Thursday 3 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (10)



ఇటులుండగా ఒకనాడు అమిత తేజోవంతులు, దృఢకాయులు, నారచీరలు ధరించినవారు. ధనుర్బాణపాణులు, ఆజానుబాహులు, మూర్తీభవించిన క్షత్రియత్వముగల వారిరువురు తమ వైపునకే వచ్చుటనుచూచిన సుగ్రీవుని గుండియలదరగా- భీరువు వోలె పారిపో‘జూచుచు ఆంతరంగిక సచివుడైన ఆంజనేయునితో—


హనుమా! అదిగో! ఆటు చూడు! ముని వేషధారులయ్యు, ధనుర్బాణములను ధరించి 'ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం' అన్నటుల కాన్పించుచు ఎవరికోసమో వెతుకుచున్నవారివలె తోచు చూపులతో వచ్చుచున్నారు. వాలి పంపగా నా ప్రాణము లపహరించుటకై వచ్చుచున్నట్లున్నారు. పైకి వేసిన వేషమువలె వీరి అంతరంగము ఉండకపోవచ్చు. బ్రతికున్న బలుసాకు తినవచ్చు. వాలి తాను ప్రవేశించగరాని ప్రదేశము కనుక నిరంతరం తన మిత్రులచే నన్ను వధించ చూచుచున్నాడు. వారిని నమ్మరాదు. ఇటనుండి తప్పుకొనుట శ్రేయోదాయకము.


ఏలనందువా! శతృ సంచారమును వేయి కనులతో కనిపెట్టి వుండవలెను. ఇటువంటివారు బహు నమ్మకస్తులు గకన్పించి సమ యం కోసం కాచుకుకూర్చుని నమ్మినవారిని కాటువేయుదురు.


అరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాశ్ఛద్మచారిణః | 

విశ్వస్తా నామ విశ్వస్తా శ్చిద్రేషు ప్రహరన్త్యపి ||


అన విని పరేంగితజ్ఞుడైన అంజనాసూనుడు — వాలిని తలచుకొని సుగ్రీవుడు భయపడుచున్నాడని గ్రహించి సాంత్వ వచనాలతో ఇటుల పలికెను.


వానరేంద్రా! నీకు భయమేలనయ్యా! వాలి యీ పరిసరాల వైపు కన్నెత్తి చూచుటకైన సాహసించడు. వారు మన కహితులని నేననుకోను. వారివలన నీకేం భయం లేదు. సహజంగా భయం ఆవరించియున్న మనసుకు అన్నీ అనుమానాలే.


భయము తొంగిచూడ పరువెత్తు మగసిరి

భయము వెంట భూత చయము వచ్చు 

భయము నిలుచుచోట జయలక్ష్మి నిలువదు"


అనికదా కవి వాక్కు. భయము ఆలోచనను చంపుతుంది. కాన బుద్ధిశాలివై ఆలోచింపుమనగ శుభంకరమైన ఆ మాటలకు సంతసించి సుగ్రీవుడు వాని యథార్థ వృత్తాంతమును కనుగొని రమ్మని హరీశుని పంపెను.


No comments:

Post a Comment