Friday 11 August 2023

శ్రీదత్త పురాణము (224)

 


మృతవత్స అయిన ఇల్లాలు మళ్ళీ గర్భందాల్చాక ఏడోనల రాగానే గ్రహతారాబలాదులు సరిచూసి ఒక శుభముహూర్తం నిశ్చయించుకోవాలి. ఆ పూట దంపతులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పురోహితులచేత పుణ్యాహవచనం చేయించుకోవాలి. పేడతో అలికి ముగ్గులు పెట్టిన మండపంలో అగ్నిహోత్రుణ్ని స్థాపించాలి. బియ్యం రక్తశాలేయాలు ఆవుపాలతో కలిపి చరువులు తయారుచేసుకోవాలి. వాటిని సూర్య - రుద్ర - సప్త మాతృకా గణాలకు ఆహుతి చెయ్యాలి. పౌరసూక్షాలతో సూర్యదేవునికి ప్రత్యేక హోమాలు చేయాలి. జిల్లేడు లేదా మోదుగ సమిధలనే హోమాలకు ఉపయోగించాలి. యవలూ, నల్లనువ్వులతో అష్టోత్తర శతంగా ఈ హోమాలు సాగాలి.


ఏడు కలశాలను గంగాజలంతో నింపాలి. ఆ కలశాలను మండపంలో నాల్గు కోణాల్లో నాల్గు, తూర్పున ఒకటి, పడమట ఒకటి, మధ్యలో ఒకటి ఉంచాలి. మంచి గంధంతో పరిమళ భరిత పూలతో దర్భలతో కలశారాధన చెయ్యాలి. ఏడు కలశాలని ఏడు అద్దాలతో కప్పాలి. సప్తర్షుల్ని వీటిలోకి ఆహ్వానించి ఆవాహన చెయ్యాలి. తూర్పు పడమర కలశాల్లోకి సూర్యచంద్రుల్ని అభిమంత్రించాలి. ఓషధీ సూక్తాలు పఠించాలి. పంచప్రకార జలన్వితాలు చెయ్యాలి. పంచరత్నాలతో పంచపల్లవాలతో అలంకరించాలి. శుద్ధి చేసిన మట్టి తెచ్చి ఏడుకలశాల్లోనూ వెయ్యాలి. రత్నాలు వేసిన అయిదు కలశాల నుండీ మధ్యమ కలశాన్ని పురోహితుడు సూర్యమంత్రాలు ఉచ్ఛరిస్తూ వుండగా పైకి తీయాలి. భోజనాలు చేసి నూతన వస్త్రాలూ ఆభరణాలూ ధరించిన ఏడుగురు దంపతులూ (సంతానం కలవారై వుండాలి) ఆ కలశాన్ని అందుకొని మండలాకారంగా నిలబడిముందుకు ఒకింతవంగి అందులోని నీళ్ళుపంపుతూ మృతవత్స (ఇప్పుడు ఏడోనెల గర్భిణి) అయిన ఆ యజమానురాలిని ఏకధారగా అభిషేకించాలి. గర్భస్థ శిశువుకు దీర్ఘాయుష్యాన్ని గర్భిణీకి జీవర్పుత్రతనూ ఆకాంక్షించి ఆశీర్వదించాలి. నవగ్రహాలు అష్ట దిక్పాలకులూ హరిహర హిరణ్య గర్భులూ శిశువును రక్షించాలని దుష్టగ్రహాలు తల్లి బిడ్డలను పీడించక తొలగిపోవాలని దీవించాలి. అటుపైన యజమానదంపతులు ఈ ఏడుగురు దంపతుల్ని షోడశోపచారములతో అర్చించాలి. గణేశుడ్నీ కుమారస్వామిని అర్చించి బంగారంతో ధర్మరాజు ప్రతిమ చేయించి దాన్ని తిలపాత్రమీద ఉంచి గురువుకి దానం ఇవ్వాలి. విత్తలోభము సుతారమూ పనికిరాదు. భూరిదక్షిణలతో, నూతన వస్త్రాలతో, విందు భోజనాలతో బ్రాహ్మణులనూ. బంధుమిత్రులనూ, సంతృప్తి పరచాలి. అయ్యింతరువాత గురువు ఇలా ఆశీర్వదించాలి- బాలుడు సుఖంగా నూరేళ్ళు జీవించుగాక ! ఇంకా ఏమైనా దురిత శేషముంటే అది బడడబాముఖంలో పడిపోవుగాక.


బ్రహ్మ - రుద్ర - విష్ణు - స్కంద - వాయు - శక్ర వహ్ని ప్రభృతులు అందరూ దుష్టగ్రహాల నుండి మాతాశిశువుల్ని రక్షిస్తూ సకల శుభాలు కలిగింతురుగాక. ఇలాంటి శుభాశీస్సులు అందించాలి.


No comments:

Post a Comment