Sunday 20 October 2024

శ్రీ గరుడ పురాణము (304)

 



స్వచ్ఛ హృదయులై ఉపవాససహితంగా ఒక సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గ, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలూ తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రత కాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతం గాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి.


పాడ్యమినాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలనూ, విదియ నాడు లక్ష్మినీ, యమధర్మరాజునూ, పంచమినాడు పార్వతీదేవిని నాగగణాలనూ పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయునీ సప్తమినాడు సూర్యదేవునీ, అష్టమి నాడు దుర్గనీ, నవమినాడు మాతృకలను తక్షకునీ పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రునీ, కుబేరునీ, ఏకాదశినాడు సప్తర్షులనూ, ద్వాదశి నాడు హరినీ, త్రయోదశినాడు మన్మథునీ, చతుర్దశినాడు మహేశ్వరునీ, పున్నం నాడు బ్రహ్మనీ, అమావాస్యనాడు పితృదేవతలనూ పూజించాలి.


(అధ్యాయం -137)


సూర్యవంశవర్ణన


రుద్రదేవా! ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను.


విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు. మనువునకు  తొమ్మండుగురు కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, పృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు (కరషుడు). 


మనువుకు ఇల అను కూతురూ, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజూ, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయ నామకులయిన పుత్రులూ జనించారు.


గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు పృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్స ప్రీతి, అతనికి పాంశుఖ నిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింశుడు, అతనికి వివింశకుడు కలిగారు.


వివింశకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు.


బంధుమానుని వంశంలో వరుసక్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు.

No comments:

Post a Comment