Monday 16 September 2024

శ్రీ గరుడ పురాణము (290)

 


ఏకాదశీ* మహాత్మ్యం

* ఈ పురాణంలో వైష్ణవంలోని ఏకాదశిని మాత్రమే చర్చించడం జరిగింది.


ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు. ఆయన ఈ వ్రతాన్ని చేసి చక్రవర్తి, సమ్రాట్ అనిపించుకొనే స్థాయికి ఎదిగాడు. ఈ వ్రతపుణ్యం అంత గొప్పది. ఈ వ్రతంలో ప్రథమ నియమం కృష్ణ, శుద్ధ రెండు ఏకాదశులలోనూ జీవితాంతమూ భోజనం చేయకుండా వుండుట.


కౌరవ సమ్రాజ్ఞి గాంధారి దశమీ విద్ద ఏకాదశినాడు ఈ వ్రతాన్ని చేసింది. ఆ దోషం వల్ల ఆమె పుత్రులామె జీవితకాలంలోనే నశించారు. కాబట్టి దశమితో యుక్తమైన ఏకాదశినాడు వ్రతం చేయరాదు.


ద్వాదశితో కలిసిన ఏకాదశినాడు శ్రీ హరి వ్రతుల వద్దకు వచ్చి వుంటాడు. దశమితో కలిసిన ఏకాదశినాడు రాక్షసులు వచ్చి వుంటారు. తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశినాడు కూడా ఉపవసించి త్రయోదశినాడు పారణం చేయడం మంచిది.


ఒకరోజులో ఏకాదశి ఏకకళ మాత్రమే వుంటే ద్వాదశినాడీ వ్రతాన్ని చేయాలి. (తగులు, మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాలలో వాడుకలో వున్నాయి. తగులు మరీ తక్కువగా వుంటే మిగులులో చేయవచ్చని అర్థం) ఒకే రోజులో దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చేయాలి. అది పరమమంగళకరమైన రోజు; సర్వపాపవినాశకరమైన రోజు.


రాత్రి జాగరణ, పురాణ శ్రవణం, గదాధర విష్ణుదేవుని పూజ ఈ మూడిన్టినీ కృష్ణ శుద్ద ఏకాదశులలో, ఉపవాసంతో సహా జీవితాంతమూ చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరుచేసినా సుఖజీవనం, మోక్షప్రాప్తి కలుగుతాయి.


(అధ్యాయం -125)

Sunday 15 September 2024

శ్రీ గరుడ పురాణము (289)

 


శివరాత్రి వ్రతకథ విధానం


ఒకప్పుడీ వ్రతాన్ని శంకరభగవానుడు గౌరీదేవికుపదేశించాడు.


మాఘ, ఫాల్గున మాసాల మధ్యలో వచ్చే కృష్ణ చతుర్దశినాడు ఉపవాస, జాగరణాలు చేసి శివుని పూజించిన వారికాయన 'ఇక్కడ' భుక్తినీ 'అక్కడ' ముక్తినీ ప్రసాదిస్తాడు.


చాలాకాలం క్రిందట అర్బుద దేశంలో సుందరసేనుడను ఒక పాపాత్ముడైన నిషాద రాజుండేవాడు. అతడొకనాడు కుక్కలను వెంటబెట్టుకుని వేటకై ఒక అడవికి వెళ్ళాడు. దైవవశాన అతడికి ఏ జంతువూ దొరకలేదు. వెంట తెచ్చుకున్న ఆహారమూ, నీరూ నిండుకోవడంతో ఆకలి దప్పులతో అలమటిస్తూ వాటి కోసం కూడా తిరిగి దారి తప్పి రాత్రంతా నిద్రలేకుండా వెదకి చివరికి ఒక తటాకాన్ని చేరుకుని అక్కడే నిలచిపోయాడు. ఆకలి వల్ల నిద్రపట్టలేదు. అక్కడే ఒడ్డు మీద ఒక చెట్టు క్రింద అతనికి శివలింగం కనిపించింది. అతడు చెట్టుపైన రాత్రిని గడపడం కోసం ఎక్కగా అతడు కదిలినపుడల్లా ఆ చెట్టు ఆకులు శివలింగం మీద పడ్డాయి. అది బిల్వవృక్షం. అవి బిల్వపత్రాలు. అతడు త్రాగడానికి తెచ్చుకున్న నీళ్ళు శివలింగం మీద పడ్డాయి. పాత్ర నుండి పడిన నీటితో శివునికి అభిషేకం జరిగింది. అతని పొదిలోని బాణమొకటి జారి శివలింగం ప్రక్కన పడింది. అతడా బాణాన్ని తీసుకోవడానికి చేయి సాచినపుడా చేతికి శివలింగం తగిలింది.


