Wednesday, 6 September 2017

భాద్రపద పూర్ణిమ- గణేశ ఆరాధన వైశిష్ట్యం

ఆకాశంలో ఎగిరే మూడు నగరాలను నిర్మించుకున్నత్రిపురాసురులు, తమ 3 నగరాలు ఒకే రేఖ మీదకు వచ్చినప్పుడే తమకు మృత్యువు రావాలని వరం పొందుతారు. త్రిపురాసుర సంహారానికి బయలుదేరిన శివుడు ఎన్నాళ్ళు యుద్ధం చేసినా, వారిని వధించలేకపోతాడు. అప్పుడు దీనికి కారణం ఆలోచిస్తాడు శివుడు. అంతలో పార్వతీ దేవి వచ్చి, అసురులతో యుద్ధానికి ముందు గణపతిని ఆరాధించలేదని, అందుకే ఇలా విఘ్నాలు ఎదురవుతున్నాయని చెప్తుంది. ఒకప్పుడు శివుడే అన్ని కార్యాలకు ముందు విఘ్నాధిపతి అయిన గణపతిని ఆరాధించాలని శాసనం చేశాడని, ఇప్పుడు తానే మరిచాడని గుర్తు చేస్తుంది. అప్పుడు శివుడు గణపతిని ఆరాధిస్తాడు. గణపతి సంతసించి ప్రత్యక్షమై తనను సహస్రనామాలతో అర్చించమని అడుగుతాడు. తన సహస్రనామాలను తానే స్వయంగా శివుడికి ఉపదేశిస్తాడు. అలా శివుడు గణపతిని అర్చించి త్రిపురాసురులను వధిస్తాడు.

శివుడు గణపతిని పూజించిన రోజు భాద్రపద పూర్ణిమ. కనుక ఈ రోజు తప్పకుండా గణపతిని ఆరాధించడం వలన సకల శుభాలను పొందగలమని పురాణ వచనం. ఈ రోజు గణపతి సహస్రనామాలను పఠించడం ఎంతో విశేషం.
----------------------



శ్రీ త్రిపురారి వరదో మహాగణపతి విజయతే ||

లోకానికి మర్యాద నేర్పాలి. శ్రేష్టులైన వారు ఏది ఆచరిస్తారో, అదే లోకులు పాటిస్తారు. లోకులు ఎవరిని ప్రేరణగా తీసుకుంటారో, వారు ఎలా ప్రవర్తించాలనే విషయంలో ప్రమాణం స్థాపిస్తారు. కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుడికి తెలియక కాదు. కానీ లోకులకు గణేశుని వైభవం తెలియాలి, ఆయన్ను విస్మరిస్తే ఎంతటి వారికైనా ఎలాంటి కష్టాలు వస్తాయో, ఎన్ని విఘ్నాలు కలుగుతాయో తెలియజెప్పాలి. అందుకే మహాదేవుడు త్రిపురాసుర సంహారం ముందు గణపతిని పూజించలేదు. ఆ తర్వాత పూజించి, అనుగ్రహం పొందినట్లుగా లోకానికి చూపాడు. ఇదే క్రమంలో పెద్ద పెద్ద విఘ్నాలను సైతం పిండి చేసి, విజయం ప్రసాదించగల గొప్ప మహా మాలమంత్రం స్వరూపమైన సహస్రనామం కూడా జనులకు అందాలి. అలా విజయప్రాప్తికి, విఘ్నధ్వంసం కోసం గణపతి ఉపదేశంతో శివుడు చేసిన స్తోత్రం శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రం.

శివుడు గణపతి గురించి తపస్సు ఆచరించిన, స్వామిని 20 చేతులతో, 10 తలలతో మహాగణపతిగా ప్రసన్నం చేసుకున్న ప్రదేశం రంజన్‌గావ్. మహారాష్ట్రలో అష్టవినాయక క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ఈనాటికీ ఉంది. ఒకప్పుడు ఇక్కడి స్వామి ఉగ్రరూపంతో ఉండేవారని, ఆ తర్వాత శాంతమూర్తిని ఇక్కడ ప్రతిష్టించారని కొందరు పెద్దలు చెప్తారు. అలా శివుడు మహాగణపతిని ప్రసన్నం చేసుకుని, శ్రీ గణేశ సహస్రనామాలతో స్తుతించిన రోజే భాద్రపద పూర్ణిమ. ఇక్కడే గణేశుడి శివుడి ద్వారా లోకానికి ఒక సందేశం ఇస్తాడు. తన అనుగ్రహం కావాలంటే అహంకారం విడిచిపెట్టాలని, అహంకారానికి ప్రతీక అయిన కొబ్బరికాయను ఆయనకు అర్పించి, ఆయన పాదాల వద్ద ఏ భక్తుడైతే తన అహాన్ని అర్పిస్తాడో, అతడికి మాత్రమే తన అనుగ్రహం కలిగుతుందని చెప్తాడు.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః 
శ్రీ త్రిపురారి వరదో మహాగణపతి విజయతే ||

చిత్రంలో ఉన్నది రంజన్‌గావ్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మహాగణపతి. ఆ స్వామి స్మరణ, దర్శనం వలన విఘనాశనం జరుగుతుంది, విజయం వరిస్తుంది. 

