Saturday 2 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 31 వ భాగం



పచ్చి భౌతికవాదం 


ప్రాపంచిక జీవితం, బంధహేతువని ఇంతవరకూ చెప్పిన మతాలకు భిన్నంగా, ఇది బంధ హేతువు కాదని అన్నిటినీ అనుభవించడమే లక్ష్యంగా చెప్పింది చార్వాకమతం. చార్వాకమనగా మధురమైన మాట. తపశ్చర్యలు, వ్రతాలు, శరీరాన్ని శుష్కింప చేసుకోవడం వంటివి దండుగని, ఇష్టమైనది. తినడం, త్రాగడం మంచిదని బోధించింది. వినడానికి బాగానే ఉంది కనుక ఇది చార్వాకం. ఈశ్వరుడు లేడు. ఉంటే కనబడుతున్నాడా? ఏది శరీరానికి, మనస్సునకు ఆనందాన్నిస్తుందో దానిని అనుభవించండని అన్నారు.


దానిని బృహస్పతియనే దేవ గురువు స్థాపించాడని, సన్మార్గంలో నడిచే అసురుల మనస్సులను విరవడం కోసం దీనిని స్థాపించాడని, ఇది బార్హ స్పత్యమని, లోకాయతమని ప్రసిద్ధిని పొందింది. అసుర ప్రవృత్తిలో ఉన్న నేటి వారికి ఈ మాటలు రుచికరంగానే ఉంటాయి.


వేదాలను నమ్ముతూ వేదాంతాన్ని త్రోసివేసినవి


వేదంలో భాగమైన ఉపనిషత్తు చెప్పే జీవ బ్రహ్మల అభేదాన్ని అంగీకరించకుండా కేవలం కర్మకాండలకే పరిమితమైన మీమాంసక మతాన్ని కృష్ణుడే ఖండించాడు. అయినా కర్మానుష్ఠానికే బ్రాహ్మణులు మొగ్గు చూపారు. వేదమంత్రాలు అర్థ విచారణ, వీరిని ఆకట్టుకొంది. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక సిద్ధాంతాలను చాలా తక్కువమంది విద్వాంసులు పాటిస్తూ ఉండేవారు. యోగసిద్ధాంతంలో ఈశ్వరుణ్ణి అంగీకరించినా ఇదీ పూర్తిగా సనాతన ధర్మాన్ని అనుసరించలేదు.


ఇక కొందరు బుద్ధిమంతులు బౌద్ధమతం కొమ్ముకాసేరు. వేదాంత సిద్ధాంతము క్షీణదశలో నుండగా కర్మలపట్ల విముఖత చూపించిన బ్రాహ్మణులు దీనికి ఆకర్షితులయ్యారు. అందు ధ్యానానికి అవకాశం మెండుగా ఉండడం వల్ల కావచ్చు. కనుక యాగమనే మాటను స్మరిస్తేనే ప్రజలు చెవులు మూసికొంటున్నారని దేవతలు, పరమేశ్వరునితో మొరపెట్టుకొన్నట్లుగా కొద్ది అతిశయోక్తితో శంకర విజయంలో చెప్పబడింది. ఇది ఆనాటి పరిస్థితి.


No comments:

Post a Comment