* ఈ ప్రకారమా కొండరాజు ద్వారా రాత్రి జాగరణ, ఉపవాసము, బిల్వపత్రాలతో శివపూజ, లింగాభిషేకం అతనికి తెలియకుండానే జరిగిపోయాయి. అతనికి తెలియని విషయం మరొకటి కూడా ఉంది. ఆ రాత్రి శివరాత్రి తెల్లవారాక అతడు తన నిషాద రాజ్యానికి వెళ్ళిపోయాడు.


* శివలింగ సమీపంలో అతని బాణం పడిపోయినపుడతడు వంగి మోకాళ్ళపై కూర్చుని చేతిని ముందుకి చాచి దానినందుకున్నపుడతని చేయి శివలింగానికి తగిలింది కదా! తద్వారా అతనికి మోకాటిపూజ, శివస్పర్శన పుణ్యం కూడా కలిగాయి.


అతడు కొంతకాలానికి మరణించాడు. యమ దూతలాతని పాశబద్ధుని చేసి గొనిపోవుచుండగా శివదూతలడ్డుపడ్డారు. యమదూతలకు శివరాత్రి పుణ్యాన్ని వివరించి ఆ నిషాదుడు తన కుక్కలతో సహా నిష్పాపుడెలాగైనాడో బోధపరచి వానిని కైలాసానికి గొంపోయారు. ఈ విధంగా తెలియక చేసిన అసంకల్ప ప్రతికే ఇంత అదృష్టం పట్టినపుడు ఇక తెలిసి, సంకల్పించి మరీ శివరాత్రి వ్రతాన్ని చేసిన వారి సంగతి వేరే చెప్పాలా?


ఈ వ్రతానికి త్రయోదశినాడే దీక్షాగ్రహణం చేసి శివుని పూజించి ఇలా ప్రార్థించాలి.


ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యా మ్యహం నిశి |

పూజాం దానం తపోహోమం కరిష్యామ్యాత్మక శక్తితః ||

చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభు పరే హని ॥

భోక్ష్యేఽహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర ॥ (ఆచార 124/12,13)


మహాదేవునికి పంచామృతాలతో స్నానం చేయించి 'ఓం నమో నమశ్శివాయ' అనే మంత్రంతో పూజ చేయాలి. తదనంతరం పెరుగు, తిలతండులాలతో, వరి ధాన్యంతో నిర్మితమైన 'చరు' ని ఆహుతులుగా అగ్నిలో వ్రేల్చి పూర్ణాహుతినివ్వాలి. ప్రతి రాత్రి గీత వాద్యాలతో ఉత్సవాన్ని చేయించి హరి కథలను కూడా పెట్టించి తాను కథలను వినాలి. అర్ధరాత్రి, మూడోజాము, నాలుగోజాములు మొదలుకాగానే కాసేపు శివపూజ చేస్తూ మూలమంత్రాన్ని జపిస్తుండాలి. తెల్లవారగానే స్వామినీ విధంగా అర్థించాలి.


అవిఘ్నేనవ్రతం దేవత్వత్ప్ర సాదాన్మయార్చితం !

క్షమ స్వ జగతాం నాథ త్రైలో క్యాధి పతేహర ॥


యన్మయాద్యకృతం పుణ్యం యద్రుద్యస్య నివేదితం !

త్వత్ర సాదాన్మయాదేవ వ్రత మద్య సమాపితం ॥


ప్రసన్నో భవమే శ్రీమన్ గృహం ప్రతిచ గమ్యతాం |

త్వదాలోకన మాత్రేణ పవిత్రోస్మి న సంశయః ॥ (ఆచార.. 124/17-19)


తరువాత ధ్యాన నిష్ఠుడైన బ్రాహ్మణుని భోజనంతో తృప్తిపఱచి వస్త్ర, ఛత్రాదులతో, యథాశక్తి, ఆయనను పూజించి మరల పరమశివుని ఇలా వేడుకోవాలి.


దేవాదిదేవ భూతేశ లోకానుగ్రహ కారక ॥

యన్మయా శ్రద్ధయాదత్తం ప్రీయతాం తేన మే ప్రభుః॥॥ (ఆచార124/20,21)


ఇలా క్షమాపన స్తుతి చేయడంతో శివరాత్రి వ్రతమైపోతుంది. శివుడు సంప్రీతుడవుతాడు. సాధారణంగా ఈ వ్రతాంతంలోనే ద్వాదశ వార్షిక సంకల్పం చేస్తారు. ప్రతి ద్వాదశి నాడూ ఉపవాసజాగరణలతో సహా ఇలాగే ఏడాదిపాటు శివపూజను చేస్తారు. దీనివల్ల వ్రతికి సంపదలు, కీర్తి, పుత్రులు, అధికార ప్రాప్తి- ఇవన్నీ కలుగుతాయి. దేహాంతంలో శివలోకమూ ఒనగూడుతుంది. ఏడాది చివర పన్నెండుగురు బ్రాహ్మణులను భోజనం ద్వారా సంతృప్తి పఱచి దీపదానం చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (అధ్యాయం -124)

