Sunday 18 September 2016

హిందూ ధర్మం - 224 (జ్యోతిష్యం - 6)

భారతీయ జ్యోతిష్యవేత్తలలో చిరస్మరణీయుడు బ్రహ్మగుప్తుడు. ఈయన సా.శ.598-668 మధ్య జీవించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈయన గొప్ప గణితవేత్త, జ్యోతిష్యుడు (ఖగోళవేత్త). గణిత, ఖగోళ శాస్త్రలను చెందిన అనేక రచనలు చేసాడు. వాటిల్లో ప్రముఖమైనది బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం. కలియుగ ప్రపంచ చరిత్రలో సున్నాని ఒక సంఖ్యగా వాడిన మొట్టమొదటివాడు, బ్రహ్మగుప్తుడేనని పాశ్చాతులు చెప్తారు. సున్న గణించడానికి నియమాలని నిర్దేశించాడు. రెండు ఋణసంఖ్యల గుణకారం ధనాత్మకం అవుతుందని ఆధునిక గణితం చెప్పుకుంటున్న నియమం మొదటగా కనిపించేది, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతంలోనే. తన శ్లోకాలను ఛందోబద్ధంగా రాయడం వలన, ఈ శ్లోకాలు పాడుకోడానికి కూడా అనువుగా ఉంటాయి.

బ్రహ్మగుప్తుడు సా.శ 598 సంవత్సరంలో, నేటి రాజస్తాన్్లోని భిన్మల్ పట్నంలో జన్మించాడు. భిన్మల్ యొక్క పూర్వనామం భిల్లమల. ఇది గూర్జరుల మూలస్థానం. ఇతని తండ్రి జిష్ణుగుప్తుడు. వ్యాఘ్రముఖుడనే రాజు ఆస్థానంలో ఉన్నాడు. ఉజ్జయినిలోని ఖగోళ వేధశాలకి అధిపతిగా పనిచేసిన కాలంలోనే నాలుగు రచనలు చేసాడు. క్రీ.శ 624లో చాదమేఖల, 628లో బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, 665లో ఖండఖాద్యకం, 672లో దుర్ఖేమ్నన్యార్ద. బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, వీటన్నింటిలోకి ప్రపంచప్రసిద్ధమైనది.

ఆర్యభట్టు రాసినఖగోళ శాస్త్రంలోని గణిత విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశోధించిన బ్రహ్మగుప్తుడు, శూన్యం అనగా సున్నాను, అనంతం అంటే ఇంఫినిటి మొదట కనిపెట్టాడు (మొదట అన్నప్పుడు ఆధునిక ప్రపంచంలోని పశ్చిమ దేశలవారి దృష్టి కోణం నుంచి చెప్పుకుంటున్నామని అర్దం చేసుకోవాలి. మన దేశంలో అప్పటికే శాస్త్రాలన్నీ అభివృద్ధి చెంది ఉన్నాయి, అన్యదేశాల్లో వారు ఆ సమయానికి అజ్ఞానంలో మునిగి ఉన్నారు. వారికి కలియుగ చరిత్రయే తెలియదు, ఇక పూర్వపు యుగాలు, కల్పాల చరిత్ర ఎలా తెలుస్తుంది. అందుకే వారి దృష్టికోణం సనాతనధర్మంలో చెప్పబడిన అనంతమైన కాలాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా చిన్నది, అత్యల్పం, అసలు పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు). సున్నా వినియోగంలో ఉపయోగించే సూత్రాలను నిబద్దం చేసిన ఘనత ఈయనదే. భౌతికంగా ఇవి లేకపోయినా మానసికంగా వీటిని సృష్టించాడు. సున్నాకు ఏ సంఖ్యను కలిపినా, ఏ సంఖ్య నుండి సున్నాను తీసివేసినా ఏ మార్పు ఉండదు అని సూత్రీకరించాడు. సున్నాను ఏ సంఖ్యతో హెచ్చించినా సున్నాయే వస్తుందని, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే అనంతం వస్తుందని తెలిపాడు. దీనికి అతను పెట్టిన పేరు ఖహారం. ఈయన తరువాతి వాడైన భాస్కరాచార్యుడు ఖహారాన్ని ఒక శ్లోకంలో నిబద్దం చేశాడు . ఆ శ్లోకం ఇది. "వాదా దౌవియత్ ఖం ఖేన దాతే -ఖహారో భవేత్ ఖేన భక్తస్చ రాశిహ్".

అప్పటివరకు అందరు కష్టసాధ్యం అని భావించిన ax^2+1= y^2 అనే సమీకరణాన్ని సాధించింది బ్రహ్మగుప్తుడే. బ్రహ్మగుప్తుడు తన 30వ ఏట "బ్రహ్మ స్పుట సిద్ధాంతం" అనే గ్రంధాన్ని వ్రాశాడు. మొదటి సారి ఈయన కని పెట్టిన "దశాంశ పద్ధతి" కాలక్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. ఈగ్రందం ప్రపంచ గణిత శాస్త్రానికే కొత్త ద్వారాలు తెరిచింది. పాశ్చాత్య దేశాల అంకెల కంటే బ్రహ్మ గుప్తుని అంకెల విధానం శాస్త్రీయంగా ఉందని ప్రపంచ గణిత మేధావులు మెచ్చుకొన్నారు. తన రెండవ పుస్తకం "కరణ ఖండ ఖడ్యక" లోను గణిత శాస్త్రానికే ప్రాధాన్యత నిచ్చాడు. అంకగణిత, బీజ గణిత మొదలైన విభాగాలపై ప్రాధమిక సిద్ధాంతాను ఇందులో చేర్చాడు .

