Friday 27 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 83 వ భాగం



ఋగ్వేదంలో పరోక్షంగా శంకరుల గురించి యుందని వ్రాసేరు:


"శ్రీరామం ప్రతి పుష్కరాభిధ మహాయక్షేన వేదత్రయీ 

వ్యాకరణావసరే విశిష్య కథితం, శ్రీ విష్ణు ధర్మోత్తరే 

ఏతాం ధేనుముపాహ్వయామి సుదుఘాం ఇత్యుద్రథం శంకరా 

చార్యం శిష్య చతుష్టయేన సహితం వందే గురుణాం గురుం" 


ఇందు గురువులకు గురువని యుంది. శ్లోకారంభంలో శ్రీరామం ఉంది. శంకరులకు రామునకు ఏమి సంబంధం?


రామాయణంతోనే రామచరిత్ర, పూర్తికాదు. అందు చెప్పనవి మిగిలిన గ్రంథాలలో ఉన్నాయి. అందులో ఒకటి యోగవాసిష్ఠం లేదా జ్ఞాన వాసిష్ఠం. రెండవది విష్ణుధర్మోత్తర పురాణం. వసిష్ఠుని నుండి అద్వైత జ్ఞానాన్ని రాముడు పొందాడు. అది విష్ణుపురాణానికి అనుబంధం. పుష్కరుడనే యక్షుడు రామునకట్టి ఉపదేశం ఇచ్చాడు. అందుకే శ్లోకంలో 'పుష్కరాభిధ మహాయక్షేన' అని ఉంది. రాముడే ఉపదేశం పొందాడంటే ఇచ్చిన వాడు పెద్దవాడై యుండాలి కదా. అందుకే మహాయక్షుడు వేదసారాన్ని అందించాడు. ఇక వేదమంత్రం గురించి:


"ఏతాం ధేనుం ఉపాహ్వయామి సుదుఘాం" (ఋగ్వేదం ప్రథమ మండలం - 164 సూక్తం, 26వ మంత్రం) ఆవు తనే పాలనిచ్చి దూడను సాకుతున్నట్లు ఈశ్వరుడట్లా ప్రజలను పాలిస్తున్నాడని ఈ వేదమంత్రానికి అర్ధం. విష్ణు ధర్మోత్తరంలో ఈ మంత్రానికి పరోక్షంగా అర్థం చెప్పబడినదని పుష్కరుడు రామునితో అన్నాడు. అద్వైతతత్త్వం మరిచిపోయిన కాలంలో ఆవు దూడకు పాలునిచ్చునట్లుగా పరమేశ్వరుడు శంకరాచార్య స్వామిగా వచ్చి జ్ఞానాన్ని అందిస్తాడని అంతేకాదు, నల్గురు శిష్యులతో అవతరిస్తాడని భాస్కరాచార్యుల వారు వ్రాసేరు.


No comments:

Post a Comment