Showing posts with label మాక్స్ ముల్లర్. Show all posts
Showing posts with label మాక్స్ ముల్లర్. Show all posts

Monday, 23 November 2015

హిందూ ధర్మం - 184 (మాక్స్ ముల్లర్ కుట్ర - 3)

మాక్స్ ముల్లరే కాదు, ఆనాటికాలంలో వేదానికి భాష్యం రాసిన అనేకమంది యూరోపియన్లు ప్రధాన ఉద్దేశ్యం వేదాన్ని తక్కువ చేసి చూపడం, హిందువులను తటస్థీకరించి, క్రమంగా మతమార్పిడి చేయడం, సనాతనధర్మాన్ని ఆటవిక సమాజపు అలవాట్లుగా చిత్రీకరించడం. వీరి ఆలోచనలకు బీజం వారి మతంలోనే ఉంది. హైందవేతర మతాలు, ముఖ్యంగా అబ్రహామిక్ మతాలన్నీ 'తన మార్గం మాత్రమే సత్యం, అన్యమైనవన్నీ అసత్యం, అవి అనాగరికం, వాటిని పాటించేవారు ఎంతమంచి వారైనా, వారు నరకానికే వెళతారు' అనే ప్రధానమైన సిద్ధాంతం కలిగి ఉంటాయి. ప్రపంచం మీద విరుచుకుపడిన ఐరోపా (యూరోపియన్) వారు, ఏ దేశంకెళ్ళినా, అక్కడున్న స్థానిక సంస్కృతిని, అలవాట్లను నాశనం చేశారు. అది కుదరనప్పుడు మొత్తం జాతినే ఊచకోత కోశారు. కేవలం మతప్రచారం కోసం, దోపిడి కోసం. అమెరికా మీద పడ్డప్పుడు కుడా వారు చేసింది అదే. అక్కడున్న ప్రజలను అనాగరికులని, ఆటవికులని, వారు ప్రకృతిని పూజిస్తారని చెప్పి, ఆ జాతిని సమూలంగా తుడిచిపెట్టారు. ప్రకృతిని పూజించడంలో తప్పేముందనేది ఓ పెద్ద ప్రశ్న?!

అదే ప్రణాళిక ఇక్కడ అమలు చేద్దామంటే పూర్తిగా కుదరలేదు. ఇక్కడ జాతిని సమూలంగా నాశనం చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అందుకే ముందు హిందువులను పక్కదారి పట్టించాలని భావించారు. అందులో భాగమే వెలుపలివారు (Outsiders) సనాతనధర్మం మీద వ్యాఖ్యానాలు, భాష్యాలు రాయడం. ఒకవేళ హిందువులు కనుక తమ మతసిద్ధాంతాలను ప్రపంచానికి చెప్పుకుంటే, ఆ సమయంలో ఐరోపాలో మొదలైనా ఉద్యమాలు, విద్యావ్యాప్తి, పరివర్తన కారణంగా, ఐరోపావారు కూడా విశాలమైన భావాలు గల ఈ ధర్మాన్ని స్వీకరిస్తారు. తమ మతానికి ముప్పు వాటిల్లుతుంది. రెండవది, భారతీయులని తమకు శాశ్వత బానిసలను చేసుకోవాలన్నా, మతమార్పిడి చేయాలన్నా, ముందు భారతీయులకు హిందూ ధర్మం పట్ల ఏహ్యభావం కలగాలి. దీనికంటే క్రైస్తవమే ఉన్నతమైందిగా అనిపించాలి. అది అంత సులభంగా జరిగే పని కాదు. అందుకే మాక్స్ ముల్లర్ మొదలైన ఐరోపావారు హిందువులను తమ మతం పట్ల తటస్థీరించాలని (Neutralise) చూశారు. అందుకోసమే వేదం జాతులు సంఘర్షణ, పోరు గురించి చెప్తుందని, అందులో పిచ్చి రాతలున్నాయని, జంతుబలులు, నరబలులున్నాయని చెప్పుకోచ్చారు. ముఖ్యంగా అది అనేకమంది దేవతలను పూజించమని చెప్తుందని, ఆ దేవతలు కూడా నిజమైన శక్తులు కావని, ఆదిమానవుడు వర్షం పడినప్పుడు తనకు తెలియని ఏదో శక్తి కారణంగా వర్షం పడుతోందని, వరదలు సంభవిస్తున్నాయని, పిడిగులు పడుతున్నాయని భావించాడని, ఆ భయంతోనే వాటిని పూజించడం మొదలుపెట్టారని, కాలక్రమంలో ఆ భయాలకు ఒక రూపం అంటగట్టి దేవతారూపాలుగా పూజిస్తున్నారని విస్తృతమైన ప్రచారం చేశారు. అబ్రహామికేతర మతాలన్నిటిని పేగెన్ (pagan) మతాలన్నారు. తమ మత ప్రవక్త పుట్టకముందు నుంచి ఉన్న మతాలన్నీ ఇలాంటివేనని, తమ ప్రవక్త మత్రమే దైవదూత అని, ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే స్వర్గం వస్తుందని ప్రచారం చేశారు.

