Thursday 31 August 2023

శ్రీదత్త పురాణము (244)

 


అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కొని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి, తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడి కూనను సంహరించి తెచ్చి, ఆ మాంసం వండి, పసిబిడ్డ మాంసమని హుండుడుకి వడ్డించారు. అది భక్షించి హుండుడు నిశ్చింతగా నిద్రపోయాడు.


తెల్లవారింది, వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్యలక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమ వాసులంతా మాకు తెలీదంటే మాకు తెలీదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి, ఆయు మహారాజుగారి పుత్రుడిలా ఉన్నాడు. ఈ తేజస్సూ ఈ కాంతీ కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము - అన్నారు. వసిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.

దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిపా ! నీ వంశం బాలభావధూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు, దేవ పూజ్యత దక్కుతుంది- అని నామకరణం చేసి దీవించాడు.


వసిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదవేదాంగాలూ నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలూ నేర్పాడు. నహుషుడు సర్వవిద్యావేత్త సకల కళాపారీణుడూ అయ్యాడు.


అక్కడ రాజంతఃపురంలో ఇందుమతికి మెలుకువ వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది, సఖులను అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధివీధికీ ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలివారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ? ఎలా అపహరించగలిగారు? ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి.


No comments:

Post a Comment