Thursday, 31 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (130)



కపిల - తిరు చెంగట్టాన్ కుడిలో వినాయకుడు


మూడవ నామం కపిలుడు. కొద్దిగా ఎఱుపు డాలుండే రూపమది గణపతి, పెక్కు రంగులలో కన్పిస్తాడు. శుక్లాంబరధరం శ్లోకంలో చంద్రకాంతి వంటి తెలుపుతో ఉన్నట్లు వర్ణింపబడ్డాడు. కుంభకోణం దగ్గర ఉన్న తిరు చెంగట్టాన్ కుడిలో, తిరుతురై పూండి దగ్గర ఉన్న ఇడుంబనంలో శ్వేత వినాయకులున్నారు. అవ్వైయార్, తన స్తోత్రాలలో స్వామిని నీలం రంగుతో ఉన్నట్లు, మరొక చోట పగడపు రంగుతో ఉన్నట్లు వర్ణించింది. ఆమెకు అనేక వర్ణాలతో ఉన్న మూర్తి సాక్షాత్కరించాడు. ఉత్తర దేశంలో సాధారణంగా సిందూరంతో ఉంటాడు. తంజావూరు జిల్లాలో గణపతీశ్వరం అని ఉంది. ఇందు ముఖ్యమైన పదం సెంకాడు అనగా ఎట్టని అరణ్యమని, గణపతి, గజాసురుని చంపినపుడు అసురుని రక్తం అరణ్యంలో ప్రవహించగా అది ఎఱ్ఱనైంది. స్వామి కూడా ఎఱ్ఱనయ్యాడట. అది శుద్ధమైన రక్తవర్ణం కాదు. ఏనుగు శరీరానికి రక్తం పులిమితే ఎట్లా ఉంటుందో అట్టి వర్ణం.


గొప్ప యోధుణ్ణి చంపి రక్తం కారేట్లుగా చేయడం వల్ల ఇతనికి బ్రహ్మహత్య దోషం చుట్టుకొందిట. అతనికి అసలు దోషం ఉంటుందా? లోకానికి చూపడం కోసం బ్రహ్మహత్యాదోషం ఉన్నట్లుగా నటించాడు. రావణుని చంపి రాముడట్టా బాధపడినట్లు కనబడలేదా? దానికి ప్రాయశ్చిత్తంగా రామలింగాన్ని స్థాపించి పూజించలేదా? అట్లాగే గణపతి అక్కడొక ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని దోషం నుండి విముక్తుడయ్యాడని కథ. రాముడు శివపూజ చేసినచోట రామేశ్వరమైనట్లు, తిరు చెంగట్టాన్ కుడి, గణపతీశ్వరంగా ప్రసిద్ధిని పొందింది.

Wednesday, 30 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (129)



విఘ్నేశ్వర గాయత్రి


ప్రతి దేవతకు గాయత్రీ మంత్రం ఉంది. ఉపనయనంలో ఉన్న గాయత్రీ మంత్రానికి సవిత, దేవత. ఆమెయే పరమాత్మ శక్తి. ఇందు 24 అక్షరాలుంటాయి. అందరు దేవతలకూ అట్లా అక్షరాల సంఖ్య ఉంటుంది. వారి గాయత్రీ మంత్రంలో దేవత పేరుంటుంది. మొదటి భాగంలో ఒక పేరు చెప్పి అట్టి దేవతను తెలిసికొందుము గాక అని యుంటుంది. రెండవ భాగంలో ఆ దేవత యొక్క మరొక పేరు చెప్పి అట్టి దేవతను ధ్యానింతుము గాక అని యుంటుంది. మూడవ భాగంలో మరొక పేరు చెప్పి ఆ దేవత మమ్ములను సన్మార్గమున నడిపించును గాక అని ఉంటుంది.


గాయత్రీ మంత్రంలో సవితకు రెండు భాగాలలోను ధ్యానింతుము గాక అని యుండి మూడవ భాగంలో పేరు చెప్పకుండా అట్టి దేవత, బుద్ధులను ప్రేరేపించుగాక అని యుంటుంది.


మహా నారాయణోపనిషత్తులో పెక్కు గాయత్రీ మంత్రాలు చెప్పబడ్డాయి. పరమ శివ, విఘ్నేశ, సుబ్రహ్మణ్య, నందికేశ్వర గాయత్రులున్నాయి. ముందుగా తత్పురుష అని యుంటుంది. కానీ అథర్వవేదంలో విఘ్నేశ్వరునకు ప్రత్యేక గాయత్రి ఉంది. దానిని గణపత్యథర్వశీర్షం అంటారు. అందొక గణపతి గాయత్రి ఉంది. ఇందులో ముందుగా ఏకదంత అనే పదముంది.

