసూరులో మతమార్పిడులు, గుళ్ళ పథనం, హిందువులపై అత్యాచారాలు జరగలేదా? జరిగితే ఎవరూ ఎందుకు రాయలేదు? కాకపొతే ఎందుకు జరగలేదు?

      History has many dimensions. Everyone chooses his own. Absolute truth is difficult to establish due to passage of time & gaps in information.

      Delete
    7. @jai ... "subject to correction as my knowledge is limited"...
      ఇక్కడ కూడా అదే సీన్ లెండి. కానీ eco ganesh గారు ఉటంకించిన అనేకానేక
      ఉదాహరణలు చాలా వరకు నమ్మదగ్గవి గానూ, నమ్మశక్యంగానూ ఉన్నాయి.
      మీరన్నట్లుగా ఏ చరిత్రకైనా వేర్వేరు కోణాలుండడం కూడా వాస్తవమైనా పైన
      పెర్కొన్నవేవీ ఖచ్చితంగా పుక్కిట పురాణాలుగా కనబడడం లేదు. అంతమంది
      వేర్వేరు దేశస్తులు రచించిన చారిత్రక అంశాలు మూకుమ్మడిగా తప్పుడు రాతలుగా
      పరిగణించి, benefit of doubt క్రింద సానుభూతి పొందడానికి టిప్పు
      సుల్తాన్ అర్హుడన్న భావన నాకైతే కలగడం లేదు.

      Delete
    8. టిప్పు సుల్తాన్, నిజాం ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు హైందవేతరులు కాబట్టి సెక్యులర్లేనండి. శివాజి హిందూరాజ్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించాడు. అన్ని మతాలను గౌరవించాడు. ఆంగ్లేయులను వెళ్ళగొట్టడానికి మరాఠాలు ముస్లిం రాజులను కూడా కలుపుకుని దేశంలో ఐక్యకూటమిని ఏర్పాటు చేసి పోరాడాలని చూశారు. అందుకే వారి కమ్యూనిష్టుల చేతిలో మతతత్త్వవాదులయ్యారు. అయినా ఇండో-చైనా యుద్ధం వచ్చినప్పుడు చైనా పక్షాన నిలిచిన భారతదేశ కమ్యూనిష్టుల దేశభక్తిని మనం ఎలా శంఖిస్తామండీ? జై గారు, నేను మిమ్మల్ని అనడంలేదు. సాధారణంగా బయట జరిగేవి చెప్తున్నా.

      Delete
    9. భారత్-చైనా యుద్ధం వచ్చింది సరిహద్దు వివాదం వల్ల. అప్పట్లో కాంగ్రెస్, ఆర్.ఎస్.ఎస్, రెండూ కలిసి ఆ యుద్ధాన్ని కమ్యూనిజంపై వ్యతిరేకత దాక తీసుకెళ్ళాయి. మన దేశ budgetలో 25% ఖర్చు రక్షణకే అవుతోంది. అయినా చైనా యుద్ధంలో భారత్ ఓడిపోయిందంటే రక్షణ ముసుగులో ఎంత అవినీతి జరిగుతోందో అర్థమైపోతోంది.

      Delete
    10. అప్పట్లో సర్దార్ పణికర్ చైనాలో ఉన్నారు. ఆయన నెహ్రూని హెచ్చరించినా నెహ్రూ గారికి ఆ హెచ్చరికలు చెవికెక్కలేదట. ఈ మాట ఒకప్పుడు మాలతీ చందూర్ వ్రాసారు జవాబులు శీర్షికలో ఆంధ్రప్రభలో. (అప్పుడు చాలా చిన్న వాణ్ణి లెండి). రక్షణముసుగులో అవినీతి గురించి మాట్లాడుకునే ముందు మన భారతదేశపు మొదటి పం.వ,ప్రణాళిక సైజు 5000 కోట్లు మాత్రమే అన్నది గమనించండి. మనది బేబీ స్థాయి కాని చైనా అప్పటికే బలమైన దేశం - ఆ కారణం చాలేమో మన ఓటమికి.

      Delete
    11. మన మేథావుల నిఘంటువులో secular = anti-Hindu అని అర్థం. ఈ సంగతి అందరికీ తెలుసు కదా, కొత్తేమి ఉంది.

