Sunday 27 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (126)



ఇతనికి అనేక రూపాలలో విద్యాగణపతి రూపం ఒకటి. వినాయక చవితి నాడు పూజా కల్పంలో 21 రూపాలకున్న నామాలు, 21 రకాల పువ్వులతో అర్చించాలని ఉంది. ఇందులో విద్యాగణపతికి రసాల పుష్పంతో పూజించాలని ఉంది. రసాలమనగా మామిడి. అత్మకు విద్యయే పండు వంటిది, నారదుడు ఒక పండును తీసుకొని వచ్చి చూపించగా ఎవరు ప్రపంచాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి పండు నిస్తానని ఆశ చూపించాడు. అందు గణపతి జయించినట్లున్న కథ మనకు తెలిసిందే. జ్ఞాన ఫలానికి గుర్తే ఆ మామిడి పండు.


ఏనుగు నోరు - దాని తత్త్వము


ఏనుగు నోటికి ఒక ప్రత్యేకత ఉంది. నరులకు, జంతువులకు పెదవులను కదిపితే నోరు కన్పిస్తుంది. కన్నులకు రెప్పలుండి అవి పైకి క్రిందకు కదులుతూ కన్నులను రక్షిస్తూ ఉంటాయి. కన్నులు చూడడానికి కనురెప్పల పని యేమీ లేదు. కాని మాట్లాడడంలో పెదవులకు పాత్ర ఉంది. నాల్క, పండ్లు, పెదవులవల్లనే మాట్లాడగల్గుతున్నాం. శబ్దం వినబడుతోంది. ప, మ, అనే ధ్వనులు పెదవుల కలయిక వల్లనే సాధ్యం. వాటిని ఓష్ఠ్యములని అంటారు. ఆంగ్లంలో అట్టి అక్షరాలను Labial అంటారు. 


నోటిని కప్పేది ఏనుగు యొక్క తుండమే. నోటిని, చేతితో కప్పుట వినయాన్ని సూచిస్తుంది. చేతితో నోటిని కప్పుతాం. కాని ఏనుగు సహజమైన తుండంతోనే నోటిని మూస్తుంది. అది నోట్లో ఆహారం వేసినపుడు, కాని ఇంక ఏదైనా కారణం వల్లగాని తుండం ఎత్తినపుడు దాని నోటిని చూడగలం. ఇందులో చాలా తత్త్వం ఇమిడి యుంది. తుండంతో కప్పబడిన నోరు, ఏమని సూచిస్తోంది? పాండిత్యం ఎంత ఉన్నా, వాగుడుతనం లేకుండా ఉండాలని తప్పనిసరియైనపుడు మాత్రమే ప్రదర్శించాలని అదే సరియైన విద్వాంసుని లక్షణమని సూచించడం లేదా! అనగా పాండిత్యానికి మౌనమే చివరి మెట్టు.


No comments:

Post a Comment