Saturday 12 August 2023

శ్రీదత్త పురాణము (225)

 


ఆశీర్వదించిన గురువుకి ప్రణమిల్లి కపిలగోవును బహూకరించాలి. ఇది యధాశక్తిగా చెయ్యవచ్చు. ఆపైన సూర్యుడికి శివునికి నమస్కరించి ఆ గర్భిణి హుతాశేషమైన చరువును భుజించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్షం సప్తమీ తిథినాడు చేస్తే చాలా మంచిది. దీన్ని శ్రద్ధగా ఆచరించండి అని ఉపదేశించి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు.


ధర్మజా! కృతవీర్య దంపతులు ఈ వ్రతాన్ని చేసినందువల్లనే వీరి కుమారుడు కార్తవీర్యార్జునుడు దీర్ఘాయుష్మంతుడై ఎనభై అయిదువేల సంవత్సరాలు భూగోళాన్ని పరిపాలించగలిగాడు. భాస్కరుణ్ని ఆరోగ్యం కోరాలి. అగ్నిని ధనం కోరాలి. శంకరుణ్ని జ్ఞానం కోరాలి. జనార్ధనుణ్ని పద్ధతి కోరాలి అని పెద్దలు చెబుతున్నారు. ఈ సప్తమీస్నపన వ్రతాన్ని ఏకాగ్రచిత్తంతో పఠించినవారూ, విన్నవారు, సకల శుభాభీష్ట సిద్ధులూ పొందుతారు అని మహర్షుల వాక్కు. ధర్మరాజా కృతవీర్యుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక నోములూ, వ్రతాలూ చేసింది. ఒక రోజు యాజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయిని దర్శించింది. కుశల ప్రశ్నల అనంతరం తన మనోవేదనను చెప్పుకుంది. గుణవంతుడు, వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడు కలిగేందుకు ఎదైనా నోమో, వ్రతమో ఉపదేశించమని అభ్యర్ధించింది. అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది.


అనంత వ్రతం


శీలధరా! కోరికలు తీరాలంటే జనార్ధనుణ్ని ఆరాధించటం ఒక్కటే మార్గం. అనంతవ్రతం అని ఒకటుంది చెబుతాను విను. మార్గశీర్షమాసంలో మృగశిరా నక్షత్రం ఉన్నరోజున ఉదయాన్నే లేచి స్నానాదికం ముగించుకుని గోమూత్రం కాసింత పుచ్చుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ వ్రతం చెయ్యాలి. ముందుగా అనంతుడి వామపాదాన్ని పూలతో గంధాక్షతలతో యధాశక్తిగా పూజించాలి. అనంతుడు సర్వవాంఛప్రదుడు. అనంత ఫలదాయకుడు. నాకు ఈ జన్మలోనూ రాబోయే జన్మల్లోనూ భద్రప్రదుడు అగుగాక. నేను చేస్తున్న ఈ అనంతవ్రతంతో సంతుష్టుడై ఈ పూజలకూ ఆర్చనలకూ సంబరపడి అనంతుడు నాకు అనంత పుణ్యోపచయాన్ని సమకూర్చుగాక- అని సంకల్పించుకొని ఏకాగ్ర చిత్తంతో అనంతుణ్ని ధ్యానించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అలాగే పురోహితుడికి నమస్కరించి దక్షిణ తాంబూలాలు అందించాలి. రాత్రికి తైలవర్జితమైన ఆహారం తీసికోవాలి.


No comments:

Post a Comment