Tuesday 1 August 2023

శ్రీదత్త పురాణము (214)

 


నువ్వు దత్తాత్రేయుడు కలిసి ఈ కృష్ణామలకి తరువుని ఇక్కడ సహ్యాద్రి మీద ఉన్న ఈ శుభప్రదమైన దత్తాశ్రమంలోనూ దండకలోనూ స్థాపించండి. నాకూ సంతోషం కలిగించండి. నువ్వు కూడా దీని నీడలో విశ్రాంతి తీసుకో. ఈ తరువును దర్శించిన వారుగానీ స్పృశించిన వారు కానీ సద్గతులు పొందుతారు - అంది. అప్పుడు పరశురాముడు ఆ తరువులో ప్రవేశించి తన ఉనికితో దానికి త్రిదేవత్వాన్ని కలిగించాడు. అటుపైని బ్రహ్మ దేవుడు రేణుకా దేవి వద్ద శలవు తీసుకొని తన సత్య లోకం చేరుకున్నాడు. రేణుక అంతర్థానం చెందింది. దత్తాత్రేయుడు ఆ తల్లికి నమస్కరించి ఆ తరువు క్రింద ధ్యాన నిష్ఠకు ఉపక్రమించాడు. తలపెట్టిన యజ్ఞం పూర్తి అయ్యే వరకూ భార్గవరాముడు సైతం ఆ తరువు చెంతనే విశ్రాంతి తీసుకున్నాడు.


పింగళనాగ వృత్తాంతం


ప్రణీతానది ఒడ్డున కృష్ణామలకీ తరుచ్ఛాయలో ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయుడి దగ్గరకు ఒకనాడు పింగళనాగుడు అనే ముని దర్శనార్ధం వచ్చాడు. సభక్తిగా నమస్కరించి దత్త దేవుడి అనుమతితో చేరువలో కూర్చున్నాడు.


స్వామీ! నాకు తెలీక అడుగుతున్నాను. నా అజ్ఞానాన్ని క్షమించి నా సందేహం తొలగించండి. నాకు తెలిసీ నాలుగు ఆశ్రమాలే ఉన్నాయి. వాటికి వాటి నియమ నిబంధనలున్నాయి. వీటిలో తమరు ఏ ఆశ్రమానికి చెందిన వారుగా కనిపించడం లేదు. మీరిద్దరూ దిగంబరులై ఉంటారు. మదిరా మాంసాలను పుచ్చుకుంటూ కనిపిస్తారు. దిగంబరీ! ఈ అందగత్తెను ఎప్పుడూ అంకపీఠం దింపవు. ఏమిటి స్వామి! ఇదంతా. దీన్ని ఏ ఆశమ్రం అంటారు? ఈ ఆశ్రమదీక్షను మీకు ఇచ్చిన ఆ గురు మహానుభావుడెవరు? ఎంతో కాలంగా మిమ్మల్ని అడగాలని. ఇప్పటికి కుదిరింది. కాసింత విశ్రాంతిగా ఏకాంతంగా దొరికారు. అందుకని అడిగేశాను. నొప్పిస్తే క్షమించండి చెప్పకూడనిది అయితే చెప్పవద్దు. తెలుసుకోవాలని మాత్రం చాలా కుతూహలంగా ఉంది.


No comments:

Post a Comment