Saturday 14 September 2024

శ్రీ గరుడ పురాణము (288)

 

మాసోపవాసవ్రతం


ఇది సర్వోత్తమ వ్రతాలలో నొకటి. ఈ వ్రతాన్ని వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు పాలన చేసారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశినాడుపవాసం చేసి వ్రతారంభంలో విష్ణు భగవానునిలా ప్రార్థించాలి.


ఆద్యప్రభృత్యహం విష్ణో యావదుత్థానకం తవ| 

అర్చయే త్వామనశ్నంస్తు దినాని త్రింశదేవ తు ॥

కార్తికా శ్వినయోర్విష్ణో ద్వాదశ్యోః శుక్లయోరహం ! 

మ్రియే యద్యంతరాలే తువ్రతంభంగో సమేభవేత్ || (ఆచార.. 122/3,4)


స్వామీ! నీవు లేచేదాకా నేనేమి తినను. ఈ ఆశ్వయుజ కార్తీక శుద్ధ ద్వాదశులమధ్య నేను మరణిస్తే ఆవిధంగా వ్రతం చెడినా ఫలితం మాత్రం నాకు దక్కించు అని ఆయనను వేడుకొని మధ్యాహ్న, సాయంకాలాలలో స్నానం చేసి, హరిని, దేవాలయానికి పోయి సుగంధాదులతో పూజించాలి. ప్రతి మాత్రము తాను ఉబటన, సుగంధిత గంధాలే పాదులను పూసుకోరాదు.


ద్వాదశినాడు భగవానుడైన హరిని పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఒక మాసం దాకా హరినే పూజిస్తూ మంచినీళ్ళే త్రాగుతూ అప్పుడు పారణ చేయాలి. మధ్యలో ప్రతి నీరసంతో మూర్ఛపోతే ఇతరులు ఆయన నోటిలో పాలుపోయవచ్చు. దీనివల్ల వ్రత భంగం కాదు. ఈ వ్రతం భక్తి, భుక్తి, ముక్తిదాయకం. (అధ్యాయం -122)


భీష్మపంచకవ్రతం


కార్తీకమాసమంతా ఏకభుక్తాలతో, నక్తవ్రతాలతో, అయాచిత వ్రతాలతో, కూర-పాలు- పండ్లు వీటిలో నొక ఆహారంతో ఉపవాసాలతో హరిపూజనం గావిస్తూ గడపాలి. అలా గడిపిన వారికి అన్ని పాపాలూ నశించి అన్ని కోరికలూ తీరి, హరిని కటవాస ప్రాప్తి కలుగుతుంది.


హరివ్రతమెప్పుడైనా శ్రేష్ఠమే కాని, సూర్యుడు దక్షిణాయనంలోనికి వెళ్ళినపుడు చేసే ఈ వ్రతాలు అధిక ప్రశస్తాలుగా పేర్కొనబడుతున్నాయి. ఈ కాలం తరువాత చాతుర్మాసాలూ, కార్తీకమాసం సముచితాలుగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా కార్తిక శుద్ధ ఏకాదశి నాడీ వ్రతాన్ని మొదలు పెడతారు. ఈ రోజు త్రి సంధ్యలలో స్నానాలు చేసి యవాది పదార్థాలతో పితరులకు నిత్యపూజలను గావించి అప్పుడు హరిని పూజించాలి. ప్రతి మౌనంగా నెయ్యి, తేనె, చక్కెర, పంచగవ్యాలు, నీరులతో హరి మూర్తికి స్నానం చేయించి కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో హరి శరీరానికి అనులేపనం చేయాలి.


సాధకుడు పున్నమి వరకూ ప్రతిరోజూ విష్ణుదేవునికి నేతి తోడి గుగ్గిల ధూపాన్నిచ్చి పక్వాన్నాలనూ మధురమైన మిఠాయిలనూ నైవేద్యంగా సమర్పించి ఓం నమోవాసుదేవాయ అనే మంత్రాన్ని నూటెనిమిది మార్లు జపించాలి. తరువాత ఇదే మంత్రాన్ని స్వాహాయుక్తంగా పఠిస్తూ బియ్యం, నువ్వులు, నెయ్యిలను కలిపి వాటితో (దానితో) ఆహుతులివ్వాలి.