నిజానికి ఇది ఏ హైందవుడికి ఆమోదయోగ్యం కాదు. హైందవం నమ్మకాల మీద ఆధారపడిన సంస్కృతి కాదు. ఇక్కడ దైవాన్ని దర్శించినవారు అనేకులున్నారు, దైవసాక్షాత్కారాని (God realization) కి అనేకమైన మార్గాలను హైందవం మాత్రమే చూపించింది. అసలు ఈ Realization అనేది ఇక్కడ మాత్రమే ఉన్న అంశం. ఆ మార్గంలో నడిచినవారందరూ గమ్యాన్ని చేరారు. తమ తర్వాతి వారికి మార్గదర్శనం చేశారు. ఇది హైందవుల చరిత్ర. మరేమతంలోను దైవాన్ని చూసినవారు లేరు, దైవసాక్షాత్కారానికి మార్గంలేదు. అక్కడ నమ్మడం (belief) ప్రధానం, ఇక్కడ నమ్మినదాన్ని దర్శించడం, సాక్షాత్కరించుకోవడం ప్రధానం.

అయితే ఇలా వెలువడ్డ వ్యాఖ్యానాలను మనవాళ్ళు పూర్వపక్షం చేయడం మర్చిపోయారు. అప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ విద్యవల్ల వీటిని యధాతధంగా స్వీకరించారు. ఇక్కడో విషయం గుర్తించాలి. మాక్స్ ముల్లరే కానీ, మరెవరైనా కానీ, వారిది దురుద్దేశమే అయినా, వారు వేదాల్లో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని అంగీకరించారు. ఎందుకంటే వేదంలో ఏమిలేదు అని కనుక చెప్తే, అది భారతీయుల తిరస్కరణకు గురవుతుంది, తిరుగుబాటుకు కారణమవుతుంది. అందుకని వాటిలో కొంతవరకు వైజ్ఞానిక అంశాలున్నాయని చెప్తూనే, తమ రచనలు చదివిన బలమైన హిందువులను తటస్థ (neutral) పరిస్తే, క్రమంగావారు హైందవం పట్ల నాస్తికులుగా మారతారు. అటుతర్వాత వారిని తమ మతంలోకి మార్చుకోవచ్చనేది ప్రణాళిక. Neutralising is the first step towards conversion. అంటే Positive attitude ని తీసివేయడం అన్నమాట.

మూడవది, ఈ వేదం విదేశీయులదని చెప్పి, హిందువుల్లో ఉండే వివిధ వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెట్టి, తమలో తమకే ద్వేషం పెంచి, అంతర్యుద్ధం సృష్టించాలని, క్రమంగా హిందూజాతి బలహీనపడుతుంది, అప్పుడు తమ పని సులవుతుందని భావించారు.

ఆ ఉద్దేశ్యంతో వేదభాష్యం రాసిన ఐరోపావరిని అనేకమంది హిందువులు స్వీకరించినా, దీన్ని పూర్వపక్షం చేసి, ఈ కుట్రదారుల కుతంత్రాలను బయటపెట్టినవారిలో ముఖ్యులు శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద్ సరస్వతీ. వేదానికి అంటగట్టిన విదేశిభావజాలాన్ని, నాస్తికవాదాన్ని పూర్తిగా వదలగొట్టడానికి వీరు ఎంతో ప్రయత్నం చేశారు.

To be continued ....................