Tuesday, 29 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (128)



అతనితో స్త్రీత్వం


ఒక దంతంతో ఉండడంలోనూ ఒక తత్త్వం దాగియుంది. దేవతాత్మం, స్త్రీ పురుషాత్మకం. ఒక ప్రక్క దంతం కలిగియుండి పురుషునిగా, మరొక ప్రక్కదంతం లేక స్త్రీ లక్షణంతో ఉన్నట్లే కదా! అతని తల్లిదండ్రులు అర్ధనారీశ్వర స్వరూపులే. తానూ అర్ధనారీశ్వరునిగా కనబడుతున్నాడు. శివుని అర్ధనారీశ్వర. తత్వంలో కుడివైపున మగవాడు, ఎడమవైపున ఆడది ఉండగా వినాయకునిలో మార్పుతో ఉంది. ఇతని కుడివైపున దంతం లేకపోవడం వల్ల స్త్రీగా, ఎడమవైపున పురుషునిగా ఉన్నట్లుంటుంది. 


Monday, 28 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (127)



ఏకదంతుడు - త్యాగానికి నిదర్శనం


ఏకదంతుడనగా ఒక దంతం కలవాడు. సాధారణంగా మగ ఏనుగులకు రెండు దంతాలుంటాయి. ఆడ ఏనుగులకు దంతాలే ఉండవు. కాని వినాయకుడు ఏక దంతుడేమిటి?


అతనికి మొదట్లో రెండు దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడబెరుకున్నాడు. అది విగ్రహాలలో క్రిందనున్న కుడిచేతిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకీ పనిచేసాడు? పురాణాలలో రెండు కథలున్నాయి. ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు హిమాలయపు రాతిపై వ్రాయవలసి వచ్చిందట. వ్రాసే సాధనమేమీ లేదు. అందువల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడట. దేనిని ఏనుగు గొప్పగా భావిస్తుందో దానినే విరిచి త్యాగం చేసాడని త్యాగగుణాన్ని ప్రశంసించే కథ ఇది.


మరొక కథ ప్రకారం గజముఖాసురుడు ఏ ఆయుధం వల్ల చంపబడలేదట. అందువల్ల తన దంతాన్నే పెరికి ఆయుధంగా గణపతి ప్రయోగించాడట. లోక క్షేమం కోసం తన అవయవాన్నే వినియోగించాడు. ఇంద్రునికి వృత్రాసురుని చంపడానికి వజ్రాయుధం కావాలి. దధీచి తన వెన్నెముకనే ఇచ్చి దాని నట్లా వాడు కొమ్మన్నాడు. దంతం, ఏనుగు యొక్క ఎముకయే కదా! దధీచి మాదిరిగా ఇతడూ ఎముకనిచ్చి లోకాన్ని కాపాడాడు.

Sunday, 27 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (126)



ఇతనికి అనేక రూపాలలో విద్యాగణపతి రూపం ఒకటి. వినాయక చవితి నాడు పూజా కల్పంలో 21 రూపాలకున్న నామాలు, 21 రకాల పువ్వులతో అర్చించాలని ఉంది. ఇందులో విద్యాగణపతికి రసాల పుష్పంతో పూజించాలని ఉంది. రసాలమనగా మామిడి. అత్మకు విద్యయే పండు వంటిది, నారదుడు ఒక పండును తీసుకొని వచ్చి చూపించగా ఎవరు ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి పండు నిస్తానని ఆశ చూపించాడు. అందు గణపతి జయించినట్లున్న కథ మనకు తెలిసిందే. జ్ఞాన ఫలానికి గుర్తే ఆ మామిడి పండు.


ఏనుగు నోరు - దాని తత్త్వము


ఏనుగు నోటికి ఒక ప్రత్యేకత ఉంది. నరులకు, జంతువులకు పెదవులను కదిపితే నోరు కన్పిస్తుంది. కన్నులకు రెప్పలుండి అవి పైకి క్రిందకు కదులుతూ కన్నులను రక్షిస్తూ ఉంటాయి. కన్నులు చూడడానికి కనురెప్పల పని యేమీ లేదు. కాని మాట్లాడడంలో పెదవులకు పాత్ర ఉంది. నాల్క, పండ్లు, పెదవులవల్లనే మాట్లాడగల్గుతున్నాం. శబ్దం వినబడుతోంది. ప, మ, అనే ధ్వనులు పెదవుల కలయిక వల్లనే సాధ్యం. వాటిని ఓష్ఠ్యములని అంటారు. ఆంగ్లంలో అట్టి అక్షరాలను Labial అంటారు. 


నోటిని కప్పేది ఏనుగు యొక్క తుండమే. నోటిని, చేతితో కప్పుట వినయాన్ని సూచిస్తుంది. చేతితో నోటిని కప్పుతాం. కాని ఏనుగు సహజమైన తుండంతోనే నోటిని మూస్తుంది. అది నోట్లో ఆహారం వేసినపుడు, కాని ఇంక ఏదైనా కారణం వల్లగాని తుండం ఎత్తినపుడు దాని నోటిని చూడగలం. ఇందులో చాలా తత్త్వం ఇమిడి యుంది. తుండంతో కప్పబడిన నోరు, ఏమని సూచిస్తోంది? పాండిత్యం ఎంత ఉన్నా, వాగుడుతనం లేకుండా ఉండాలని తప్పనిసరియైనపుడు మాత్రమే ప్రదర్శించాలని అదే సరియైన విద్వాంసుని లక్షణమని సూచించడం లేదా! అనగా పాండిత్యానికి మౌనమే చివరి మెట్టు.