Tuesday, 5 September 2017

గం బీజంలో గణపతి - బ్రహ్మశ్రీ యణమండ్ర వేణుగోపాలశాస్త్రి గారి వివరణ



గం బీజంలో గణపతి స్వరూపం ఇమిడి ఉంది. విత్తులో చెట్టు బీజరూపంగా ఉన్నప్పుడు చూడలేకపోవచ్చు కానీ బీజములోని దేవతాస్వరూపమును దర్శింపవచ్చును. 
గకారః పూర్వరూపం| అకారో మధ్యమ రూపం|| అనుస్వారశ్చాంత్య రూపం| బిందురుత్తర రూపం| నాదస్సందానం| సమ్హితా సంధిః| సైషా గాణేశి విద్యా|| .... - గణపతి అథర్వశీర్షం.

దేవతా స్వరూపాలన్నీ దేవనాగర స్వరూపములు. అవి చరిత్రకారులు భావించినట్లు మానవులు నిర్మించినవి కావు (అనగా ఊహించినవి, కల్పించినవి కావు). అవి స్వయంభూతములు. దానికి నిదర్శనమే ఇది.

దేవనాగరీలిపిలో 'గ'కారములో వంకర తిరిగిన భాగము తొండము. నిలుపగా ఉన్నది దంతము. ఇది పూర్వరూపము. (గకారః పూర్వరూపం|)
'అ'కారాన్ని అడూగా వ్రాయగా ఉదరం ఏర్పడుతుంది. అనుస్వారను అధోముఖంగా వ్రాయగా కటి నుండి పాదాల అంతము వరకు కల రూపము ఏర్పడుతుంది.
బిందువును సగము చేసి, సగము పూర్వరూపానికి అనుసధానం చేయగా కళ్ళు, చెవులు ఏర్పడతాయి. మిగిలిన సగభాగాన్ని దానికి అధోముఖంగా కలుపగా కపాలముతో కూడిన శిరస్సు ఏర్పడుతుంది. ఇది ఇత్తర ఉత్తరరూపము. మొత్తం కలిపినదే నాదము. విడివడిన స్వరూపము సంహిత. ఇదీ గణపతి విద్యా స్వరూపము. ఈ విధంగా 'గం' బీజంలో దేవాతా స్వరూపం ఇమిడి ఉన్నట్లు రూఢి అవుతున్నది. - (బ్రహ్మశ్రీ యణమండ్ర వేణుగోపాలశాస్త్రి గారి వివరణ నుంచి సేకరణ)

ఇది శాస్త్రీయమైన గణపతి స్వరూపము. గం బీజం ఉచ్ఛరించినప్పుడు, మనకు తెలియకుండానే గణపతి రూపం ప్రకృతిలో ఏర్పడుతోంది. దీన్ని గణక ఋషి దర్శించి లోకానికి అందించారు. 

Monday, 4 September 2017

వక్రతుండ మహాకాయ..... (5)



నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా|

నేను చేపట్టిన ప్రతి కార్యంలో ఎల్లప్పుడూ విఘ్నములు ఎదురుకాకుండా చూడు.....
ఇంతకముందు కొన్ని వక్రములు/ విఘ్నాల గురించి చెప్పుకున్నాము. అవి ఎదురుకాకుండా చూడు.
1. నిన్ను మర్చిపోవడమే పెద్ద విఘ్నము. నేను ఏ కార్యం చేస్తున్నా, నిన్ను మరువకుండా ఉండేలా చూడు. బయట పనులు చేయాలి, కానీ లోపల హృదయంలో మాత్రం నీ మీద ధ్యాస ఉండాలి. సదా ఇలా ఉండేలా ఆశీర్వదించు.
2. నీవే కర్తవు. నేను పాత్రధారిని. నేను కర్తను అనుకునప్పుడు, నాకీ కర్మలు అంటుకుంటాయి. అదే జన్మల పరంపరకు కారణమవుతోంది. నేను కర్తను కాదనే జ్ఞానాన్ని నాకు అనుభవంలో తెలియపరుచు.  వేల జన్మలుగా నేనే కర్తను అని conditioning చేయబడ్డాను. అందుకే తరచుగా అదే భ్రమలో పడిపోతున్నాను. కాబట్టి మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఓ వక్రతుండ, ఈ విఘ్నాన్ని తుండెము చేయి.
3. మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము. లేదా గృహస్థాశ్రమంలోకి భవిష్యత్తులో అడుగుపెడతాము. ధార్మికంగా సుఖాలను అనుభవించడం వలన కలిగిన సంతృప్తితో జనించిన వైరాగ్యం ద్వారా (వివేకంతో కూడిన వైరాగ్యం ద్వారా) మాత్రమే జ్ఞానము పొంది, నిన్ను చేరుకుంటాము. మా జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి. విద్యలో సమస్య, నిరుద్యోగం, సంతానహీనత, లేదా పిల్లలు మాట వినకపోవడం, అనారోగ్యం, దాంపత్యదోషాలు..... ఇలా ఎన్నో సమస్యలు. ప్రతి పనిలో ఆటంకాలే. ఇవన్నీ ఎదురుకాకుండా చూడు. సంతృప్తితో కూడిన జీవితాన్ని ఇవ్వు. నిన్ను స్మరిస్తున్నాం కనుక ఇప్పుడే, కాదు భవిష్యత్తులో ఎదురయ్యే విఘ్నాలను కూడా భస్మీపటలం చెయ్యి. మాకు కార్యసిద్ధిని కలిగించు. నీవు పూర్ణస్వరూపానివి. కనుక కోరికలను తీర్చుతూనే, జ్ఞానాన్ని కూడా ఇచ్చి, ఇటు ఇహాన్ని, పరాన్ని ప్రసాదించు. 
4. నీకే శరణాగతి చేద్దామని అనుకుంటాను. కానీ అప్పుడప్పుడూ అవిశ్వాసం మనసులోకి ప్రవేశిస్తోంది. అది వక్రము, దాన్ని తుండెము చేయు. నువ్వు చెప్పినట్లు కాక, మనసు చెప్పినట్లు నడుస్తున్నాను. కోపానికి, దురాశకు, అహంకారానికి వశుడనువుతున్నాను. ఇవన్నీ కూడా విఘ్నాలే స్వామి. కనుక ఎల్లప్పుడూ నీ మాట మాత్రమే వినేలా చూడు.

