అసుర శక్తులు కలిలో చాలామందిలో ప్రవేశించడం వల్ల దుష్ట సంహారం చేయడానికి వీలు పడదు. అందువల్ల సాత్వికమార్గంలో ఉపదేశం చేయవలసి వచ్చింది. ఇది అవతారం ఉన్నంతవరకూ సాగవలసిందే. అందువల్ల జ్ఞానిగా బ్రాహ్మణ వంశంలో పుట్టవలసి వచ్చింది.
దీనిని విష్ణ్వతారమనాలా? జ్ఞానోపదేశానికి, జ్ఞానావతారం ఎత్తుతాడా? అతడట్టి అవతారం ఎత్తితే ఈశ్వరుడు, తన కృత్యంలో ఇతడు వేలు పెట్టాడేమిటని శంకించడు. భిక్షాటనమూర్తియై శంకరుడు ఋషిపత్నులను మోహింప చేస్తే మోహినీ అవతారంలో విష్ణువు ఋషులనే మోహపుచ్చాడు. శంకరుడపుడు ఋషులకు తత్త్వోపదేశం చేసాడు కనుక ఇద్దరిలోనూ భేదం లేదు.
జ్ఞానోపదేశం ఈశ్వరుని కృత్యమైనా అవసరం వస్తే విష్ణువు దత్త, ఋషభ, నరనారాయణ, వ్యాస రూపాలలో ఉపదేశమిస్తూ ఉంటాడు. శివ కృత్యాన్ని తానూ నిర్వహిస్తున్నానని ప్రకటించడం కోసం. కాని అటువంటిది పూర్తిగా దశావతారాలలో చేయలేదు. హయగ్రీవుణ్ణి "జ్ఞానానందమయం దేవం" అని కీర్తిస్తాం. సాధకులకు ఉపయోగిస్తాడు. అతణ్ణి లక్ష్మీ హయగ్రీవునిగా కూడా అంటారని మరిచిపోకూడదు.
అవతారాలలో విష్ణువు మాయావిగా కన్పిస్తాడు. విష్ణు జ్ఞానమని, విష్ణు యోగమనే మాటలు లేవు. శివజ్ఞానము, శివయోగ పదాలు మాత్రమే ప్రసిద్ధి. కాని విష్ణుమాయ అంటాం.
కనుక కలిలో క్షాత్రధర్మంలో కాకుండా సాత్విక రూపంలో జ్ఞానోపదేశం చేయాలి. అది శివావతారంగా ఉండాలి.

No comments:
Post a Comment