Friday 25 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (124)



మానవముఖం కాక, ఏనుగుముఖం ఎందుకు వచ్చింది?


ఏ రూపాన్నైనా ధ్యానించవచ్చనే మాటను బట్టి నరముఖ గణపతిని కూడా ధ్యానించొచ్చు అను కొంటాం. చిదంబరంలోని దక్షిణ వీధిలో ఇట్టి విగ్రహముంది, తెలిసిన వాళ్ళు చెబితేగాని తెలియదు. కాని మనం చటుక్కున నమ్మలేం, తిరుచిరాపల్లిలో ఒక ఱాతి కోట ఆలయంలో నరముఖంతో ఉన్నాడు. 


కొన్ని కథలననుసరించి అతని రూపం నరుడే యని ఉంది. అమ్మవారు తన భవనానికి ఒక రక్షకుణ్ణి నియమించాలని అనుకొందట. తన శరీరాన్ని పసుపు సున్నిపిండితో రుద్దుకుందట. దానితో ఒక బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. అతణ్ణి కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది.


అమ్మవారు అన్ని విధాలా పవిత్రమైనదే కదా. కనుక మంగళకరమైన పసుపుతో నలుగు బెట్టుకోవడం వల్ల అసలు వినాయకుడు పసుపువల్లనే ఏర్పడ్డాడు. అందుకే ముందుగా పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి కొలుస్తాం.


పరమేశ్వరుడు పార్వతి భవనానికి వచ్చాడు. ఎవరీ మగవాడని గద్దించాడు. ఏమీ తెలియనట్లు కోపపడి అతని తలను నరికాడు. అన్నీ తెలిసి ఇట్లా ఎందుకు చేసాడు? అది లోక క్షేమం కోసమే. అది నాటకంలో ఒక భాగం వంటిది. గజముఖాసురుడనే రాక్షసుడుండేవాడు. పేరునుబట్టి గజముఖంతో ఉన్నవాడనే కదా అర్థం. మానవులకు పుట్టని గజముఖం కలవాడే నన్ను సంహరించగలడనే వరాన్ని అది ఎలాగూ సాధ్యం కాదనుకొని పొందాడు. అపుడు కైలాసంలో ఉత్తరంవైపు తల పెట్టుకొని పడుకొన్న ఏనుగు కనబడింది. అట్లా పెట్టి పడుకోవడం లోకానికే అశుభం. దానిని చంపి ఆ తలను ఈ పిల్లవానికి అతికి నాటకం అడాడు శివుడు. మరల దానికి ప్రాణంబోసి అమ్మవారిని సంతోషపెట్టాడు. ఇట్లా వినాయకుని నిమిత్తంగా చేసుకొని గజముఖ సంహారం జరిగేటట్లు లోకాన్ని రక్షించాడు, శంకరుడు.


No comments:

Post a Comment