Monday 28 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (127)



ఏకదంతుడు - త్యాగానికి నిదర్శనం


ఏకదంతుడనగా ఒక దంతం కలవాడు. సాధారణంగా మగ ఏనుగులకు రెండు దంతాలుంటాయి. ఆడ ఏనుగులకు దంతాలే ఉండవు. కాని వినాయకుడు ఏక దంతుడేమిటి?


అతనికి మొదట్లో రెండు దంతాలున్నాయి. కుడివైపున ఉన్న దంతాన్ని తాను ఊడబెరుకున్నాడు. అది విగ్రహాలలో క్రిందనున్న కుడిచేతిలో ఉన్నట్లుగా ఉంటుంది. ఎందుకీ పనిచేసాడు? పురాణాలలో రెండు కథలున్నాయి. ఒక కథ ప్రకారం వ్యాసుడు భారతాన్ని చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు హిమాలయపు రాతిపై వ్రాయవలసి వచ్చిందట. వ్రాసే సాధనమేమీ లేదు. అందువల్లనే తన దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించాడట. దేనిని ఏనుగు గొప్పగా భావిస్తుందో దానినే విరిచి త్యాగం చేసాడని త్యాగగుణాన్ని ప్రశంసించే కథ ఇది.


మరొక కథ ప్రకారం గజముఖాసురుడు ఏ ఆయుధం వల్ల చంపబడలేదట. అందువల్ల తన దంతాన్నే పెరికి ఆయుధంగా గణపతి ప్రయోగించాడట. లోక క్షేమం కోసం తన అవయవాన్నే వినియోగించాడు. ఇంద్రునికి వృత్రాసురుని చంపడానికి వజ్రాయుధం కావాలి. దధీచి తన వెన్నెముకనే ఇచ్చి దాని నట్లా వాడు కొమ్మన్నాడు. దంతం, ఏనుగు యొక్క ఎముకయే కదా! దధీచి మాదిరిగా ఇతడూ ఎముకనిచ్చి లోకాన్ని కాపాడాడు.

No comments:

Post a Comment