ప్రతి తొలిరోజు కమల పుష్పాలతో శ్రీమన్నారాయణుని పాదాలనూ, మలిరోజు బిల్వపత్రాలతో జంఘలనూ, మూడవరోజు గంధంతో నాభినీ, తరువాతి దినాన బిల్వ పత్రాలతో జవాపుష్పాలతో స్కంధమునూ, చివరిరోజు మాలతీ పుష్పాలతో స్వామి శిరోభాగాన్నీ పూజించాలి. ఈ అయిదురోజులు పుడమిపైనే నిద్రించాలి. ఈ రోజుల్లో క్రమంగా గోమయం, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యిలను మాత్రమే రాత్రి నోటిలో వేసుకోవాలి. పగలంతా ఏమీ తినరాదు. ఈ వ్రతం వల్ల ఇహంలో భోగం, పరంలో మోక్షం కూడాలభిస్తాయి. మాసంలోని రెండు పక్షాలలోనూ ఈ వ్రతాన్ని చేసిన వారికి ఏయే పాపాలుచేస్తే నరకానికి పోతామో ఆయా పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. (దీన్ని భీష్మపంచకవ్రతమని ఎందుకన్నారో తెలియరాలేదు. శోధించాలి)


సూతకులూ, మృతకులూ కూడా అశౌచకాలంలో కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. సూతకయనగా పుట్టుక, మృతకయనగ బంధుమరణము)


దశమీ ఏకాదశీ ఒకేరోజులో పడితే అది అసురదినమవుతుంది. కాబట్టి అటువంటి రోజు వ్రతం గాని ఉపవాసం కాని చేయరాదు.


(అధ్యాయం -123)

Monday 9 September 2024

శ్రీ గరుడ పురాణము (287)

 

చాతుర్మాస్యవ్రతం


ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశినాడుగాని పున్నమనాడు గాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి.


ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ | 

నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ ॥ 

గృహీతేఽస్మిన్ ప్రతేదేవ యద్య పూర్ణే మ్నియామ్యహం । 

తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదాజ్జనార్ధన ॥ (ఆచార ..121/2,3)


ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తికాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రత ఫలాన్నే దయచేయించుమని ఈ శ్లోకం ద్వారా హరిని ప్రార్థించడం జరుగుతోంది.


ఈలాగున ప్రార్థించి హరిని పూజించి వ్రత, పూజన, జపాదిక నియమ గ్రహణం చేయాలి. ఈ సంకల్పంతోనే పాపాలు దూరమవుతాయి. సాధకుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఆషాఢంనుండి (తో) మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఏకభుక్తముంటూ విష్ణుపూజ చేస్తే ఆయన యొక్క పరమ పవిత్రనిర్మల లోకాన్ని చేరుకుంటాడు.


నూనెలను,మద్యమాంసాదులను విసర్జించి, వేద పారంగతుడనిపించుకొని కృచ్ఛపాదవ్రతి* యైన విష్ణుభక్తుడీ వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెళతాడు. 'ఇది మూడురోజుల వ్రతం. తొలిరోజు ఒకేమారు హవిష్యాన్నాన్ని తినాలి. రెండవరోజు అయాచిత హవిష్యాన్నాన్నే తినాలి. మూడవరోజంతా ఏమీ తినరాదు (యాజ్ఞవల్క్యస్మృతి, ప్రాయ.. శ్లో 318). 


ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన ప్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు. మూడు రాత్రులు ఉపవాసం చేసి ఆ తరువాత మూడురాత్రులపాటు ఆరవ అంశనే భోజనం చేయు వ్రతికి శ్రీ ద్వీప నివాసం ప్రాప్తిస్తుంది. చాంద్రాయణ వ్రతం చేసిన చాతుర్మాస్య వ్రతికి ముక్తి, విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి. ప్రాజాపత్యవ్రతం చేసిన వ్రతికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతం చేసిన పరాకవ్రతికి సాక్షాత్తూ హరిప్రాప్తి యే చెప్పబడింది.


* చాంద్రాయణ వ్రతం మనుధర్మశాస్త్రం 11/216 లో పేర్కొనబడింది. తదనుసారము ఇది ఒక నెలపాటు పడవలసినపాటు త్రికాల స్నానం, పున్నం నాడు వ్రతం మొదలు, పదిహేను గ్రాసాల హవిష్యాన్న గ్రహణం, మరునాటి నుండి ఒక్కొక్క గ్రాసాన్ని తగ్గించుకుంటూ తిని కృష్ణపక్ష చతుర్దశినాడు ఒకే ఒక్క గ్రాసం తిని, అమావాస్యనాడు పూర్ణ ఉపవాసం, మరునాడు అనగా శుద్ధ పాడ్యమి నాడు ఒకే గ్రాసంతిని అలా రోజుకొకటి పెంచుకుంటూ పోయి పున్నంనాడు మరిల పదిహేనుగ్రాసాల హవిష్యాన్నాన్ని తిని వ్రత సమాప్తి చేయుట. *ప్రాజాపత్యవ్రతం పన్నెండు రోజుల వ్రతం. ఏనాడైనా నియమగ్రహణం చేసి తొలిమూడు రోజుల్లో పగలు మాత్రమే హవిష్యాన్నాన్ని తినాలి. మలి మూడురోజుల్లో రాత్రి మాత్రమే. తరువాతి మూడు రోజులు అయాచితం. చివరి మూడురోజులూ సంపూర్ణఉపవాసం (మను11/211)

