Saturday 6 September 2014

దూర్వా (గరిక) మహత్యం

దూర్వా (గరిక) మహత్యం గురించి క్లుప్తంగా కధ చెప్పుకుందాం

ఒకసారి సమ్యమనీపూరంలో జరుగుతున్న మహోత్సవాన్ని తిలకించడానికి సర్వదేవతలు, గంధర్వులు, అప్సరసలు అందరూ తరలివచ్చారు. ఆ సభలో తిలోత్తమ నాట్యం చేస్తుండగా ఆమెను చూసి యముడు కామించగా, ఆయన రేతస్సు పతనమైంది. దాని నుంచి జ్వాలలతో మండుతోన్న వికృతరూపుడు, భయంకరమైన కోరలుగల అనలాసురుడనే రాక్షసుడు జన్మించాడు. వాడు చేసే పెద్దపెద్ద అరుపులకు లోకాలు హడలిపోయాయి. వాడి అరుపలకు భయపడిన ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరుణువేడగా, విష్ణుమూర్తి వారిని తీసుకుని గణపతి వద్దకు వెళ్ళి, బహువిధాలుగా స్తోత్రం చేస్తారు.

అప్పుడు బాలగణపతి వారితో 'దేవతలారా! అనలాసురిని భయం నుంచి రక్షించడానికే నేను అవతరించాను' అని చెప్పి, వాడిని చూడగానే
మీరు నన్ను ఉద్రేకపరచండి. నేను వాడిని సంహరిస్తాను అన్నాడు. ఇంతలో అనలాసురుడు భూలోకానికి వచ్చి, విజృంబించాడు. వెంటనే మునులు భయంతో పరుగులు తీశారు. వాడి నుంచి తప్పించుహ్కోవడం బాలగణపతికి కూడా సాధ్యకాదని, ఆయన్ను కూడా పారిపొమ్మని అరిచారు. కానీ గణపతి వారి అరుపులకు భయపడలేదు. అనలాస్రుడు గణపతిని చూసి, ఆయన బాలస్వరూపాన్ని చూసి నవ్వగా, గజాననుడు మాహపర్వతంలా తన రూపాన్ని విస్తరించి కాలాగ్నిలా మండిపడుతున్న అనలాసురిడిని తన యోగమాయాబలంతో పట్టుకుని మ్రింగేశాడు. వాడి వేడి కారణం చేత గణపతికి విపరీతమైన తాపం కలిగింది.

బాలగణపతి తాపన్ని తీర్చడం కోసం ఇంద్రుడు చల్లటి చంద్రకళను ఇచ్చాడు. అది ధరించిన గణపతి ఫాలచంద్రుడయ్యాడు కానీ ఆయన తాపం తీరలేదు. వరుణుడు సముద్రాలలో ఉన్న చల్లని జలాలతో అభిషేకించాడు. విష్ణువు కమలాలను ప్రసాదించాడు. అయినా గణపతి తాపమ తగ్గలేదు. శివుడు వేయి-పడగల సర్పాన్ని గణపతి ఉదరానికి బంధించగా, గణపతికి వ్యాళబద్ధుడనే పేరు వచ్చింది. ఆయన స్వామి తాపం తీరలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు శక్తులను గణపతికి ప్రసాదించగా, తాపం తీరడం కోసం వారు గణపతి హత్తుకున్నారు, కానీ గణపతి తాపం తీరలేదు. అగ్నిలో వేసినది, అగ్నిలోనే లయమైనట్టు, పరబ్రహ్మమైన గణపతిలో సిద్ధిబుద్ధి ఐక్యం అయ్యారు. ఆఖరున 88,000 మహర్షులు వచ్చి, ఒక్కక్కరు 21 గరికపోచలను సమర్పించగా, స్వామి తాపం తగ్గిపోయింది. ఆ విషయం తెలుస్కున్న దేవతలు బాలగణపతిని దూర్వాంకురాలతో అర్చించారు. గరికతో అర్చించడం వలన పరమానందం పొందొ గణపతి దేవతలకు, ఋషులకు అనే వరాలు ప్రసాదించి 'ఎంత భక్తితో నా పూజ చేసినా దూర్వాకుర రహితమైన పూజ వ్రాధా అవుతుంది. అందువలన నా భక్తులైనవారు ప్రాతఃకాలంలో ఒక్కతికానీ, 21 కానీ దుర్వాలతో నన్ను అర్చిస్తే, వందయజ్ఞాలు చెసినదానికంటే అధికఫలం లభిస్తుంది. నేను గరికపోచలతో అర్చించినవారికి సులభంగా ప్రసన్నుడనవుతాను అంటూ గణపతి పలికాడు.

అందుకే గణపతి పూజలో గరికకు విశిష్టవంతమైన స్థానం ఉంది. 

No comments:

Post a Comment