Monday 19 February 2024

శ్రీ గరుడ పురాణము (95)

 


వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు.


సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టినవారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించు కోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, అశ్వయుజ, కార్తిక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్నీ, ఉత్తరంలో తోకనీ, దక్షిణ దిశలో క్రోడాన్నీ, పశ్చిమంలో చరణాలనీ విస్తరింపజేసుకొని వాస్తునాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తరదిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకరరాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘమాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పుదిక్కులో వుంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవలి. కుంభ, మీన, మేష రాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్ఠం దక్షిణంలోనూ చరణాలు ఉత్తర పూర్వాలలోనూ వుంటాయి కాబట్టి ఆయా రాశులలో జన్మించినవారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరము ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ, వుంటాయి కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవడం శ్రేయస్కరం.


భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు వుండాలో కూడా వాస్తు శాస్త్రం నిర్దేశించింది. తూర్పు - పీపల, దక్షిణ పాకడ, పశ్చిమ బరగద, ఉత్తర- గూలర, ఈశాన్య - సేమలక. ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది.


వృక్షో రక్షతి రక్షితః


(అధ్యాయం 46)


No comments:

Post a Comment