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

ఇది బ్రహ్మదేవుడు వక్రతుండ గణపతిని ఉద్దేశించి చేసిన స్తోత్రంగా ఒక చోట చెప్పబడింది. చిన్న శ్లోకమైన మహిమకలది. కల్పవృక్షం వంటిది. ఈ శ్లోకం ఎప్పుడు వీలైతే అప్పుడు పఠించదగ్గది. కేవలం ఇహలోక భోగాలనే కాదు, ముక్తికి మార్గం చూపే శ్లోకం ఇది. పిల్లలకు దీన్ని నేర్పితే, దురలవాట్లకు లోనుకాకుండా, చక్కగా చదువుకుని, ఉన్నతంగా స్థిరపడి, అంతిమంగా స్వామిని చేరుతారు.   

స్వస్తి
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వం శ్రీ గణేశ్వరరాపణమస్తు 

Sunday, 3 September 2017

వక్రతుండ మహాకాయ..... (4)



కోటి సూర్యసమప్రభ.....

అనంతమైన సూర్యులకు సమానమైన కాంతితో విరాజిల్లుతున్నవాడు....
ఆ చిన్న శ్లోకంలో ముందు వక్రతుండ అన్నప్పుడు, వక్రబుద్ధిని నశించింది, మహాకాయ అని ధ్యానించినప్పుడు, ఆయనే సమస్తంగా భాసించడం కనిపించింది. వక్రబుద్ధి నశించి, అంతటా ఆయన్నే చూడటమే జ్ఞానం, అదే కోటి సూర్యసమప్రభ లో వ్యక్తమవుతోంది. అంటే ఇక్కడ స్వామి మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకువెళతున్నాడు (తమసోమా జ్యోతిర్గమయా), మృత్యువు నుంచి అమృతతత్వం వైపు తీసుకువెళుతున్నాడు (మృత్యోర్మా అమృతంగమయా)..... మనకు కనిపించే సూర్యుడు ఈ విశ్వాన్ని మాత్రమే ప్రకాశింప్జఏస్తాడు. కానీ కోటిసూర్యప్రభలతో వెలిగిపోతున్న వినాయకుడు, సమస్త లోకాలను, జీవులను ప్రకాశింపజేస్తున్నాడు.....

ఇక్కడ ఒక విశేషం ఉంది. సూర్యుడిని నేరుగా చేస్తూనే కాసేపు మనకు చిన్న చిన్న వస్తువులు కనిపించవు. మరి ఈయన అనంతసూర్య కాంతులతో వెలిగిపోతున్నాడు. అలాంటి ఈయన తన అనుగ్రహాన్ని ప్రసరిస్తే ఎలా ఉంటుంది??.... దివ్యమైన ఆ వెలుగు తప్ప, అన్యమైనదేదీ కనిపించదు. కళ్ళు మూసుకున్నా, చీకటి తారసపడదు. ఈ వెలుగును చూశాక, చీకటి (అజ్ఞానం) కూడా గుడ్డిదవుతుంది. ఆ కాంతి ఎలాంటిదంటే లోకమంతా వ్యాపించి ఉంటుంది. అప్పుడు లోకంలో దోషాలు కనిపించవు. ఆఖరికి నీలో ఉన్న దోషాలు కూడా కనిపించవు. మంచి, చెడు; సుఖదుఃఖాలు అనేవి ద్వంద్వాలు. అవి ఎప్పుడూ ఉంటాయి. అవన్నీ ఉంటేనే లోకం పూర్ణమవుతుంది. లోకంలో Perfection కోసం ప్రయత్నించడం మిథ్య. ఎందుకంటే ఈ ద్వంద్వాల్లో ఏదో ఒకటి మాత్రమే మిగిలితే, అప్పుడు ప్రళయం వస్తుంది.... కనుక స్వామి నుంచి వచ్చే కాంతి మనలో పూర్ణత్వాన్ని(Totality) నింపుతుంది. Perfections, imperfections నుంచి మనల్నిTotality  దిశగా నడిపిస్తుంది. అదే ఆయన చేతిలో ఉన్న మోదకానికి సంకేతం కూడా. 