Sunday, 8 November 2015

హిందూ ధర్మం - 183 (మాక్స్ ముల్లర్ కుట్ర -2)



1886 లో మాక్స్ ముల్లర్ తన భార్యకు ఈ విధంగా లేఖ వ్రాసాడు. 'ఈ కార్యాన్ని పూర్తి చేస్తానని నేను భావిస్తున్నాను, నాకేమనిపిస్తోదంటే జరగబోయేది చూడటానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు, కానీ నేను చేసిన వేద అనువాదం, రచన భారతదేశం, మరియు ఆ దేశంలో పుట్టబోయే కోట్లమంది భవిష్యత్తు తెలియజేస్తుంది. వేదమే వారి మతానికి తల్లివేరు, దాన్ని చూపించే నెపంతో నేను చేసిన ప్రయత్నం, ఆ వేదం నుంచి గత 3000 సంవత్సరాలలో ఉద్భవించి అభివృద్ధి చెందిన సర్వాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను'.

26 డిసెంబరు 1868 లో అప్పటి భారత సెకరెటరికి డ్యూక్ (the Duke of Argyle) కి లేఖ రాస్తూ, 'భారతదేశపు పురాతనమతం అంతరించబోతున్నది, ఇప్పుడు క్రైస్తవం అడుగుపెట్టకపోతే, తప్పేవరిది' అంటూ రాసాడు. తక్షణమే దేశంలో మతమార్పిడులకు శ్రీకారం చుట్టమని చెప్తున్నాడు.

అతని కుమారిడికి ఈ విధంగా లేఖ రాసాడు. 'ఈ ప్రపంచంలో ఏ ఒక పవిత్ర గ్రంధమైనా, ఇతర గ్రంధాల కంటే ఉన్నతమైందని అనుకుంటున్నావా? చెప్తే పక్షపాతం ఉన్నదని అనుకోవచ్చు, కానీ అన్నిటిని నేను పరిగణలోకి తీసుకుని చెప్పేదేమిటంటే, ఏదైనా ఉన్నతమైన గ్రంధం ఉన్నదంటే అది బైబిల్ కొత్త నిబంధన మాత్రమే. ఆ తర్వాత ఖురాన్, ఎందుకంటే అందులో ఉన్న నైతికి బోధనలు కొత్త నిబంధన కంటే కొత్తగా ఏమీ ఎక్కువ కాదు. ఆ తర్వాత క్రమంగా పాత నిబంధన, దక్షిణ బౌద్ధ త్రిపిఠక, టాయో రచనలు, కంఫ్యూషియస్ రచనలు, వేదం, అవెస్థ. కొత్త మరియు పాత నిబంధనల్లో చెప్పబడిన నైతికి విలువలు ఇతర మతగ్రంధాల్లో కంటే ఉన్నతమైనవి. అదే బైబిల్ ప్రత్యేకత. అన్యమైన పవిత్ర గ్రంధాలన్నీ పాతకాలపు ప్రజలు సేకరించి పెట్టుకున్న జ్ఞాపకాలు మాత్రమే'.

ఇదీ  మాక్స్ ముల్లర్ కి వేదం పట్ల, సనాతనధర్మం పట్ల ఉన్న అభిప్రాయం. తన భార్యకు రాసిన లేఖలో అతడు స్పష్టంగా హిందూ ధర్మాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించి వేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకో విషయం ఏమిటంటే అతడికి వేదం కాలాతీతం అని ఒప్పుకోవడానికి అహంకారం, స్వమతాభిమానం అడ్డు వచ్చాయి. అందువల్ల వేదాన్ని కేవలం 3000 ఏళ్ళ క్రితం నాటి రచనగా మాత్రమే చెప్పుకొచ్చాడు. సెకరెటరికి రాసిన లేఖలో మతమార్పిడులు చేయమని చెప్పాడు . కుమారుడికి రాసిన లేఖలో వేదం పట్ల తన అభిప్రాయాన్ని, గౌరవాన్ని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ స్వమతాభిమానం ఉండవచ్చు, కానీ పక్క మతాలను తక్కువ చేయకూడదు. కానీ మాక్స్ ముల్లర్‌కు బైబిల్ తప్ప మిగిలిన గ్రంధాలన్నీ ప్రజలు రాసుకున్న తమ జ్ఞాపకాల  ప్రతిరూపం మాత్రమే. వాటికి ఏ మాత్రం దైవత్వం లేదు. అటువంటి ఆలోచన కలిగిన మాక్స్ ముల్లర్ వేదానికి అనువాదం రాస్తే, ఎలాంటి భావాలు చెప్పి ఉంటాడో, అతడికి వేదసంస్కృతి పట్ల ఎట్లాంటి అభిప్రాయం ఉన్నదో, ఎంతవరకు ఈ ధర్మం అర్దమైందో స్పష్టమవుతుంది.

To be continued ..............................