Thursday 31 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (130)



కపిల - తిరు చెంగట్టాన్ కుడిలో వినాయకుడు


మూడవ నామం కపిలుడు. కొద్దిగా ఎఱుపు డాలుండే రూపమది గణపతి, పెక్కు రంగులలో కన్పిస్తాడు. శుక్లాంబరధరం శ్లోకంలో చంద్రకాంతి వంటి తెలుపుతో ఉన్నట్లు వర్ణింపబడ్డాడు. కుంభకోణం దగ్గర ఉన్న తిరు చెంగట్టాన్ కుడిలో, తిరుతురై పూండి దగ్గర ఉన్న ఇడుంబనంలో శ్వేత వినాయకులున్నారు. అవ్వైయార్, తన స్తోత్రాలలో స్వామిని నీలం రంగుతో ఉన్నట్లు, మరొక చోట పగడపు రంగుతో ఉన్నట్లు వర్ణించింది. ఆమెకు అనేక వర్ణాలతో ఉన్న మూర్తి సాక్షాత్కరించాడు. ఉత్తర దేశంలో సాధారణంగా సిందూరంతో ఉంటాడు. తంజావూరు జిల్లాలో గణపతీశ్వరం అని ఉంది. ఇందు ముఖ్యమైన పదం సెంకాడు అనగా ఎట్టని అరణ్యమని, గణపతి, గజాసురుని చంపినపుడు అసురుని రక్తం అరణ్యంలో ప్రవహించగా అది ఎఱ్ఱనైంది. స్వామి కూడా ఎఱ్ఱనయ్యాడట. అది శుద్ధమైన రక్తవర్ణం కాదు. ఏనుగు శరీరానికి రక్తం పులిమితే ఎట్లా ఉంటుందో అట్టి వర్ణం.


గొప్ప యోధుణ్ణి చంపి రక్తం కారేట్లుగా చేయడం వల్ల ఇతనికి బ్రహ్మహత్య దోషం చుట్టుకొందిట. అతనికి అసలు దోషం ఉంటుందా? లోకానికి చూపడం కోసం బ్రహ్మహత్యాదోషం ఉన్నట్లుగా నటించాడు. రావణుని చంపి రాముడట్టా బాధపడినట్లు కనబడలేదా? దానికి ప్రాయశ్చిత్తంగా రామలింగాన్ని స్థాపించి పూజించలేదా? అట్లాగే గణపతి అక్కడొక ఈశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని దోషం నుండి విముక్తుడయ్యాడని కథ. రాముడు శివపూజ చేసినచోట రామేశ్వరమైనట్లు, తిరు చెంగట్టాన్ కుడి, గణపతీశ్వరంగా ప్రసిద్ధిని పొందింది.

No comments:

Post a Comment