Tuesday 31 March 2020

పునారాలోచన చేయాల్సిన సమయం (1 వ భాగం)



ఎక్కడో వూహాన్ నగరంలో పుట్టిన ఒక చిన్న క్రిమి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. వేల సంఖ్యలో మనుషులను బలిగొంటొండి. అది మానవుల సృష్టించిందా లేదా సహజంగా ప్రకృతిలో ఏర్పడిందా అనేది ఇంకా మనకు తెలియదు... కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మానవాళికి మృత్యువు ఎక్కడి నుంచి ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి. ఎవరికీ ఎలా ఉందో, ఎవరిని నమ్మవచ్చో, ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి. అందరూ భయం భయంగా బిక్కుబిక్కుమంటూ గడిపే స్థితి. దేశాల సరిహద్దులు మూతబడ్డాయి, రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. దీనికి కారణం ఏమై ఉంటుంది ఉంది.. ప్రకృతి ఈ విపత్తు ద్వారా మనకేమీ నేర్పిస్తోంది....
ఈ విపత్తు తొలగాలని, అందరూ బాగుండాలని ఆశిద్దాము. కానీ మన తప్పులు కూడా మనం తెలుసుకుందాము, పునరాలోచన చేద్దాము. ఈ వ్యాసాల ఉద్దేశం భయం కలిగించడం కాదు, మన పంథాను మార్చుకోవాలని గుర్తు చేయడమే....

అయితే ఒకసారి మనం వెనక్కు అనగా 2019 ఆగస్టుకు వెళదాము. అమెజాన్ అడవుల్లో నిప్పు రాజుకుంది....
ప్రపంచంలోనే అతి పెద్ద అడవులు అమెజాన్ అడవులు. అవి బ్రెజిల్, పేరు, బొలివియా మొదలైన తొమ్మిది దక్షిణ అమెరికా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. జీవరాశి మనుగడకు ఇవి విడుదల చేసే ప్రాణవాయువు (ఆక్సిఎజ్ఞ్) ను ద్ర్ష్టిలో ఉంచుకుని వీటిని ప్రపంచానికి ఊపిరితిత్తులుగా చెబుతారు. వీటిలో ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం ఉంటుంది. ఇవి దాదాపు 60 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమెజాన్ అడవుల్లో నిప్పురాజుకుంది, కాదు వాటికి నిప్పు పెట్టారు మానవులు. శాస్త్రవేత్తల అనచాన ప్రకారం దాదాపు 23 లక్షల జంతువులు ఈ అగ్నిలో మరణించాయి. లక్షల ఎకరాల వృక్ష సంపద నాశనం అయింది. కేవలం ఒక్క జూలై 2019 లోనే బ్రెజిల్లో 7200 చదరపు మైళ్ళు తగలబడింది. దీనికి ఆగస్టు నెల మరియు ఇతర దక్షిణ అమెరికా దేశల్లో తగలబడిన అడవి అదనం.

ఇప్పుడు ఆస్ట్రేలియా లో 2019 నవంబర్ లో జరిగినది ఒకసారి చూద్దామా ? ఆస్ట్రేలియాలోని అడవుల్లో కూడా అగ్గి రాజుకుంది, కాదు ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే స్థానికులు అగ్గి రాజేసారని అక్కడి ప్రజలే చెబుతున్నారు. ఇప్పటి వరకు అనగా మార్చి 2020 వరకు 4,60,50,750 ఎకరాల అటవీ సంపద ఈ అగ్నికి దగ్ధమైంది. దాదాపు ఒక బిలియన్ అనగా సుమారు వందకోట్ల జీవరాశి (పక్షులు, జంతువులు, కీటకాలు) అగ్నిలో పడి మరణించాయి.
కేవలం బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాము, కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలాంటి విధ్వంసం కొనసాగింది, ఇంకా కొనసాగుతోంది. ఈరోజు మనం ఎలా అయితే బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఆమవుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నామో, అడవుల్లో ఉన్న జీవరాశి కూడా అలానే గడిపింది. వాటికి ఎక్కడి నుంచి మృత్యువు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తోందో తెలియదు. తప్పించుకునే మార్గం లేదు... ఈ రోజు వైరస్ వ్యాప్తి చెందకుండా మనల్ని ఇంట్లో ఉండమంటున్నా, కొందరు వినక బయట తిరుగుతూ వాళ్ళు ప్రమాదంలో పడుతూ, మానవాళిని ప్రమాదంలో పడేస్తున్నారు... బహుసా ఆ రోజు కూడా ఆ అడవుల్లోని జీవరాశి అలాగే అనుకుని ఉంటాయి. మనిషేమీ ఉన్నతమైన, ప్రకృతికి అతీతమైన జీవి కాదు కద... ప్రకృతిలో భాగమైన మనిషే ప్రకృతికి నిప్పు పెట్టినప్పుడు, ప్రకృతి కూడా 'వద్దు రా నాయనా! ఇది నీకు కూడా ముప్పు తెస్తుంది, నా మాట విను!' అని మౌనంగా చెప్పే ఉంటుంది. అయిన మనం వినలేదు. అప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు మనదీ అలానే ఉంది... ఇది ప్రకృతి పెట్టిన శాపమా? లేక స్వయంకృతాపరాధమా?

కానీ ఎంత ఆశ్చర్యం... ఈ కరోనా మొదలైన తర్వాత ప్రపంచంలో అడవులు నరకడం ఆగిపోయింది...


మరి ఎక్కడో అడవులను తగలబెడితే, మొత్తం ప్రపంచం దానికి మూల్యం అనుభవించాలా అని అడుగుతారేమో... దాని గురించి కూడా చెబుతాను....

No comments:

Post a Comment