ఈ కాంతి అన్ని లోకాల్లో వ్యాపించి, వాటి మధ్య బేధాన్ని నశింపజేస్తుంది. అంటే భగవంతుడిని పొందాలంటే లౌకికమైన జగత్తుకు దూరంగా జరగాలి, ఈ జగత్తును తిరస్కరించాలి వంటివి అప్పుడు ఉండవు. ఇది ఉన్నతమైన స్థితి.
ఇక్కడ (ఇహలోకంలో) చూసినా గణపతియే ఉంటాడు, పరలోకంలో చూసినా గణపతియే ఉంటాడు. ఎక్కడ వెతికితే అక్కడ గణపతే ఉంటాడు. (పూజ్యగురువులు వి.వి.శ్రీధర్ గారి ఉపదేశాల సారం గణపతికి సమన్వయం చేస్తూ ఇక్కడ చెప్పడం జరిగింది). అప్పుడు జ్ఞానం, అజ్ఞానం అనే బేధం (differentiation) ఉండదు. అప్పుడు ఉండేది ఏకత్వం. అదే అసలు జ్ఞానం. భగవాన్ రమణులు కూడా ఉపదేశశరంలో ఇదే చెప్తారు.... అప్పుడు ప్రత్యేకించి జగత్తుకు దూరంగా పరిగెత్తాల్సిన పనిలేదు. ఎందుకంటే స్వామి నుంచి ఈ జగత్తు వేరు కాదని తెలుసుకున్నాం కనుక. 

అప్పుడు మనలో శరణాగతి ఉదయిస్తుంది. 

యదంతరే సంస్థితమేకదంతస్తదాజ్ఞయా సర్వమిద విభాతి |
అనంతరూపం హృదిబోధకం యస్తమేకదంత శరణం వ్రజామః ||

అన్నిటిలోను అంతర్యామిగా ఉంటున్న ఆ ఏకదంతుని ఆజ్ఞ చేతనే అంతా జరుగుతున్నది. అనంతమైన రూపాలతో ఉండే ఆయన లీలావైభవం కేవలం హృదయానికి మాత్రమే అర్దమవుతుంది. అలాంటి ఏకదంతునికి శరణువేడుతున్నాను అని భావం.

అది బేషరతుగా చేసే శరణాగతి (Unconditional surrender). సంపూర్ణ శరణాగతి. ఇక అప్పుడు మనం ఆయన చేసే లీలలను గమనించడం తప్ప, వేరే ఏదీ అడగము. ఒకచోట అరోబిందో అంటారు.."ఒక వేళ భగవంతుడు నరకంలో నాకు స్థానం కల్పిస్తే, నేను స్వర్గం కోసం ఎందుకు ప్రయత్నించాలో నాకు అర్దం కావట్లేదు. నాకు ఏదీ మంచిదో ఆయనకే ఉత్తమంగా తెలుసు.... ఒకవేళ భగవంతుడు నన్ను స్వర్గం దిశగా లాగితే, అదే సమయంలో ఆయన వేరే చేత్తో నన్ను నరకంలోనే ఉంచే ప్రయత్నం చేస్తే, అప్పుడు నేను ఊర్ధ్వంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి...." 
If God assigns to me my place in Hell, I do not know why I should aspire to Heaven. He knows best what is for my welfare.


If God draw me towards Heaven, then, even if His other hand strive to keep me in Hell, yet must I struggle upward.

జ్ఞానం, భక్తి, కర్మ, యోగం.... అన్ని మార్గాలు శరణాగతిలోనే ముగుస్తాయి. అప్పుడు మనది యోగదృష్టి అవుతుంది.... అదే ముక్తినిస్తుంది.
కోటి సూర్య సమప్రభ... తమసోమా జ్యోతిర్గమయా అనే ఉపనిషత్తు వాక్యాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంది. అటువంటి స్థితిని ప్రసాదించేవాడు వక్రతుండుడు.

వివరణ ఇంకా ఉంది.... 

ఇది చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో ఉన్న గణపతిని 56 ముక్కలు చేశారు

చుట్టూ దట్టమైన అడవి. అందులో ఒక ఎత్తైన శిఖరం. దాని మీద పెద్ద గణనాథుడి విగ్రహం. ఇది ఫోటొషాప్ మహిమ కాదు....

ఈ గణపతిని దర్శించాలంటే చత్తీస్‌ఘర్ రష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని దోల్‌కల్ కొండ మీదకు వెళ్ళాల్సిందే. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి. రోడ్డు మార్గం లేదు. 1100 సంవత్సరాల పూర్వం నాటిదైన ఈ స్వామి మూర్తిని స్థానిక జర్నలిస్ట్ 2012 లో కనుగొన్నారు. ఈ విగ్రహం ఒక్క చిన్న స్థంభం లాంటి కొండ మీద, దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి మాములు మానవుడు నడిచి వెళ్ళడం కూడా అసాధ్యం..... అలాంటిది ఎంతో బరువున్న ఈ విగ్రాహాన్ని అంత ఎత్తున ఎవరు పర్తిష్టించారు, ఎలా ప్రతిష్టించారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది. పరిశోధనల ప్రకారం నాగవంశీయులు కాలంలో ఈ విగ్రహం ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. దీనికి దగ్గర్లోనే ఎన్నో రాతి ఆయుధాలు దొరికాయి. ఇవి ఇక్కడ నివసించిన ఆదిమానవుడు జీవిత విశేషాలకు నిదర్శనాలని భారత పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు.




