Tuesday 16 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (175)



లలితాంబ, భండాసురుణ్ణి ఎదుర్కొనగా అతడు విఘ్నయంత్రాన్ని సృష్టించగా, అపుడామె పరమ శివుని ముఖం చూడగా గణపతి పుట్టినట్లు ఒక కథ.


అన్ని కథలలోనూ విఘ్నేశ్వరుని పుట్టుకకు అమ్మవారితో సంబంధం ఉంది. అందువల్ల శూర పద్ముడు, స్త్రీ పురుష సంబంధం లేకుండా అనే మెలిక పెట్టాడు. శివుని నేత్రాలనుండి కొన్ని నిప్పురవ్వలు రాగా అమ్మవారితో సంబంధం లేకుండానే మన స్వామి పుట్టాడు.


ఇట్టి సంఘటనకు వినాయకుడు అవకాశం ఈయడం వల్లనే కుమార సంభవం కుదిరింది. వినాయకునకు అసురులను సంహరించే శక్తియున్నా శంకరుడిచ్చిన వరాన్ని గౌరవించాలని యుద్ధానికి వెళ్ళలేదు. ఇతడు యుద్ధరంగానికి వెళ్ళకుండా కుమారస్వామి వెళ్ళుటకు అవకాశం ఇచ్చినవాడయ్యాడు. అనగా కుమారస్వామి అవతారానికి ఒక విధంగా దోహదం చేసాడు. 


అతడు తలుచుకుంటే తండ్రి శరీరంలో ప్రవేశించి, అమ్మతో సంబంధం లేకుండా శివుని నుండే అవతరించి యుందేవాడు. అతడే దేవగణాలకూ అధిపతియై యుండేవాడు. అసురులను చంపడం ఒక లెక్కా? అట్టి పనులు చేయకుండా ఉండడం వల్లనే సుబ్రహ్మణ్యుడనే ఆరాధ్యమూర్తి లోకానికి వచ్చింది. 


కుమార సంభవానికి, గణపతికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా శక్తి ప్రదర్శనను సోదరునిచే చేయించి ఆ కీర్తిని సోదరునికే చెందునట్లుగా చేయడం మాటలా? అట్టి కీర్తిని తమ్మునికి ప్రసాదించి పెట్టాడు కదా.


No comments:

Post a Comment