పరాక వ్రతమనగా పన్నెండు రోజులపాటు ఏ ఘనపదార్థాన్నీ తినకుండా నీరు మాత్రమే త్రాగి ఉండిపోవుట.

(యా.స్మృ.ప్రా.320, మను 11/215) 


ఈ చాతుర్మాస్య వ్రతంలో సత్తుపిండినీ, యవాన్నాన్నీ మాత్రమే ఎవరైనా పెడితే తింటూ, పాలు, పెరుగు, నెయ్యిలను ఒక మారే నోటిలో వేసుకొని వుంటూ, గోమూత్ర యావకాన్ని తింటూ, పంచగవ్యాలను మాత్రమే త్రాగుతూ జీవించాలి. లేదా షడ్రసాలను పరిత్యజించి శాక-మూల- ఫలాలను మాత్రమే తినాలి. ఈ విధంగా చేసినవారు విష్ణులోక ప్రాప్తి నందగలరు.


(అధ్యాయం -121)

Sunday 8 September 2024

శ్రీ గరుడ పురాణము (286)

 




రంభాతృతీయ వ్రతం


బ్రహ్మదేవుడింకా ఇలా చెప్పసాగాడు, "సౌభాగ్యం, లక్ష్మి, పుత్రాది ఫలప్రదమైన రంభాతృతీయ వ్రతాన్నుపదేశిస్తాను. దీనిని మార్గశిర శుద్ధ తదియనాడు చేయాలి. ప్రతి మాసంలో ఈ రోజు ఉపవసించి (కుశాలను ఉదకాన్ని కలపి ఆ) కుశోదకాన్ని చేత బట్టుకుని బిల్వ పత్రాల చివరలను దానిలో ముంచి వాటితో మహాగౌరిని పూజించాలి. ఈ పూజలో కదంబవృక్షాన్నుండి తీసిన పలుదోముపుల్లను వాడాలి. పుష్యమాసంలో మరుబక పుష్పాలతో పార్వతీదేవిని పూజించి క్రుసర (కృశర) అనగా బియ్యం, నువ్వులు కలిపి వండిన సిద్ధాన్నమును నైవేద్యం పెట్టి మల్లికా దంతధావన సాధనాన్ని దేవికి సమర్పించాలి. ఉపవాసం చేసి కర్పూరాన్ని మాత్రమే ప్రాశించాలి. మిగతా మాసాల్లో.


మాసం- ప్రాశ్న- పూలు- నైవేద్యం- దేవత- పల్దోము పుల్ల


మాఘ- నెయ్యి- తెల్లకమల- పెరుగన్నం- సుభద్రాదేవి

ఫాల్గున- 'జీవ- కుంద- శష్కులి- గోమతి- కుందనాళం

(జీవ అనేది ఒక కాయగూర పేరు. ఇది పంచదారంత తీయగా వుంటుంది.)

(శష్కులి అంటే పూరీయే గాక తిల, తందుల, ఉడద చూర్ణంతో చేసిన యవాగు అనే అర్ధం కూడా ఉంటుంది.)

(తగర అనే పదానికి పూలచెట్టు, తెల్లపూలు, మదన వృక్షమనే అర్థాలున్నాయి.)

చైత్ర- పెరుగు- దమనక- కృశరాన్నం- విశాలాక్షి - తగరకాష్ఠ

వైశాఖ- అశోకమొగ్గ- కర్ణికార- శ్రీముఖి- వట

జ్యేష్ఠ- లవంగం- శతపర్ణి- చక్కెర- నారాయణి- శతపర్ణి

ఆషాఢ- తిల- బిల్వపత్ర- నెయ్యి, పాయసం- మాధవి- గూలర

శ్రావణ- తగర- క్షీరాన్నం- శ్రీదేవి- మల్లిక

భాద్రపద- సింగడా- పద్మ- బెల్లం- ఉత్తమాదేవి

అశ్వయుజ- అన్నం- జపా- సుగంధాన్నం- రాజపుత్రి

కార్తిక- పంచగవ్య- జాతి- కృశరాన్నం- పద్మజ


ప్రాశ్నయనగా నోటిలో వేసుకొనుట.