బ్రహ్మ గుప్తుడు కనిపెట్టిన సున్నాను ఆరబిక్ భాషలో సిఫర్ అంటే, గ్రీకులో జిఫర్ అన్నారు........ అదే ఇంగ్లీష్ లో 'జీరో' అయింది. భాస్కరుడికి ముందే బ్రహ్మ స్పుట సిద్ధాంతం చాలా దేశాల్లో ప్రచారమైంది. సా.శ770లో ఉజ్జయినిలోని ప్రముఖ గణిత పండితుడు కంకభట్టును బాగ్దాద్ రాజు తన దర్బారుకు పిలిపించి ఆరబ్ పండితులకు భారతీయ అంకెల గణన పద్ధతిని నేర్పాడు. అలా సనాతన భారతీయ విజ్ఞానం మరల మరల ప్రపంచానికి జ్ఞానబొక్ష పెట్టింది. అప్పుడే బ్రహ్మస్పుటసిద్ధాంత గ్రంథం అరబిక్ భాషలోకి తర్జుమా అయింది. ఈ విధంగా ఏడవ శతాబ్దానికి పూర్వార్ధంలోనే భారతీయ అంకెలు, సంఖ్యామానం సిరియా, అరేబియా,ఈజిప్ట్, ఆ తర్వాత క్రమంగా పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. అరేబియా నుంచి వచ్చిన అంకెలు కనుక పాశ్చాత్యులు 'ఆరబిక్ అంకెలు' అన్నారు కానీ ఆరబ్బులు మాత్రం 'హిందూ అంకెల విధానం'(ఆల్ ఆర్కాన్ ఆల్ హింద్) గానే పిలుస్తారు. కానీ ఇప్పటికి మన దేశంలో పిల్లలకు వాటినిఒ అరబిక్ అంకెలుగానే పాఠశాలల్లో బోధిస్తున్నారు.

ప్రొఫెసర్ వాలెస్ అనే చారిత్రిక పరిశోధకుడు భారతీయుల గణిత, ఖగోళ విషయాలు చాలా నిర్దుష్టమైనవనీ, జ్యామితి సూత్రాల ఆధారంగాగా ఖగోళ రహస్యాలు సాధించారని, ఇదంతా క్రీ.పూ.3,000. సంవత్సరాలకు ముందే సాధించిన భారతీయ విజ్ఞానం అని మెచ్చుకొన్నాడు. జ్యామితి అనేది భారతదేశంలోనే పుట్టిందని, ఇది పాశ్చాత్య దేశాల వారి దృష్టి సోకని ఎంతో ముందు కాలంలోనే జన్మించిందని, ఎన్నో 'ఎలిమెంటరి ప్రపోజిషన్లు' భారత దేశం నుండే గ్రీసుకు వ్యాపించాయని, భారతీయ విజ్ఞులైన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఆరాధనా భావంతో మెచ్చుకొన్నాడు వాలెస్.

బ్రహ్మగుప్తుని ప్రతిభను గుర్తించిన వ్యాఘ్రముఖ మహారాజు తన ఆస్థానానికి ఆహ్వానించి, సన్మానించి ఆస్థాన పండితునిగా గౌరవాన్నిచ్చాడు. అప్పటి వరకు నిత్య జీవనానికి కూడ ఇబ్బంది పడ్డ బ్రహ్మగుప్తునికి, ఆ తర్వాత పరిశోధన చేయడానికి అవకాశం లభించినట్టైంది. అంక గణితాన్ని, బీజ గణితాన్ని రెండు ప్రత్యేక విభాగాలుగా మొదటి సారిగా గుర్తించిన ఘనత కూడా ఈయనదే. ఈయన శిష్యుడు భాస్కరాచార్య గురువును సత్కరించి 'గణక చక్ర వర్తి చూడామణి' అనే బిరుదును ఇచ్చాడు.

ఈయన రాసిన బ్రహ్మస్పుటసిద్ధాంతంలో ఖగోళ శాస్త్ర ప్రస్తావన ఉంది. పంచాంగ గణనన, గ్రహగతులు, కూటములు, సూర్య, చంద్ర గ్రహణాల గణనను అందించారు. బ్రహ్మస్పుటసిద్ధాంతంలో చంద్రుడే సూర్యునికంటే భూమికి దగ్గరగా ఉన్నాడని, సూర్యకాంతిని గ్రహించే ప్రకాశిస్తున్నాడని, స్వయంగా చంద్రునకు కాంతి లేదని వివరించారు. చంద్రకళలలో తేడాకు కారణం సూర్య, చంద్రుల గతి, వారి మధ్య ఉన్న కోణమేనని, ఒకవేళ చంద్రుడు, సూర్యుడికంటే దూరంగా పైన ఉండి ఉంటే, చంద్రబింబంలో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.

To be continued ................

No comments:

Post a Comment