Friday 5 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (192)



భారతదేశ ప్రత్యేకత


పరమేశ్వర మూర్తులు ఈ దేశాన్ని విడిచి పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నాడు గణపతి?


చెట్టుకి నీళ్ళు పోయాలంటే దాని మొదట్లో పోస్తాం గాని, ఆకులపై కొమ్మలపై నీళ్ళు చల్లుతామా? కనుక దైవత్వానికి సంబంధించిన దాంట్లో ప్రపంచం, ఒక పెద్ద వృక్షమైతే దాని వేళ్ళు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని తడిపితే చెట్టు కలకలలాడుతుంది. అట్లా అన్ని దేశాలూ సుఖ సంపదలతో ఉంటాయి. అట్లా భారతదేశంలో కర్మానుష్టానం పూజలు, సక్రమంగా జరిగితే మిగతా దేశాలూ శక్తిని పుంజుకుంటాయి. ప్రపంచ క్షేమానికి ఇక్కడ ఆరాధన సక్రమంగా జరగాలి.


భగవంతుడేమని భావించాడు? ఒక ప్రాంతంలో మంచి వాతావరణం ఉండాలి, పంటలు, పచ్చదనం కొన్ని దేశాలలో ఉండాలి. వజ్రాలు, బంగారం విలువైన ఖనిజ సంపద మరొక దేశంలో ఉండాలి. కొన్ని దేశాలలో అధిక ఉష్ణోగ్రత, మరొక దేశంలో అతిశీతలత్వం. కొన్ని దేశాలు ఖాగ్యవంతంగా ఉండి మిగిలిన దేశాలకు అనేక రూపాలలో ఆ సంపద, రవాణా కావాలి. ఇక దైవసంబంధ విషయాలలో భారతదేశం ఒక పవర్ హౌస్ వంటిది.  అన్ని దేశాలకు విద్యుత్ కేంద్రం వంటిది. గుండె, అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆధ్యాత్మిక శక్తిని మిగతా దేశాలకు అందీయగలదు. ఇది ధర్మ భూమిగా, కర్మభూమిగా ఉండాలని అతని సంకల్పం. అంతమాత్రంచే ఇతర దేశాలలో ఆరాధనలుండకూడదని కాదు. శరీరంలో ఒక భాగానికి రోగం వస్తే కొన్ని మందులను పైపైన పూస్తాం కదా! అట్లాగే మిగతా దేశాలలోనూ పూజలు సాగవలసిందే! అయితే గుండె సరిగా ఉన్నపుడు ఏ రోగం శరీరానికి వచ్చినా కుదర్చడానికి వీలు పడుతుంది. అందువల్ల ఆరాధనా విధానాలలో అనేక నియమాలు, నిష్ఠలూ ఇక్కడున్నాయి. గుండె వంటి భారతదేశం రోగరహితంగా ఉంటే మిగతా అవయవాల వంటి మిగతా దేశాలూ బాగుంటాయి.


No comments:

Post a Comment