      Delete
    12. This comment has been removed by the author.

      Delete
    13. ఇప్పుడు జరుగుతున్న అల్లరంతా వీరి పనుపున జరుగున్నది కాదంటారా?

      Delete
    14. ముద్రాస్ఫితి (inflation) తక్కువగా ఉన్న రోజుల్లో 5000 కోట్లు చాలా ఎక్కువే.

      Delete
    15. అవినీతి పక్కన పెట్టండి. చైనాకు మద్దతు తెలపడంలోనే తెలుస్తోంది మీ దేశభక్తి.

      Delete
    16. Do you think that border dispute has relation with pproletarian revolution?

      Delete
  5. కొన్ని నిజాలను చేర్చి కొన్ని నిజాలు దాచేస్తే అది చరిత్ర అవుతుందా? ఈ నిజాలు చరిత్రలో ఎందుకు చేర్చలేదో? ఇవి నిజాలు కాదా? కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డపనులను కేన్సిల్ చేస్తాయా?

    ReplyDelete
    Replies
    1. నిజాలు దాచటం మనదేశ చరిత్రకారుల కళానైపుణ్యం అనుకోవాలండీ. ఆర్యులదండయాత్ర అనే అబధ్ధం నుండి అనేకానేక అబధ్ధాలను మనచేత భట్టీ పట్టిస్తున్నారు! ఈ రోజు అశోకుడిమీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్బరు దురాగతాలగురించి కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులు గారు మహమ్మదీయ మహాయుగంలో కళ్ళకు కట్టినట్లు చెప్పారు. వీళ్ళిద్దరూ 'ది గ్రేట్' అనే బిరుదులతో సహా ప్రసిధ్ది మనవాళ్ళల్లో. కొన్నాళ్ళు పోతే టిప్పూ ది గ్రేట్ అన్నా అశ్చర్యం లేదు. కొంచెం చెడు ఎంతమంచినైనా కలుషితం చేయగలదు ఎంత మంచితో నైనా చెడును కొంచెంగా కూడా కడుగలేరు - అదీ మంచిని బలవంతగా కొన్ని పనులకు దురుద్దేశపూర్వకంగా ఆపాదిస్తూ!

      Delete
  6. తనే స్వయంగా ఉత్తరాలు రాసి,ఆజ్ఞలు జారీ చేసి,దండును ముందుండి నడిపించి ఘాతుకాలు చేసినా నమ్మడం లేదు!
    తనే సయంగా సమాధి నుంచి లేచొచ్చి ఒప్పుకున్నా నమ్మరు కాబోలు,అది కూడా హిందువుల కుట్ర అంటారేమో గదా?

    ReplyDelete
    Replies
    1. హిందువులకు భయపడి అలా చెప్తున్నాడంటారండీ, అంతా ఈ దేశస్థుల ఖర్మ. హరిబాబు గారు, మీ బ్లాగు పోస్టులు చాలా బాగున్నాయి. నేను ఇప్పుడే చూశాను. మీరు ఒకసారి 'Invading the Sacred' పుస్తకం చదవండి.

      Delete
    2. ధన్యవాదాలు.నేను కూడా మీ బ్లాగుకు రెగ్యులర్ రీడర్ని.కొన్ని మంచి పోష్టులు వెయ్యడానికి మీ పోష్టులు చదువుతున్నపుడు వచ్చిన ఆలొచనలే కారణం!

      Delete
  7. నమ్మకపోవటం లేదా నమ్మటంలేదని ప్రచారం చేయటం ద్వారా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, లాభపడే వాళ్ళూ ఉంటారు కదండీ.
    ఒకరు చెప్పింది కాదనటమే పనిగా ఉండేవాళ్ళూ ఉంటారు కదా?
    తప్పుడుపనులనో అవి చేసినవారినో ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు లోకంలో.
    ఇంక రాజకీయాలతో బ్రతికే వారికి నిజాలతో పని ఎలాగూ లేదు. వాళ్ళకు ఏది లాభమో నష్టమో తమకు అన్న లెక్కలు తప్ప.
    ఎవరికి ఏమి చెప్పి ఏమి లాభం? తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.......