ఈ ప్రకారంగా మార్గశిరం నుండి కార్తికం దాకా ఒక ఏడాదిపాటు వ్రతాన్నవలంబించి చివర కొందరు బ్రాహ్మణులను వారి పత్నులతో బాటు పూజించి వారికి నేయి, నువ్వులతో వండిన వంటలతో భోజనం పెట్టాలి. పిమ్మట శివపార్వతులకు వస్త్ర, ఛత్ర, సువర్ణాదులతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ రాత్రంతా జాగారం చేసి గీత వాద్యాదులతో భజనలను ఏర్పాటుచేసి తెల్లవారగానే యథాశక్తి గోదానాదులను చేయాలి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి అన్ని సంపదలూ అబ్బుతాయి.


ఈ వ్రతాన్ని రంభ తొలిసారి చేసి ధన్యురాలైనది కాబట్టి ఆమె పేరిటనే దీన్ని వ్యవహరిస్తున్నారు. (అధ్యాయం -120)

Saturday 7 September 2024

శ్రీ గరుడ పురాణము (285)

 


అఖండ ద్వాదశీ వ్రతం


మునులారా! ఇప్పుడు మోక్ష శాంతిప్రదమైన అఖండ ద్వాదశీ వ్రతాన్ని వినిపిస్తాను. మార్గశిర శుద్ధ ద్వాదశినాడు ఆవుపాలు, పెరుగులను మాత్రమే భోజనంగా స్వీకరించి జగన్నాథుడైన విష్ణువును పూజించాలి. నాలుగు నెలలపాటు అనగా ఫాల్గున మాసం దాకా ప్రతి ఇలా ప్రతి ద్వాదశినాడూ చేసి చివర అయిదు రకాల ధాన్యాలను అయిదు రకాల ధాన్యాలను పాత్రలలో నింపి బ్రాహ్మణునికి దానం చేసి విష్ణుభగవానుని ఈ విధంగా ప్రార్ధించాలి. 


సప్త జన్మని హేవిష్ణో యన్మయా హి వ్రతం కృతం |

భగవంస్త్వ ప్రసాదేన తదఖండ మిహాస్తు మే ॥

యథాఖండం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ ।

తథాఖిలాన్య ఖండాని వ్రతాని మమ సంతువై ॥ (ఆచార ..118/3,4)


ఇలా తాను ఏడు జన్మలలో చేసే ప్రతిపుణ్య కర్మఫలాన్నీ అఖండం చేయుమని దేవుని ప్రార్థిస్తూ చైత్రాది నాలుగు మాసాల్లో సక్తు (సక్తు = పేలపిండి) తో నింపిన పాత్రలను, శ్రావణాది నాలుగు మాసాలలో నేయి నింపిన పాత్రలనూ బ్రాహ్మణునికి దానం చేయాలి. (సామర్థ్యం లేనివారు సంవత్సరంలో మూడు మార్లే దానమీయవచ్చును) ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని చేసినవారికి ఉత్తమ స్త్రీ, మంచి కొడుకులూ లభిస్తారు. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి వుంటుంది. (అధ్యాయం 118)


అగస్త్యార్ఘ్య వ్రతం


భుక్తి ముక్తి ప్రదాయకమైన ఈ వ్రతాన్ని కన్యారాశిలో సూర్యసంక్రాంతికి మూడు రోజుల ముందు ప్రారంభించాలి. కాశపుష్పాలతో (రెల్లుపూలతో) అగస్త్యుని మూర్తిని తెలతెల వారుతుండగా పూజించి కుంభంలోని నీటితో ఆ మహనీయునికి అర్ఘ్యమివ్వాలి. ఆ రోజంతా ఉపవసించి రాత్రి జాగరం చేసి తెల్లవారినాక బంగరు లేదా వెండి పాత్రలో, అయిదు రంగులున్నదానిలో, సప్తధాన్యములను పోసి, పెరుగునీ చందనాన్నీ కూడా రంగరించి అగస్త్యఃఖనమానః... అనే ఋగ్వేద (1/179/6) మంత్రం చదువుతూ మరల అర్ఘ్యప్రదానం చేయాలి. దీనికి ముందే పెరుగులో ముంచిన అక్షతలతోనూ, పూలతోనూ, పండ్లతోనూ ఆయన మూర్తిని పూజించాలి.


అర్ఘ్యానంతరం ఈ మంత్రంతో ప్రార్థించాలి.


