Wednesday 2 August 2023

శ్రీదత్త పురాణము (215)

 


మునిశ్రేష్టా! అడగవలసిందే అడిగావు. ఇందులో నన్ను నొప్పించింది ఏమీ లేదు. నువ్వన్నట్లు ఇంత వరకూ లోకంలో ఉన్నవి నాలుగే ఆశ్రమాలు. కానీ నాది - ఆపైది, అయిదో ఆశ్రమం. ఈ చరాచర జగత్తునంతటినీ ఆత్మాభిన్నమనీ అవికల్పంగా చూడగలిగినవాడు, కామక్రోధాదులనైన అరిషడ్ వర్గాన్ని జయించి సర్వ భూతకోటిపట్లా సమచిత్తంతో వైరాగ్యంతో ఉండగలిగినవాడు మాత్రమే ఈ అయిదవ ఆశ్రమానికి అర్హుడు. నేను చెప్పిన ఈ తత్వం నువ్వన్న నాలుగు ఆశ్రమాలలోనూ ఎక్కడైనా వున్నట్లా లేనట్లా? బహుశ నీకు తెలీదు. చెప్పలేవు. కేవలం బ్రహ్మవాదులు మాత్రమే గుర్తించగలరు.


మహానుభావా! నువ్వే విశ్వేశ్వరుడవు. నువ్వే పురుషోత్తముడవు. అనసూయ - అత్రిదంపతులకు జన్మించిన నువ్వే కమలాపతివి. అజ్ఞానంతో నేను చేసిన ఈ అధిక ప్రసంగాన్ని క్షమించు. నన్ను రక్షించు. నీ ఉదరంలో ప్రవేశించి సురక్షితంగా ఉండాలని నా ఆకాంక్ష. హే శ్రీ రామా! నారాయణా! వాసుదేవా! గోవిందా! వైకుంఠా! ముకుందా! కృష్ణా! శ్రీ కేశవా! అనంతా! నృశింహా! విష్ణు! సంసార సర్ప ద్రష్టుణ్ని. నన్ను కాపాడు - అని పింగళనాగుడు సాగిలపడి మ్రొక్కాడు. పింగళనాగుడి ప్రార్ధనను మన్నించి దత్తాత్రేయుడు శివరూపంతో అతడిని గర్భాన ధరించాడు. 


ఆమలకీ వృత్తాంతం - ఉసిరిక


శివరూపధారియై కృష్ణా మలకం క్రింద కూర్చున్న దత్తాత్రేయుణ్ని గానీ, త్రిమూర్తి స్వరూపమైన ఆ కృష్ణా మలకిని గానీ దర్శించినవారు సద్గతులుపొందుతారు అనడంలో సందేహం లేదు. నరనారీజనం ప్రణీతానదిలోని పద్మ తీరాన స్నానం చేసి దానధర్మాలు నిర్వహించి ఒడ్డున ఉన్న ఈ కృష్ణా మలకిని దర్శించి స్పర్శించి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో హరిహర విరించిలకు ప్రదక్షిణం చేసిన పుణ్యఫలం పొంది, మహాయోగులకు సైతం అందని పరమపదం చేరుకుంటారు. కృత యుగారంభంలో క్షీరసాగర మధనం జరుగుతున్నప్పుడు ఫలపుష్ప భరితమై పీయూషామలక వృక్షం ఆవిర్భవించింది. దాన్ని అప్పుడు దేవతలు విష్ణుమూర్తికి బహూకరించారు. సముద్రుడేమో కౌస్తుభాదిరత్నాలనూ దివ్యాభరణాలను లక్ష్మీదేవినీ స్వయంగా సమర్పించి విష్ణుమూర్తిని సత్కరించాడు. పుణ్యప్రదమైన క్షీరాబ్ధి మందిరంలో ఈ పీయూషామలకిని స్థాపించి లక్ష్మీదేవిని ఆనందపరచాడు శ్రీ మహావిష్ణువు. అనసూయాత్రి మునులకు తాను పుత్రుడుగా అవతరించినవేళ తనతోపాటు ఈ పీయూషామలకిలో అర్ధాంశం తెచ్చుకున్నాడు. అటుపైని దాన్ని తన సహ్యాద్రి ఆశ్రమంలో నాటుకున్నాడు. అదే కృష్ణామలకీ నామంతో ప్రసిద్ధమయ్యింది. దానిక్రిందనే దత్తస్వామి తీవ్రంగా తపస్సు చేసాడు. ఈ తరువు మూడు రూపాలతో నామాలతో త్రిభువనాల్లోనూ విఖ్యాతి పొందింది. ఒకటే తరువు ఊర్ధ్వ భువనాన క్షీరాబ్ది మందిరంలో ఒకరూపంతో, పీయూషామలక నామంతో సహ్యాద్రి శిఖరం మీద, మరొక్కరూపంతో, కృష్ణామలక నామంతో పాతాళలోకంలో వేరొక రూపంతో, నామంతో విరాజిల్లుతోంది. దత్తాత్రేయాశ్రమంలోని తృతీయాంశ విరాజితానికే సిద్ధామలకమని కూడా పేరు. ఇందువల్లనే సిద్ధామలక గ్రామం ఏర్పడి అటుపైని మాతాపురం అయ్యింది. దీన్ని దర్శించిన నరనారీ జనం పరమపదం చేరుకుంటారు.


No comments:

Post a Comment