Monday 21 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (28)



ఈ మహత్కార్యంలో పవన తనయునికి తనవంతు సాయం అందించదలచాడు సాగరుడు, సాగరుడు సగర వర్ధితుడు, సగరుడు ఇక్ష్వాకు వంశీయుడు. అదే వంశ సంజాతుడు రాముడు. శ్రీరామ కార్యార్ధి హనుమంతుడు. తనకు అతిధి. అతనికి సేవలందించు బాధ్యత తనది. అందుకే తనలో దాగిన మైనాకుని “నీకూ నాకూ పూజనీయుడైన సమీర కుమారుని నీ శిఖరాలతో ఆతిధ్యం యీయవలసినది" అని ప్రోత్సహించాడు. మైనాకుడు తన శిఖరాన్ని గగనమంత ఎత్తుకు పెంచాడు. 


తన దారికడ్డంగా నున్న గిరి శిఖరాన్ని చూచి ఇదొక విఘ్నముగా భావించి (విఘ్నోయమితి నిశ్చితః) అమిత బలసంపన్నుడు అంజనానందనుడు వేగంగా, బలంగా ఢీకొట్టాడు. ఆ తాకిడికి తత్తరపడి తేరుకుని మారుతి శక్తి సంపన్నతను మెచ్చుకోనుచు మైనాకుడు తన శిఖరాలపై మానవాకృతిన నిలబడి ---


మహావీరా! నీవు వాయు కుమారుడవు. అయ్యనిలుఁడు నాకు అత్యంతాపుడు. ఎలాగంటే ఒకనాడు పర్వతాలకు రెక్కలుండేవి. పక్షుల వలెనే పైకెగిరేవి. ఏ నిమిషాన అవి తమపైబడునో యని అర చేత ప్రాణాలు పట్టుకొని దినదినగండంగా సమస్త ప్రాణిలోకం ప్రాణభీతితో అల్లాడసాగింది. ఇది ఇంద్రునికి కోపకారణమైంది. వెంటనే తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు నరకటం మొదలు పెట్టాడు. అపుడు నేను నా ప్రాణసఖుడైన వాయుదేవుని 'ఇంద్రబారి నుండి కాపాడమని' కోరాను. వాయుదేవుడు కరుణించి నన్ను యీ సముద్రంలోకి విసిరివైచినాడు. రామ కార్యార్ధమై సముద్రమును దాటు నీవు ఆ కారణంగా నాకు మాననీయుడవు, పూజనీయుడవు. నిన్ను పూజించిన నా మిత్రుడు వాయు దేవుని పూజించినట్లే. (పూజితే త్వయి ధర్మజ్ఞే పూజాం ప్రాప్నోతి మారుతః) అంతేకాక సముద్రుడును నీకు విశ్రాంతిని కల్గించమని నన్ను ప్రేరేపించినాడు.

No comments:

Post a Comment