Tuesday 14 April 2020

మంత్రోపదేశం - తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో ఓ సంఘటన



సీతమ్మ గురంచి విన్నప్పుడు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక ఘటన గుర్తుకు వస్తుంది.

--------------------------
*భగవంతుడు భక్త సులభుడు*...

శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన .

వారు పూజ చేసే టప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట . అది వారి అనుభవం.

ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట .
ఆశ్చర్యంతో , ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని
మంత్రోపదేశం చెసారట .
ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని వింటున్నాను . నిజమేనా అని అడిగిందట .
వారు అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు. అంటే, ఆమె అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట .
కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ , ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట .
ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ , ఆమె ప్రారభ్దానికి జాలి పడి , సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ
దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి .
ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేరట .
ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట .

ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ?
ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట .
గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట .

కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు . తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట .
గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి , తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట .
తల్లి రానని చెప్పిందిగా . ఏ మొహంతో పిలవగలను ? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట .

చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగేరట .
వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట .
ఆయన సంతోషానికి హద్దులు లేవు .
గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట .

ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు . వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట .
నేను రాకేం చెయ్యను ? అన్నదట .

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పినది

-----------------------

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది... అందరికీ మంత్రోపదేశం పొందాలని కుతూహలం. కానీ అది పొందిన తర్వాత జపం చేసే ఓపిక గానీ, ఆ నియమాలు పాటించాలన్న తపన గానీ చాలామందికి ఉండదు. అప్పుడు ఆ మంత్రదేవతకు ఆగ్రహం వస్తుంది. మీకు ఉపదేశం ఇచ్చిన పాపానికి ఆ గురువు కష్టాలపాలవుతారు. కనుక ఉపదేశం పొందాలనుకునే ముందు అన్నిటికి సిద్ధపడే తీసుకోవాలి.

1 comment:

  1. ఈ కథను నండూరి శ్రీనివాస్ గారూ చెప్పారు.

    ReplyDelete