Wednesday 9 August 2023

శ్రీదత్త పురాణము (222)

 


మునీశ్వరులారా ! బ్రహ్మరూపిణి, సంధ్యారూపిణి రేణుకాదేవిని మూడు కాలాల్లోనూ సందర్శించి వందన మాచరించగలిగినవారే మహానుభావులు. లౌకికమైన ఆటుపోట్లు కర్మానుభవక్లేశాలూ దీనికి అడ్డంకి కాకూడదు. అలాసాగించే సంధ్యావందనం వల్లనే వీరూ వందితులు కాగలుగుతారు. మూడుకాలాలు అంటే చైత్రం - ఆషాడం - కార్తీకం - ఈ మూడు కాలాల్లోనూ ఏ ఒక్కనెలలో రేణుకాదేవిని ఉపాసించినా ఇహపరాల్లో భుక్తి ముక్తులకు లోటు వుండదు. మూడు కాలాల్లో ఉపాసిస్తే ఇక చెప్పేదేమిటి ఇహంలో ఇంద్రభోగాలు అనుభవించి పరమపదం చేరుకుంటారు. అటువంటి సర్వకాలాను వర్తిని - పరబ్రహ్మ స్వరూపిణి - సంధ్యాదేవి అయిన రేణుకా మాతకే నేను వందనం ఆచరించి వచ్చాను. గృహాలలో ఉండేవారు పవిత్రులై కాలత్రయస్వరూపిణి, సంధ్యా స్వరూపిణి అయిన ఈ రేణుకాదేవిని భక్తితో నిత్యమూ ఉపాసిస్తే ఆమె దర్శనం ఆమె అనుగ్రహం వెంటనే పొందుతారు. ఇహంలో భోగాలను అనుభవించి సద్గతి పొందుతారు.


ఇలా రేణుకాదేవియే సంధ్యాదేవి అని చెప్పి దత్తాత్రేయుడు మళ్ళీ అంతర్థానం చెందాడు. ఇది విన్న ఆ దేవజాతులవారూ, ఋషులూ మునులూ సంబరపడి సకల తీర్ధోదకాలతోనూ వరాహరూపి అయిన విష్ణుమూర్తికి అభిషేకం చేసి అత్యంత భక్తి ప్రపత్తులతో యోగమాత రేణుకాదేవిని అర్చించి విష్ణు స్వరూపం అయిన ఆమలకీ తరువుకి ప్రదక్షిణ నమస్కారం చేసి అంతర్ధానం చెందిన దత్తాత్రేయ స్వామికి మనస్సుల్లోనే వందనాలర్పించి దత్తస్వామి మహిమలను రేణుకా మహిమలనూ తలచుకొంటూ కొనియాడుతూ ఎవరిస్థానాలకు వారు బయలుదేరారు. దీపకా ! అలనాడు కైలాసం మీద మహర్షులకు స్కందుడు స్వయంగా చెప్పిన రేణుకా మహిమ ఇది. విన్నావు గదా ! మరిక నీ కోరిక ఏమి ? అన్నాడు వేదధర్ముడు.


గురుదేవా! దత్తాత్రేయుడి ప్రభావమే నాకు ఇంకా వినాలనీ తెలుసుకోవాలని ఉంది. కార్తవీర్యార్జునుడ్ని అంతటి మహావీరుణ్ని చేసిన దత్తదేవుడి దయను ఎంతని కొనియాడగలం. అటువంటి పుత్రుణ్ని పొందడానికి కృతవీర్య దంపతులు ఏ పుణ్యాలు చేసారో ? ఏ వ్రతాలు ఆచరించారో ? సాధన సంపత్తి లేకుండా ఫలాలు దక్కవు గదా. ఆ వివరాలు చెప్పండి - అని అభ్యర్ధించడమే తడవుగా వేదధర్ముడు ఆరంభించాడు.


దీపకా ! వెనుకటికి పాండవ మధ్యముడైన అర్జునుడు అడిగితే శ్రీ కృష్ణుడు ఈ వృత్తాంతం అంతా అతడికి వివరించి చెప్పాడు. అదే నేను నీకిప్పుడు యధాతధంగా చెబుతాను. ధర్మజకృష్ణ సంవాదంగా నడుస్తుంది విను.


No comments:

Post a Comment