Monday 21 October 2024

శ్రీ గరుడ పురాణము (305)

 


వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది.


వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చ్యవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి.


వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధార్ష నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ఠ, అంబరిష, విరూప, పృషదక్ష (శ్వ) రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు.


మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని ముగ్గురు కొడుకులు. వికుక్షి యజ్ఞేయ శశకము(కుందేలు)ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుతుడు. ఈ రెండవవాని కొడుకు వేనుడను పేరు గల అనేనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదశ్వుడు, కువలాశ్వుడు, ధృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరిషుడు ('రి'కి దీర్ఘం పెట్టకూడదు) పురుకుత్సుడు అను ముగ్గురు కొడుకులూ, యాభైమంది కూతుళ్ళూ పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు.


అంబరిషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరతుడు (త్రిశంకువు) హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు.


సగరునికి సుమతి అను పత్ని ద్వారా అరవైవేలమంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి, కొట్టిన పాపానికి, వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు.


సగరుని రెండవపత్ని కేశినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరధుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయననుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శ్రుతుడు, నాభాగుడు, అంబరిషుడు, సింధు ద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు (మిత్ర సహుడు) కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.


శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు, భరతునికి తార పుష్కరులూ, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులూ, శత్రుఘ్నునికి సుబాహు శూరసేనులూ జనించారు. కుశమహా రాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది.


* (ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడంచింత్యం) అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది. 

No comments:

Post a Comment