Friday 18 October 2024

శ్రీ గరుడ పురాణము (302)

 


ఆశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముండి దేవినీ, బ్రాహ్మణునీ పూజించి ఒక లక్ష బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమినాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్యైశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమివ్రత మంటారు.


ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించి అలా ఒక యేడాది పాటు చేసి చివర పదిగోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు ఒడ్డాణమును నివేదించుకున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమివ్రతమని పేరు.


ఈ ఏకాదశినాడు, చైత్ర ఏకాదశినాడూ ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యైకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ, వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వసిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే 'ఇక్కడ' అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో 'అక్కడ' ఋషిలోక నివాస ప్రాప్తి వుంటుంది. (అధ్యాయాలు 133 -135)


శ్రవణద్వాదశి వ్రతం


(నక్షత్రాల పేర్లనూ, తిథుల పేర్లనూ స్త్రీ లింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు)


ప్రాణులకు భోగమునూ మోక్షాన్నీ కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రంఈ మూడూ యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకూ అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు ఏకభుక్తం, భక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నఖాదనం - ఏది చేసినా దానికి అనంత పుణ్యం వ్రతికి లభిస్తుంది. నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు- వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలనూ విసర్జించాలి.


భాద్రపద శుక్ల ద్వాదశిశ్రవణ నక్షత్రం కలిసి ఒకేరోజు పడినపుడు అది గొప్ప మహత్తు గల దినమౌతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్పఫలప్రదమౌతుంది. ఈ రోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈ రోజు వామన రూపియైన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణకుంభంపై రెండు తెల్లటి వస్త్రాలను కప్పి దానిపై నుంచి ఛత్ర, పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి.


ఈ యీ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామి వారి ఆయా అంగాలను అర్చించాలి.


ఓం నమో వాసుదేవాయ  -  శిరస్సు

ఓం శ్రీధరాయ నమః  -  ముఖమండలం

ఓం కృష్ణాయ నమః   -  కంఠం

ఓం శ్రీ పతయే నమః  -  వక్షఃస్థలం

ఓం సర్వాస్త్రధారిణే నమః - భుజాలు

ఓం వ్యాపకాయ నమః   - కుక్షి ప్రదేశం

ఓం కేశవాయ నమః    - ఉదరం

ఓం త్రైలోక్య పతయే నమః  -  గుహ్యస్థానం

ఓం సర్వభృతే నమః    -   జంఘలు

ఓం సర్వాత్మనే నమః   -   చరణాలు


నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలనూ కుడుములనూ కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చెయ్యాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్ధించాలి.


నమోనమస్తే గోవింద బుధశ్రవణ సంజ్ఞక ॥

అఘోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవః (ఆచార.. 1136/11,12)


అనంతరం ప్రీయతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి. ఈ పూజకు నదీతటం ప్రశస్త స్థలం.


(అధ్యాయం -136)

No comments:

Post a Comment