    ReplyDelete
    Replies
    1. నమ్మడం లేదని ఎందుకు అనుకుంటున్నారండీ?

      Delete
  8. There are various reasons and political motivations of Tipu Sultan.

    1) First thing is that he regularly consutlted Hindu astrologers and they suggested some remedies and the same done in Sringeri by his assistants (It is said that even performed Sata Chandi Homa), in return he gave grants to Sringeri.

    2) The Tipu and Sringeri mutt friendship is a bad news for Marathas so they threatned Sringeri mutt.

    3) Tipu want the same that Maratha rulers are unhappy with Sringeri and propaganded that Marathas are outsiders so they are unnecessarily interfering in Kanada land (Divide and rule policy - between Kanda and Marathas).

    4) Tipu did not want any opposition in his own kingdom so did not destroyed local temples, to show that he is a secular rular in his own kingdom so did not harm any hindu temples - Political game/ master plan. For example recently Telangana police visited some petty thiefs and chain snakers houses and discussed with their family members about the same and surprised that most of lady members did not know that their husbands are thieves, had some cases or arrests and even came by bail.

    I am also had some intersting experience where we stayed as tenenants which happened around 1990s. Our owners son had a friend whom was liked by all (I also thought he is a good guy) but his true colour known as some police visited their house and inquired about that Gentleman (arrested for having duplicate notes printing machine).

    The same game nicely applied by Tipu with Britishers (asked help to fight against Marathas), other europeons (invited to fight against britishers) and Arab rulers (in the name of religion).

    ReplyDelete
  9. మనమీద దాడిచేశామని దౌర్జన్యకరవాదులు చెప్పినా అది నమ్మకూడదనే ఆలోచనలు మనలో పాదుకుని పోయాయి చూడండి ..అది మనదౌర్భాగ్యం

    ReplyDelete
    Replies
    1. అవునండి, నిజంగా ధౌర్భాగ్యమే

      Delete
  10. ఎవరయినా ఒక వ్యక్తి మీద గౌరవం ఉంటే ఆ మనిషి పుట్టిన రోజున చేస్తారు పండగ.కానీ కాంగ్రెసోడు సిధ్ధరామయ్య ఒక పదిరోజులు జరిపి వాడు కూర్గులో హిందువుల్ని చంపీన రోజూని ఎన్నుకున్నాడు పండగ చెయ్యటానికి.

    ఏ కొంచెం బుర్రలో గుజ్జున్న ముస్లిము కైనా కావాలని మనోణ్ణి తీట్టించటానికే ఆ తారీఖున పందగ పెట్టాడని ఆ కాంగ్రెస్సోడి మీదే మండితే?ముస్లిము లిప్పుడు ఇంకా పాతరోజుల్లోలా కాంగ్రెసు ఏం చేప్తే అది నమ్మేసేటంత అమాయకంగా ఉన్నారని అనుకుంటున్నారా!

    నాకు తారీఖులు మార్చినప్పుడే అనిపించింది ఇది ముస్లిములకీ కాలగూడని చోట కాల్చే డేటురా నాన్నా అని:-)

    చూస్తూ ఉందండి ఈసారి ముస్లిఉల వోట్లు ఎటు పదతాయో!

    ReplyDelete
  11. అసలు హిందువులు అంటే ఎవరు? ముస్లింలు అంటే ఎవరో చెప్పొచ్చు. క్రిస్టియన్లు అంటే ఎవరో చెప్పొచ్చు. హిందువులు అంటే ఎవరు? ఒక వ్యక్తి ని హిందువు అని నిర్ణయించే ప్రాతిపదిక ఏమిటి? హిందువులందరిదీ ఒకే మతమా? మిగితా మతాలవారికి ఒకే దేవుడు ఉన్నాడు. మన హిందువులకు మాత్రం అనేక దేవుళ్ళు ఎందుకున్నారు? హిందూ అనే పదం వేదాలలొ అయితే లేదు. భగవద్గీత లో కూడా లేదు. హిందూ పదం ఎక్కడనుంచి వచ్చింది? మనమెవరో మనము తెలుసుకుంటే మనం అన్నీ సమస్యలు పరిష్కరించుకోగలం

    ReplyDelete