ఇంత పురాతామైన, వైవిధ్యమైన ఈ స్వామిని భక్తులంతా దర్శించుకోవాలని, తద్వారా ఆ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి లభిస్తుందని కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం భావించి, ఇక్కడ అభివృద్ధి కోసం 2 కోట్లకు పైగా కేటాయించింది. అయితే ఇది మావోయిష్టుల కీలకప్రాంతం కావడంతో వారికి ఈ అభివృద్ధి గిట్టలేదు. కనీసం హిందువుల మనోభావలు పట్టలేదు. అందుకే ఈ ఏడాది (2017) జనవరి చివరలో, ఈ స్వామి విగ్రహాన్ని ఆ కొండ మీది నుంచి క్రిందకు పడేశారు. దాదాపు 13,000 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆ దివ్యశిలా విగ్రహం 56 ముక్కలైంది. ఇది కూడా అక్కడికి వెళ్ళిన ఓ జర్నలిష్టు పరిశీలించినప్పుడు వెళ్ళడైంది. పోలిసు దర్యాప్తు లో ఈ చర్యను సంఘవిద్రోహ శక్తులు చేశాని తేల్చారు. అది మావోయిష్టులో, లేదా అక్కడ పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రైస్తవ మిషనరీలో!? .... పురావస్తు శాఖ వారు తెలిపినదాని ప్రకారం, అది 13,000 పై నుంచి క్రిందకు పడినా, విరగకపోతే, తమ ప్రయత్నం వృధా అవుతుందని భావించిన ఆ దుష్టులు, ముందు విగ్రహాన్ని కొన్ని ముక్కలు చేసి, క్రిందకు తోశారట..... చివరకు పురావస్తు శాఖ వారు, స్థానిక గిరిజనులు ఆ ప్రాంతమంతా గాలించి, కళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ అడవిలో వెతికి, అన్ని ముక్కలను తీసుకువచ్చి, తిరిగి అతికించే ప్రయత్నం చేశారు.

ఎంతో గొప్పదైన ఈ స్వామి మూర్తి అక్కడ ఉండటం ఒక అద్భుతం అనుకుంటే, దాన్ని దుష్టులు భిన్నం చేయడం హృదయ విదారకమైన విషయం.... 

ఇది చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో ఉన్న గణపతి కథ...

Saturday, 2 September 2017

వక్రతుండ మహాకాయ..... (3)

"...... దిగీశాదిరూపం
అసత్ సత్ స్వరూపం జగద్ధేతురూపం సదావిశ్వరూపం గణేశం నతాః స్మః ||
అని గణపతిని గర్గ మహర్షి కీర్తించినట్లు గణేశపురాణంలో ఉంది. 

దశదిశలా వ్యాపించి ఉన్నవాడు; అసత్ (నశించిపోయే వస్తువులు, ప్రపంచం, పంచభూతాలు మొదలైనవి), సత్ (శాశ్వతమైనది, పరబ్రహ్మతత్త్వం) - ఈ రెండింటి రూపంలో ఉన్నవాడు, జగత్తుకు కారణమైనవాడు, ఈ విశ్వం యొక్క రూపంలో ఉన్న గణేశునికి నమస్కారలు అని భావం.

కనపడని తత్త్వమే కాదు, కనిపించే ఈ జగత్తు కూడా గణపతి స్వరూపమే. ఆయన తప్ప అన్యమైనది లేదు. ఈ జగత్తు మిథ్య అని కొన్ని సంప్రదాయల్లో ఎందుకు చెప్తారంటే, అలా చెప్పకపోతే ఎవ్వరూ అంతర్ముఖమవ్వరు. భౌతికమైన దృష్టితో బ్రతుకుతున్న వ్యక్తికి తాను అనుభవించేదంతా అసత్యమని, ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉందని చెప్తే తప్పించి అతడు ఆత్మాన్వేషణ ప్రారంభించడు. అయితే చివరకు ఈ జగత్తు మిథ్య కాదు, అలా అని వేరేదో కాదు, ఇది కూడా భగవంతుని వ్యక్తరూపమే అని తెలుస్తుంది. అదేదో ఇప్పుడే తెలుసుకోవచ్చు కదా, జగత్తు లేకున్నా భగవంతుడు ఉన్నాడని, కానీ భగవంతుడు లేకుండా జగత్తు లేదని, దీనికి ప్రత్యేకమైన అస్థిత్వం లేదని, ఇది ఆయన నుంచి వచ్చిందని, ఇది ఆయనేనని ఇప్పటి నుంచే చూసే ప్రయత్నం చేయచ్చు కదా?! ఇలా చూసేవాడు భక్తుడు, భక్తియోగం ఈ మార్గాన్నే సూచిస్తుంది.……..

ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖమవ్వడం. అయితే అంతర్ముఖమై అలాగే ఉండిపోవాలా? చాలామంది ఆధ్యాత్మికత పేరు చెప్పి, ఈ లోకంతో మనకేంటి అంటారు. అది పలాయనవాదమే అవుతుంది కానీ ఆధ్యాత్మికత కాదు. తాను అంతర్ముఖమై దర్శించిన సత్యాన్ని, అదే అంతఃనేత్రంతో బయట కూడా దర్శించాలి. అంటే మనసు నుంచి కాక, హృదయం నుంచి లోకాన్ని చూడాలి. అలా హృదయం నుంచి చూస్తూ జీవించాలి….. లోపల తాను ఏదైతే అనుభూతి చెందాడో, బయట ఉన్న ప్రతి అణువు (Atom) లో అదే అనుభూతి చెందాలి. భగవంతుడిని లోపలే కాదు, బయట కూడా దర్శించాలి. అప్పటివరకు మోక్షం రాదు. మనకున్న మామూలు దృష్టి నుంచి పైకి ఎదిగితే, ఈ లోకంలో ప్రతి అణువులో దైవమే ఉందని తెలుస్తుంది..... ప్రతి చర్యంలోను (Action), ప్రతిచర్య (Reaction) లోనూ ఆయన్నే చూడగలగాలి. అలా అన్నిటిలో చూసే ప్రయత్నం చేస్తే, ఆయన అనుగ్రహం చేత తప్పకుండా, అంతటా ఆయన్ను చూడగలిగే దృష్టి లభిస్తుంది. సాధ్యం కాదు అనుకోవడమే వక్రము….. 

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’

ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

భగావన్ రమణ మహర్షి, వారి ఉపదేశసారంలో 'జగత ఈశాధీయుక్త సేవనం, అష్టమూర్తి భృద్దేవపూజనం -5||’
ఈ జగత్తే ఈశ్వరుడు అనే బుద్ధితో కూడి, దీనికి సేవ చేస్తే, అది అష్టమూర్తులుగా వ్యక్తమవుతున్న భగవంతునికి చేసే పూజయే అవుతుంది అని భావం. ఇది పరిపూర్ణమైన భక్తియోగ మార్గం. అందుకోసం అంతర్ముఖమై, ఆ అంతఃదృష్టిని నిలుపుకుంటూనే దేశానికి, ధర్మానికి, లోకానికి సేవ చేయాలి, అందరికీ ప్రేమను పంచాలి. అంతటా దైవాన్నే చూస్తే, అప్పుడు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, చిరాకు మొదలైన లక్షణాలకు తావు ఉండదు. ఇతరుల కోపంలో కూడా మనం స్వామినే చూస్తాము. ద్వేషాన్ని కూడా ద్వేషించము, పగను కూడా ప్రేమిస్తాము. ఎందుకంటే అన్నిటిలో ఆయనే ఉన్నాడు. మంచి, చెడులు రెండూ ఆయన నుంచే ఉద్భవించాయి. ఒకటి ఎలా ఉండాలో చెప్తే, ఇంకోదాని ద్వారా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు.... మనం అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, మన ఆశలకు (expectations) భిన్నంగా జరిగినప్పుడు కోపం వస్తుంది. కానీ అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏదైనా జరుగుతోంది అని నిజంగా నమ్మితే, అనుకోనిది జరిగినా కోపం ఉండదు, బాధ ఉండదు. ఎవరివల్లనో పనులు ఆగిపోయాయని వాళ్ళ మీద విరుచుకుపడటం ఉండదు. మనం అలాంటి స్థితిని చేరుకోవాలి.  నిజానికి ఇవన్నీ చదివితే అనుభవంలోకి రావు, ఆచరణలో పెట్టాలి, మనం చేసే ప్రతి పనిలో ఆయన్ను చూడగలగాలి. అందుకు సిద్ధమవ్వాలి. పాత ఆలోచనలను ఈ క్షణంలోనే విడిచిపెట్టాలి.  కర్మ(ఆచరణ) ద్వారా మాత్రమే జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఖచ్ఛితంగా దైవం యొక్క స్పందనను మనం వినవచ్చు. ప్రతి దాన్లోను జీవం ఉట్టిపడటం కనిపిస్తుంది. అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాగణపతి దర్శనం అవుతుంది. అదే గణపతి ‘మహాకాయం’.  విశ్వరూప గణపతికి ఎన్నో ముఖాలు ఉంటాయి. అందులోకి నీ ముఖం కూడా ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఆయన నుంచి వేరుగా లేవు. ఆయనలోనే ఉన్నావు. అదే మహాకాయం.

సదావిశ్వరూపం గణేశం నతాః స్మః

వివరణ ఇంకా ఉంది……..

Friday, 1 September 2017

వక్రతుండ మహాకాయ..... (2)


