Tuesday 8 June 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (15)



వ సు ధై క కు టుం బ కం


తనకు మొదటి చూపులోనే రామలక్ష్మణుల యెడ పూజ్య భావం కలిగింది. ఆ భావంలోకూడ సుగ్రీవునికి వీరితో స్నేహమేర్పడిన కష్టములనుండి బయటపడునుగదా!అను భావనే. అలాగే రామునికిగూడ "ఇట్టివాని సాహచర్యము గల రాజు నిజముగ అదృష్టవంతుడు" అని అనిపించినది. ప్రశంసార్హమైన కార్యసాధనకిది మొదటి మెట్టయినది. సుగ్రీవుడు వారి వృత్తాంతము నరసి రమ్మన్నాడేగాని మరేమీ చెప్పలేదు. ఐనా రామ, సుగ్రీవుల మైత్రి ఇరువురకు శుభంకరమని, కళ్యాణయుతమని గ్రహించి "సుగ్రీవుడు మీతో చెలిమి చేయనున్నాడని, అతడు ధర్మాత్ముడు, విశ్వాసపాత్రుడు అని చొరవతీసుకు చెప్పుటలోనే హనుమంతుని దేశ కాల విదిత్వమున్నది.


సోదరుని అనుజ్ఞతో తమను తాము పరిచయం చేసుకుంటూ లక్ష్మణుడు "సచివోత్తమా! ఏది కావాలని కోరుకుంటున్నామో అనుకోకుండగ 'ఆడబోయిన తీర్థమెదురైనట్లు' మాకది లభించినది. ప్రహృష్టాంతరంగుల మయ్యాము. అయోధ్యా నగరాధిపతి దశరథ మహారాజు. ఆ రాజుకు పెద్ద కుమారుడూ, నాకగ్రజుడు యీ రాముడు. నన్ను లక్ష్మణుడంటారు. అరణ్యవాసానికి మా అన్న గారూ, వారివెంట మా వదిన జానకీ నేనూ అనుసరించి వచ్చాం. మేమిరువురము లేని సమయాన ఒక రాక్షసుడు మా వదినగారి నపహరించాడు,ఆమెను వెతుకుచూ తిరుగుచుండగా కబంధుడు కన్పించి సుగ్రీవుని గురించి చెప్పి సుగ్రీవుని కలుసుకోవలసినదిగా సూచించాడు.


"అహం బై వహి రామశ్చ సుగ్రీవం శరణం గతా"


నేను, రాముడును సుగ్రీవ మైత్రి కోరుకుంటున్నాం. మమ్ముల నాతని సన్నిధానానికి చేర్చవలసినదిగా కోరాడు.


లక్ష్మణుని మాటలు వినినంతనే ఆంజనేయుని హృదయాన మెరుపు మెరిసినట్లు ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.


No comments:

Post a Comment