Monday 21 August 2023

శ్రీదత్త పురాణము (234)

 


ఋచీకుడు వరుణుణ్ని అడిగి అటువంటి వెయ్యి గుర్రాలూ పొందాడు. అవ్వి కాన్యకుబ్జం చెంత గంగ నున్చి పైకి వచ్చాయి. అప్పటి నుంచీ ఆ రేవుకి అశ్వతీర్థమనే పేరు స్థిరపడింది. ఆ గుర్రాలని గాదికి అందించి ఋచీకుడు సత్యవతిని అగ్నిసాక్షిగా సొంతం చేసుకున్నాడు. కావ్యకుబ్జంలోనే ఉండి రాజభోగాల్లో శృంగార క్రీడల్లో మునిగితేలుతున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున ఋచీకుడి తండ్రి భృగువు వచ్చాడు. కొడుకునీ కోడల్నీ వారి అన్యోన్యదాపంత్యాన్ని చూసి సంతోషించాడు. కోడలు చేస్తున్న ఉపచారాలకి సంబరపడ్డాడు. భృగువును ఉన్నతాసనం మీద అర్చించి ఆ దంపతులు వినయంగా అతడికి చేరువులో నేలమీద కూర్చున్నారు.


సత్యవతీ ! నీ గుణగణాలకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు భృగువు. తనకూ తన - తల్లికీ పుత్రసంతానం కలిగేట్టు వరమిమ్మంది సత్యవతి. భృగువు తథాస్తు! అన్నాడు. ఋతుస్నాతవై నువ్వు మేడిచెట్టును కౌగిలించుకో. ఇదిగో ఈ హవిస్సును (చదువు) భుజించు. అలాగే నీ తల్లి రావిచెట్టును కౌగిలించుకోవాలి. ఈ చఱువును ఆరగించాలి భద్రంగా పట్టుకు వెళ్ళి దీన్ని మీ తల్లికి అందించు - అని చెప్పి రెండు చరువులూ కోడలికి ఇచ్చాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు. తల్లీ కూతుళ్ళు తాము కౌగలించుకోవలసిన తరువులనూ భుజించవలసిన చరువులనూ పొరపాటున తారుమారు చేసుకున్నారు. దీన్ని గమనించిన భృగువు మళ్ళీ వచ్చి జరిగిన పొరపాటుని కోడలికి తెలియజెప్పాడు. ఇందువల్ల - నీకు పుట్టే బ్రాహ్మణుడు క్షత్రియాచారపరుడవుతాడు. నీ తల్లికి జన్మించే క్షత్రియుడు బ్రాహ్మణాచారపరుడవుతాడు. ఇంతకన్నా ప్రమాదం ఏమీలేదులే అని కోడల్ని ఓదార్చాడు. అయితే ఇది సత్యవతికి నచ్చలేదు. తన కొడుకు బ్రాహ్మణాచారపరుడే కావాలని క్షత్రియాచారాన్ని తరువాత తరానికి అంటే మనుమడికి సంక్రమించేట్టు చెయ్యమనీ అభ్యర్ధించింది. తథాస్తు! అన్నాడు భృగుమహర్షి.


కొంతకాలానికి సత్యవతి గర్భం ధరించింది. మగబిడ్డను ప్రసవించింది. జమదగ్ని అని నామకరణం చేశారు. అతడు చతుర్వేదాలను అభ్యసించి షట్ శాస్త్రాలను స్వాధీనం చేసుకొని మహాతేజస్వీ అయ్యాడు, మహాతపశ్శాలి అయ్యాడు. ప్రసేనజిత్తు కూతురు రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వసుమంతుడు సుషేణుడు వసువు విశ్వావసువు - - రాముడు - అని అయిదుగురు కుమారులు కలిగారు.


No comments:

Post a Comment