Tuesday 29 August 2023

శ్రీదత్త పురాణము (242)

 


ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆ కపాలంతో తీసుకురా. మాంసభోజనం కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరత్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చలభక్తికీ గురుశుశ్రూషకూ సంబరపడి ఆయు భూపతీ! ఏం కావాలో వరం కోరుకో ఇస్తానన్నాడు. దత్తయోగీంద్రా! గుణ సంపన్నుడూ సర్వజ్ఞుడు దేవవీర్యుడు దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడూ దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడూ ప్రజాపాలన దక్షుడూ యజ్ఞ నిర్వాహకుడూ దానశీలుడూ శరణాగత తత్పరుడూ మహాత్యాగి వేద శాస్త్ర పారంగతుడూ ధనుర్వేద నిపుణుడూ అనాహతమతిమంతుడూ సుందరాకారుడూ - ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ని వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవాంశతో - పుడతాడనీ సార్వ భౌముడవుతాడనీ ఇంద్రతుల్య పరాక్రముడవుతాడనీ ఆశీర్వదించి, ఒక పండు చేతికందించి ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను. నీ కిచ్చిన వరం ఫలిస్తుంది - అని చెప్పి అదృశ్యమయ్యాడు. 


ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కన్నులకద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కలవచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిధుడు, సముజ్జ్వలత్సర్వాంగుడు, శ్వేతవస్త్ర సుశోభితుడూ, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపిన విరాజితుడు. చతుర్భుజుడు, శంఖ చక్రగదాఖడ్గధారి. హారకంకణకేయూరనూపురాలంకృతుడు. చంద్రబింబంలాంటి ఛత్రచ్ఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబంల్లాంటి మకరకుండలాలు చెక్కిళ్ళుపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్యపురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. ఆటుపైని ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడయ్యాడు. 


ఇందుమతికి మెలకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే శౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవ్వాళ మహారాణికి కలలో దర్శనమిచ్చారని క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడనీ ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందనీ స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ మహార్షి రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుణ్ని ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు.


No comments:

Post a Comment