కాశపుష్ప ప్రతీకాశ అగ్ని మారుత సంభవ |

మిత్రా వరుణయోః పుత్ర కుంభయోనే నమోస్తుతే ॥ (ఆచార .. 119/5)


ఈ వ్రతాన్ని శూద్రులు, స్త్రీలు కూడ చేయవచ్చును. పూజానంతరం ఒక కుండలో బంగారాన్నీ, వేరే దక్షిణనీ పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వాలి. వేరే ఏడుగురు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా ప్రతి సంక్రాంతినాడూ చేస్తూ ఒక యేడాది పాటు చేసినవారు సర్వ ప్రకారాల శ్రేయస్సులకూ అధికారులౌతారు. ( అధ్యాయం -119)


Wednesday 4 September 2024

శ్రీ గరుడ పురాణము (284)

 


అనంగ త్రయోదశీవ్రతం


బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇలా ఉపదేశించసాగాడు. హే మహర్షి! మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ఈ అసంగత్రయోదశి అనే వ్రతాన్నిచేయాలి.


మల్లికా వృక్షపు దంతపు పుల్ల, ఉమ్మెత్తపూలతో పండ్లతో శివుని పూజించాలి. తరువాత అనంగాయేతి... అదే మంత్రాన్ని పూర్తిగా చదువుతూ భగవంతుడైన శివునికి తేనెను నైవేద్యంగా అర్పించాలి. పుష్యమాసంలో ఆయననే యోగేశ్వరుడును పేర బిల్వ పత్రాలతో, కదంబ దంతపు పుల్లతో (పలుదోముపుల్ల) చందన, కృసరా (నైవేద్యం) దులతో పూజించాలి. 


మునులారా! మాఘమాసంలో నటనాగరుడైన శివదేవుని కుందపుష్పాలతో ముత్యాలమాలతో పూజించి పాకడ చెట్టు నుండి విరిచిన దంతధావనం పుల్లనూ పూరికా నైవేద్యాన్ని సమర్పించాలి. ఫాల్గునమాసంలో మరూబక (మండక) ములను పేరుగల పూలతో వీరేశ్వరనామక శివుని పూజించి ఆయనకు చక్కెర, కూర, గంజిలను నివేదించి మామిడి పల్డోము పుల్లను సమర్పించాలి.


చైత్రమాసంలో సురూప భగవానుని పూజించాలి. రాత్రి కొంచెం కర్పూరం నివేదించాలి. స్వామికి దంతధావనకి మజ్జిపుల్లనీ నైవేద్యానికి పూరీలను సమర్పించాలి. వైశాఖమాసంలో శివదేవుని సంహారకారక దమనక రూపంలో పూజించి ఉప్మా, బెల్లం నైవేద్యాలుగాను, గూలర (మేడి) పుల్లను దంతాల పనికనీ సమర్పించాలి. ప్రాశ్నకై జాతి ఫలాలను అర్పించాలి.


జ్యేష్టమాసంలో ప్రద్యుమ్నదేవుని చంపక పుష్పాలతో పూజించి బిల్వ దంతపు పుల్లని, లవంగమొగ్గలనూ సమర్పించాలి. ఆషాఢమానంలో ఉమాభద్రుని పూజించి అగరుగంధాన్ని పూసి ఉత్తరేని దంతపు పుల్లని సమర్పించాలి.


శ్రావణమాసంలో శూలపాణియైన శివుని పూజించాలి. గన్నేరుపూలు, గంధం, నెయ్యి, కలిపిన భోజనం, గన్నేరుపుల్ల పూజాద్రవ్యాలు భాద్రపదంలో సద్యోజాత నామంతో శివుని పొగడపూలతో పూజించి అరిసెలను వైవేద్యం పెట్టాలి. ఆశ్వియుజమాసంలో సురాధిపుడైన శివుని చంపకపుష్పాలు, బంగారు కలశతో నీరు, సువాసన వచ్చు మోదకాలు పూజాద్రవ్యాలుగా చేసి ఆరాధించాలి. దంతధావనపు పుల్లగా దమనకాన్ని సమర్పించాలి. కార్తికమాసంలో చంద్రపుల్లని దంతాలకీ, మదనపుష్పాలనూ, పాలనూ కూరగాయలను శివపూజానైవేద్యాలకి సమర్పించాలి. ఈ ఏడాదిలో ప్రతిరోజూ కమలపుష్పాలతో శివుని అర్చించాలి.


