Sunday 20 August 2023

శ్రీదత్త పురాణము (233)

 


ధర్మ సంభవా ! భృగువంశంలో జనుదగ్ని కుమారుడుగా పుట్టి భార్గవరాముడు జామదగ్నుడు అనే పేరు పొంది అతి వజ్రాయుధమైన గండ్రగొడ్డలిని ధరించి పరశురాముడై మహావీరుడుగా విఖ్యాతిపొందిన ఆ మహానుభావుడి చరిత్ర చెబుతాను ఆలకించు.


హైహయవంశంలో పుట్టిన కార్తవీర్యార్జునుడు భార్గవ రాముని చేతిలో నిహతుడయ్యాడు. అతడికి వెయ్యి చేతులుండేవి. దత్తాత్రేయ ప్రసాదం వల్ల దివ్యకాంచన విమానం ఉండేది. అతడి రధమూ అటువంటిదే. దాని గమనానికి అడ్డూ ఆపూ లేదు. ఆ రధం అధిరోహించి సమస్త భూపాలకుల్ని ఓడించి సామంతుల్ని చేసుకున్నాడు. ఏడు ద్వీపాల వసుంధరను మొత్తం తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. అహంకరించి దేవతలను యక్షులనూ ఋషులనూ సమస్త భూతాలను పీడించసాగాడు. భరించలేక దేవతలూ ఋషులూ కలిపి వెళ్ళి విష్ణుమూర్తికి మొరపెట్టుకున్నారు. కార్తవీర్యుణ్ని సంహరించు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. ఇంద్రుడు కూడా తన చేదు అనుభవం ఒకటి చెప్పాడు. శనీ సమేతుడై నందనంలో విహరిస్తున్న తనను దివ్యవిమానంమీద అటువైపు వచ్చిన కార్తవీర్యార్జునుడు అవమానించాడనీ, అతడి ఆగడాలు మితిమీరిపోయాననీ ఇక ఉపేక్షింపరాదనీ విన్నవించాడు. విష్ణుమూర్తి అందరి వేదనలూ విన్నాడు. ఆలోచిస్తాను వెళ్ళిరండి - అని పంపించాడు. తాను బయలుదేరి తన బదరికావనం చేరుకున్నాడు.


ఇదేకాలంలో కాన్యకుబ్జాన్ని గాధి అని ఒక మహారాజు పాలిస్తున్నాడు. అతడు మహాబలశాలి. పరాక్రమశాలి. పరిపాలన బాధ్యతల్ని మంత్రులకి అప్పగించి అతడు కొంతకాలం సతీసమేతుడై వనవాసం చేశాడు. ఆ సమయంలో ఆ రాజదంపతులకి ఒక ఆడపిల్ల పుట్టింది. సత్యవతి అని పేరుపెట్టారు. దినదిన ప్రవర్థమాన అయ్యింది. అప్సరసలను తలదన్నే సౌందర్యం. అందానికి తగిన గుణసంపద, భార్గవ వంశంలో పుట్టిన ఋచీకుడు సత్యవతిని చూసి ముచ్చటపడ్డాడు. తనకిచ్చి వివాహం చెయ్యమని గాధిదంపతుల్ని అభ్యర్ధించాడు. సంశిత ప్రతుడైన ఆ బ్రాహ్మణుణ్ని చూసి తన కులాచారం వెల్లడించాడు గాది. శరీరమంతా తెల్లగా ఉండి ఒక్క చెవి నల్లగా ఉండే వెయ్యి గుర్రాలు కన్యాశుల్కంగా ఇచ్చి సత్యవతిని పరిణయమాడమన్నాడు. శుల్కం తీసుకోకుండా కన్యాదానం చెయ్యడం మా కులాచారం కాదని చెప్పి కాన్యకుబ్జానికి వెళ్ళిపోయాడు.


No comments:

Post a Comment