నిజానికి యోగమార్గంలో సాధన చేస్తున్నప్పుడు అనేక అనుభూతులు కలుగుతాయి. కొన్ని భ్రమలు కూడా కలుగుతాయి. ఒకనొక దశంలో సాధకుడు తాను తన గమ్యాన్ని చేరుకున్నానని, లేదా సమీపానికి వచ్చేశానని భ్రమిస్తాడు. దాంతో ఎక్కడో ఒకచోట ఆగిపోతాడు. ఇవి వక్రములు..... 
అనుభూతులు ఉన్నాయంటే అనుభవించేవాడు ఉన్నాడనే అర్ధం. అనుభూతులు మనసుకే కానీ తన (ఆత్మ) కు కాదు. ఒకరు రమణమహర్షి వద్దకు వచ్చి, 'నేను ధ్యానంలో శూన్యస్థితికి వెళిపోతున్నాను. అప్పుడు తలంపులేమీ ఉండటంలేదు. కానీ ఈ స్థితిని మాత్రం దాటలేకపోతున్నాను' అని అనగా, దానికి బదులుగా మహర్షి 'ఆ శూన్యస్థితిని అనుభవిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. తాను ఉన్నాడు కనుకే ఆ స్థితి ఉందని తెల్సుకోగలుగుతున్నాడు. ఆ ఉన్నది ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది' అని సమాధానమిచ్చారు..... కానీ చాలామంది తమకు కలిగిన అనుభూతులనే గొప్పగా భావించి, వాటిని పదేపదే నెమరువేసుకుంటూ కూర్చుంటారు. ఇది వక్రము.
నాకు శాస్త్రము తెలుసు.... నేను సాధన చేస్తున్నాను... నాకు మంత్రోపదేశం ఉంది.... నేను ఇన్ని లక్షల మంత్రజపం చేశాను... వాళ్ళు తప్పుగా ఆచరిస్తున్నారు.... వారిని సరి చేయాలి..... ఇలా ఎన్నో భావాలు మనసులో పెట్టుకుంటారు. వీటన్నిటికి మూలం అహంలో ఉంది. ఈ భావాలు ఉన్నన్ని రోజులు ఆత్మ సాక్షాత్కారం కలగదు. ఎందుకంటే ఇవే వక్రములు. శాస్త్రం తెలిసి ఉండటం మంచిదే, కాని అది నీలో అహంకారాన్ని పెంచకూడదు, అణుకువను పెంచాలి. భక్తిశ్రద్ధలను పెంచాలి. నువ్వు ఇక్కడకు ఇతరుల్లో దోషాలు ఎంచడానికి, ఎవరు ఎలాంటి వారో తీర్పులు చెప్పడానికి రాలేదు. ఈశ్వరుడిచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా ఎరుకతో జీవించి, ఆయనలో కలిసిపోవడానికి వచ్చావు. ఎవరు ఎంత జపం చేసినా, ఎంత సాధన చేసినా, ఆత్మసాక్షాత్కారం అనేది పూర్తిగా ఈశ్వరానుగ్రహం మీదనే ఆధారపడి ఉన్నది....... 

ఇంకా ఇలా కూడా అంటుంటారు. నాకు మోక్షం ఈ జన్మలోనే వస్తుందని నమ్మకం లేదు, దానికి ఎన్నో జన్మల సాధన కావాలి, నేను ఇప్పుడే మొదలుపెట్టాను.... ఇలా మనం ఎన్నో భావాలను (presumptions, assumptions and preconceived notions) ఏర్పర్చుకుని ఉంటాము. కొన్ని ఎక్కడో, ఎవరో చెప్పగా విన్నవి... కొన్ని చదివినవి.... ఇవన్నీ వక్రాలే. ఇవి ఉన్నంతకాలం దైవానికి మనం దూరంగా ఉన్నట్లే. వీటిన్ననిటిని ధ్వంసం చేయువాడు వక్రతుండుడు. నిజానికి ఇవన్నీ వదిలించుకుని వర్తమానంలో, దైవాన్ని హృదయంలో స్థిరంగా నిలిపుకుని, పరిపూర్ణమైన జీవనం గడపడమే ఆధ్యాత్మికత.....అందుకే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడు. అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి చక్రం. ఆయన అనుగ్రహంతో ప్రయాణం ప్రారంభిస్తే, మధ్యలో వచ్చే వక్రాలన్నీ నశించిపోతాయి. తన భక్తులను నేరుగా హృదయస్థానానికి తీసుకువెళ్ళి తన యందే నిశ్చలమైన దృష్టి ఉండే స్థితిని కలిగిస్తాడు.   

వక్రం అనగా విఘ్నము... లౌకిక జీవనంలో అటంకాలుగా చెప్పుకుంటే, ఆధ్యాత్మికతలో విఘ్నమే మాయ... గణేశునికి విఘ్నరాజు అనే నామం ఉంది. అలాగే విఘ్నకర్త, విఘ్నహర్త అనే నామాలు కూడా ఉన్నాయి. విఘ్నరాజు అనగా విఘ్నములను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు, అనగా మాయను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆయనే పరబ్రహ్మం. ఈ జగత్తు ఆయన మాయ. ఈ మాయ కూడా ఆయనలోనించే వచ్చింది..... జీవుల కర్మ తీరటం కోసం వారికి ఉపాధి (శరీరం) కల్పించి, మాయలో ఉంచి, కర్మక్షయం చేస్తున్నాడు. తనను చేరటానికి కర్మక్షయం చేస్తున్న గణేశుని ఒక నామమే విఘ్నకర్త. తన పాదాలను గట్టిగా పట్టుకుని, నాకు నువ్వు తప్ప వేరే దిక్కులేదు, నీకే శరణాగతి చేస్తున్నాను, నన్ను ఉద్ధరించు అన్న భక్తునికి మాయను తొలగించి, తనలో ఐక్యం చేసుకుంటున్నాడు కనుక ఆయన విఘ్నహర్త కూడా. లౌకిక జీవనంలో వీటి అర్ధాలు మనకు తేలికగానే బోధపడతాయి.....

కాబట్టి గణపతిని వక్రతుండ అనే నామంతో పూజిస్తే, ఆయన మనకున్న భౌతిక, ఆధ్యాత్మిక విఘ్నాలను తొలగించి, ఆయనలో కలుపుకుంటాడు.