Saturday, 26 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (125)



ఆనందరూపుడు 


వినాయకుడు నవ్వుతూ కన్పిస్తాడు. సంతోషం పూర్ణత్వాన్ని సూచిస్తుంది, సదాశివ బ్రహ్మేంద్రులు 'సతతం అనందవూర్ణ పోతోఽహం' అని సచ్చిదానంద పూర్ణ పోతోఽహం' అని గానం చేస్తూ ఉండేవారు. సంతోషంగా ఉంటే నవ్వుతూ ఉంటాం. ఆడుతూపాడుతూ ఉంటాం. దుఖపడుతున్నవాడు గంతులు వేయగలడా? గణపతి ఆనంద స్వరూపుడు కనుక అతడు నృత్త గణపతి. చాలా శివాలయాలలో గర్భగుడికి ఉన్న దేవతా ప్రతిమలలో ప్రధానంగా ఈ నర్తనమూర్తి కన్పిస్తాడు. పెద్ద బొజ్జుతో నృత్యం చేస్తున్నట్లుగా ఉంటాడు. అనందాన్ని ముఖమే కాదు బొజ్జ కూడా సూచిస్తుంది. 


ముఖం అనగా ఆరంభమని అర్థం. సుముఖ పదంతో మొదలు పెట్టబడ్డాడు కూడా.


మంచి నోరు కలవాడు


ముఖానికి నోరని అర్థం కూడా ఉంది. సంస్కృతంలో నోటికి విడిగా పేరు లేదు. మాట్లాడడానికి ప్రధానమైన ముఖానికి అన్ని పేర్లు. ఉచ్చరించే దానికి పేరు లేదు చూసారా?


ముఖమనగా నోరని ప్రస్తుతం చెప్పదలచుకున్నాను. సుముఖం అనగా మంచి నోరు, ఏమిటిది? మంచి మాటలు మాట్లాడేది సుముఖం, కనుకనే మంచి విద్వాంసుణ్ణి సుముఖుడని అంటాం. ఇట్లా అర్థం చేసుకుంటే గణపతి సుముఖుడే. ఆయన గొప్ప విద్వాంసుడు కదా! విద్వాంసుడనే మాట వేదాలలో బ్రహ్మణస్పతి, బృహస్పతి పదాల ద్వారా వ్యక్తీకరింపబడింది.

Friday, 25 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (124)



మానవముఖం కాక, ఏనుగుముఖం ఎందుకు వచ్చింది?


ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చనే మాటను బట్టి నరముఖ గణపతిని కూడా ధ్యానించొచ్చు అను కొంటాం. చిదంబరంలోని దక్షిణ వీధిలో ఇట్టి విగ్రహముంది, తెలిసిన వాళ్ళు చెబితేగాని తెలియదు. కాని మనం చటుక్కున నమ్మలేం, తిరుచిరాపల్లిలో ఒక ఱాతి కోట ఆలయంలో నరముఖంతో ఉన్నాడు. 


కొన్ని కథలననుసరించి అతని రూపం నరుడే యని ఉంది. అమ్మవారు తన భవనానికి ఒక రక్షకుణ్ణి నియమించాలని అనుకొందట. తన శరీరాన్ని పసుపు సున్నిపిండితో రుద్దుకుందట. దానితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. అతణ్ణి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది.


అమ్మవారు అన్ని విధాలా పవిత్రమైనదే కదా. కనుక మంగళకరమైన పసుపుతో నలుగు బెట్టుకోవడం వల్ల అసలు వినాయకుడు పసుపువల్లనే ఏర్పడ్డాడు. అందుకే ముందుగా పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి కొలుస్తాం.


పరమేశ్వరుడు పార్వతి భవనానికి వచ్చాడు. ఎవరీ మగవాడని గద్దించాడు. ఏమీ తెలియనట్లు కోపపడి అతని తలను నరికాడు. అన్నీ తెలిసి ఇట్లా ఎందుకు చేసాడు? అది లోక క్షేమం కోసమే. అది నాటకంలో ఒక భాగం వంటిది. గజముఖాసురుడనే రాక్షసుడుండేవాడు. పేరునుబట్టి గజముఖంతో ఉన్నవాడనే కదా అర్థం. మానవులకు పుట్టని గజముఖం కలవాడే నన్ను సంహరించగలడనే వరాన్ని అది ఎలాగూ సాధ్యం కాదనుకొని పొందాడు. అపుడు కైలాసంలో ఉత్తరంవైపు తల పెట్టుకొని పడుకొన్న ఏనుగు కనబడింది. అట్లా పెట్టి పడుకోవడం లోకానికే అశుభం. దానిని చంపి ఆ తలను ఈ పిల్లవానికి అతికి నాటకం అడాడు శివుడు. మరల దానికి ప్రాణంబోసి అమ్మవారిని సంతోషపెట్టాడు. ఇట్లా వినాయకుని నిమిత్తంగా చేసుకొని గజముఖ సంహారం జరిగేటట్లు లోకాన్ని రక్షించాడు, శంకరుడు.