Saturday 24 February 2024

శ్రీ గరుడ పురాణము (101)

 


తరువాత ఓం తమీశాన... అనే మంత్రంతో ఈశాన్యంలో ఈశానునీ, మండప మధ్యభాగంలో 

ఓం విష్ణోర్లోకేతి... అనే మంత్రంతో విష్ణు దేవునీ పూజించాలి.


ప్రతి తోరణ సమీపంలోనూ రెండేసి కలశలను స్థాపించి, వస్త్ర, ఉపవస్త్రాలతో వాటిని కప్పి, చందనాది సుగంధిత పదార్థాలతో అలంకరించి ఈ క్రింది మంత్రాలతో వాటిపై పుష్ప వితానాది ఉపచారాల నుంచుతూ దిక్పాలకులను పూజించాలి.


ఓం త్రాతార మింద్ర.... తో ఇంద్రునీ 

ఓం అగ్నిరూ.... తో అగ్నినీ, 

ఓం అస్మిన్ వృక్ష.... తో నిరృతినీ, 

ఓం కిం చే దధాతు.... తో వరుణునీ, 

ఓం ఆచత్వా... తో కుబేరునీ, 

ఓం ఇమారుద్రేతి.... తో రుద్రునీ,


ఇతర దిక్పతులనూ పూజించి ఆచార్య దేవుడు హోమద్రవ్యాలనూ, అన్య పూజా సామాగ్రినీ వాయవ్యకోణంలో స్థాపించి వుంచాలి. తరువాత అక్కడున్న శ్వేత శంఖాది శాస్త్రవిహిత సమస్త వస్తువులనూ ఆయనొకమారు దీక్షగా చూడాలి. వెంటనే ఆ నిశ్చిత ద్రవ్యాలన్నీ సంపూర్ణంగా శుద్ధాలయిపోతాయి.


అప్పుడు షడంగ న్యాసాన్నీ ప్రణవ, వ్యాహృతి సంయుక్తంగా ఇలా చేయాలి.


ఓం హృదయాయ నమః,

ఓం భూః శిరసే స్వాహా,

ఓం భువః శిఖాయై వషట్,

ఓం స్వః కవచాయ హుం,

ఓం భూర్భువః స్వః నేత్రత్రయాయ వౌషట్,

ఓం భూర్భువః స్వః కరతల కరపృష్ఠాభ్యాం ఫట్- అనే మంత్రాలను చదువుతూ క్రమంగా గుండె, తల, పిలక, కవచం, కనులు, అరచేయి, మండ-లను స్పృశించాలి. తరువాత ఓం అస్త్రాయఫట్ మంత్రంతో అస్త్రాలను (అంటే చేతులనే) న్యాసం చేసుకోవాలి. ఈ మొత్తం న్యాసకర్మ సమస్త వాంఛలనూ తీర్చగలదు.


అస్త్రమంత్రం ద్వారా అక్షతలనూ, విష్టరాలనూ (విష్టరాన్నీ) అభిమంత్రితము చేసి ఆ విష్టర ద్వారా యజ్ఞమండలంలోనొక చోట నుంచబడిన సమస్త ద్రవ్యాలను స్పృశించాలి. తరువాత అస్త్రమంత్రపూత అక్షతలను మండపమంతటా వెదజల్లాలి. తరువాత తూర్పుతో మొదలెట్టి అష్టదిక్కులలోనూ ఈ అక్షతలను నిక్షేపించి సంపూర్ణ యజ్ఞమండలాన్నీ లేపనంతో తుడవాలి.


No comments:

Post a Comment