వక్రతుండ గణపతి ఎంత శక్తిమంతుడంటే, మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా మనకు వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని స్మరిస్తే, ఆయన మంత్రం కానీ, నామం కానీ విశ్వాసంతో జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ శుభ్రమునీయ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. ఈయన శత్రువులను కాదు, శత్రువుల శత్రుబుద్ధిని నశింపజేసి, ప్రేమను, స్నేహభావాన్ని పెంచుతాడు.

వక్రతుండ అని స్వామిని స్తుతించిన బ్రహ్మగారు, ఆ తర్వాత మహాకాయ అని స్తుతించారు. మహాకాయ అంటే పెద్ద శరీరం కలవాడు. అంటే గణపతి భారీ ఆకారంలో ఉంటాడు, లావుగా ఉంటాడు అని కాదు. గణపతి అథర్వశీర్షోపనిషత్తులో గణపతి రూపం గురించి ప్రస్తావన ఉంది. గకార పూర్వరూపం అంటూ..... గం అనే బీజాన్ని జపించినప్పుడు, ఏర్పడే గణపతి రూపం మనం చూస్తున్నట్లు పెద్ద ఉదరంతో ఉంటుంది. ఆ రూపం వెనుక ఎంతో తత్త్వం దాగి ఉన్నది. అయితే బ్రహ్మదేవుడు, స్వామిని మహాకాయ అనడంలో అర్దం ఇంకోలా ఉంది. స్వామి అంతటా వ్యాపించి ఉన్నాడు, అంతటా అంటే విశ్వమంతటా, విశ్వానికి అతీతంగా కూడా ఉన్నాడు. ఆయన లేని చోటు అంటూ లేదు... అసలు ఆయన తప్ప అన్యమైనదే లేదు. అందుకే 'శుక్లాంబరధరం విష్ణుం' అని  ఆయన్ను ప్రార్ధిస్తున్నాము. విష్ణుం అంటే సర్వవ్యాపి. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా శ్రీ మన్నారాయణుడు ఒక మాట అంటారు... విష్ణుత్వం కలిగి ఉన్నవాడే విఘ్నాధిపతి కాగలడు, అటువంటి వాడు పార్వతీ మాత ద్వారా ఆవిర్భవిస్తాడు' అని. స్వామిది, విష్ణుమూర్తిది ఒకటే తత్త్వం....

దశదిశలా వ్యాపించి ఉన్నాడు కనుక స్వామిని చెందిన సహస్రనామాల్లో దిగంబరః అనే నామం ఉంది. అది కూడా త్రిపురాసుర సంహారానికి పూర్వం పరమశివుడు, గణపతి గురించి తపస్సు చేసి, ద్విదశ భుజ (20 చేతులతో), దశముఖ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు స్వామిని స్తుతించగా, లోకానికి అందినవే గణేశ సహస్రనామాలు. వాటికి భాసకరరాయల వారు భాష్యం రాశారు. పరమశివుడు ఆ మహాగణపతిని ప్రత్యక్షం చేసుకున్న క్షేత్రం మహారాష్ట్రలో అష్టగణపతి క్షేత్రాల్లో ఒకటై రంజంగావ్ గా ప్రసిద్ధమై ఇప్పటికీ ఉంది. అది దర్శించవచ్చు ..... వస్త్రాలు లేనివాడని కాదు. దిగంబరః అంటే దిశలెల్లా వ్యాపించి ఉన్నవాడు. ఇకా ఆయన వ్యాపించడానికంటూ చోటే లేదు. ఆ దిక్కులనే బట్టలుగా కట్టేసుకున్నవాడు. అంతటా వ్యాపించి ఉన్నవాడికి రూపం ఉంటుందా?? అన్ని రూపాలు ఆయనవే. అరూపం కూడా ఆయనదే. అదే మాహాకాయం. 

ఇక్కడ ఇంకో విశేషం ఉంది. బ్రహ్మదేవుడు వక్రతుండిని ప్రార్ధిచిన తరువాత, సృష్టి జరిగింది. కానీ ఆ సృష్టిని బ్రహ్మగారు ఎక్కడ నుంచో చేయలేదు. అంతటా వ్యాపించి ఉన్న ఆ స్వామియే, ఈ చరాచర సృష్టిగా, అందులోని జీవులుగా మారిపోయాడు. మరి ఇంతకీ బ్రహ్మదేవుడు చేసినదేంటి? ఏమీ లేదు..... త్వమేవ కేవలం కర్తాసి| త్వమేవ కేవలం ధర్తాసి| త్వమేవ కేవలం హర్తాసి| త్వఏమ సర్వం ఖల్విదం బ్రహ్మాసి| - గణపతి అథర్వశీర్షోపనిషత్తు.

ఆయనే కర్త, ఆయన ధర్త (స్థితికారుడు), ప్రళయకర్త/ తొలగించేవాడు కూడా ఆయనే. ఈ సమస్త సృష్టి ఆయన తప్ప మరేమీ కాదు. ఆయన కాదు, మనమే కర్తలము అనుకోవడమే మన అజ్ఞానం. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఉన్న ప్రాణులంతా పాత్రధారులు. ఆయన మాత్రమే కర్త. అదే జ్ఞానం.

వివరణ ఇంకా ఉంది.....