పైన చెప్పబడిన విధంగా సంవత్సరంపాటు పూజలు చేసిన తరువాత రతీసహితుడైన అనంగదేవుని స్వర్ణ ప్రతిమను స్వర్ణనిర్మితమైన మండలంలో స్థాపించి వారికి గంధాదులతో పూజ చేసి తిలలతో బియ్యంతో హవనసామగ్రిని తయారుచేసి వారికి పదివేల ఆహుతుల నివ్వాలి. రాత్రి జాగరణ చేసి గీత వాద్యాదులతో ఆనందభరితంగా గడిపి ప్రాతః కాలంలో ఆ దేవతలను మరల పూజించాలి. తరువాత బ్రాహ్మణులకు శయ్య, పాత్ర, చత్ర, వస్త్ర, పాదరక్షాదులను దానం చేసి గోవులకూ బ్రాహ్మణులకూ ఆత్మకింపయిన భోజనాలను భక్తి పూర్వకంగా పెట్టాలి. వ్రతం పూర్తయినాక ఉద్యాపన చేయాలి. ఈ విధంగా ఈ అనంగ త్రయోదశీ వ్రతాన్నాచరించిన వారికి లక్ష్మీ, పుత్ర సంతానం, ఆరోగ్యం, సౌభాగ్యం ఈ లోకంలో అక్షయంగా లభిస్తాయి. దేహాంతంలో స్వర్గం ప్రాప్తిస్తుంది. 


(అధ్యాయం-117)

Tuesday 3 September 2024

శ్రీ గరుడ పురాణము (283)

 


కురూపికి కూడా విద్య వుంటే కళ, కాంతి వస్తాయి. రూపాన్నంటే తల్లిదండ్రులివ్వలేక పోవచ్చుగానీ అవకాశముండీ పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువులకిందే లెక్క, విద్యరూపాన్నిస్తుంది. దాచుకున్న సొమ్ములాగా అక్కరకొస్తుంది. ఎవరి చేతిలోనైతే తాను వుంటుందో వానిని సాధు స్వభావిగా మారుస్తుంది. లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది. గురువులకు కూడా గురువైనది విద్య. అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు. విద్యయే పరమ దేవత. రాజుల చేత కూడ సామాన్యుడైన విద్యావంతుడు పూజింపబడతాడు. విద్యగల వాడే మనిషి, అది లేనినాడు పశువు. ఎట్టి ద్రవ్యమైనను దొంగలనుండి సంపూర్ణంగా సురక్షితమనలేము. కాని, విద్య దొంగలచేతికి దొరకని దైవం, ద్రవ్యం. (అనంతర కాలంలో తెలుగులో వెలసిన విద్యా పద్యాలకు ముఖ్యంగా విద్యలేనివాడు వింతపశువు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య నెఱుంగని వాడు మర్త్యుడే - వంటి సుప్రసిద్ధ భావాలకు గరుడపురాణమే మూలము)


(అధ్యాయం -115)


తిథులూ - వ్రతాలూ


బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ఇంకా ఇలా చెప్పాడు. 'హే వ్యాసమునీ! ఇపుడు నేను కొన్ని వ్రతాలను నీకుపదేశిస్తాను. వీటిని శ్రద్ధాభక్తులతో చేసే వారికి విష్ణువు అన్నీ ఇస్తాడు. అన్నిమాసాల్లో, అన్ని నక్షత్రాల్లో, అన్నితిథుల్లో హరికి ప్రియమైన వ్రతాలున్నాయి. 


ఏకభుక్తం, నక్తవ్రతం, ఉపవాసం లేదా ఫలాహారవ్రతం- ఏది చేసినా శ్రీహరి ఆ వ్రతికి ధన, ధాన్య, పుత్ర, రాజ్య, విజయాలలో ఎన్నెనా గానీ అన్నీ అయినా గాని ప్రసాదిస్తాడు.


దినార్ధ సమయే తీతే భుజ్యతే నియమేనయత్ | 

ఏకభుక్త మితిప్రోక్తం రాత్రే తన్న కదాచన ॥


పగటిలో సగం కాలం గడిచాక భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలు గడిచేదాకా ఏమీ తినకుండా చేసే వ్రతం ఏకభుక్తం.


దివ సస్యాష్టమే భాగే మందీభూతే దివాకరే | 

నక్తం తచ్చ విజానీయాన్న నక్తం నిశిభోజనం ॥

నక్షత్ర దర్శనాన్నక్తం గృహస్థేన విధీయతే |

యతేర్ది నాష్టమే భాగే రాత్రే తస్య నిషేధనం ॥


పగటిలో ఎనిమిదవ భాగం గడిచాక, సూర్య ప్రభలు మందమైపోతున్నపుడు భోజనం చేసి మరల ఇరువది నాలుగు గంటలలోపల ఏమీ తినకుండా వుండడాన్ని నక్తవ్రతమంటారు. గృహస్థు నక్షత్ర దర్శనమయ్యాక తినాలి. యతులు సూర్యాస్తమయానికి కాస్తముందు భిక్షాటన చేసి తినాలి.


పాడ్యమి తిథి నాడు వైశ్వానరునీ, కుబేరునీ పూజించాలి. వారు సాధకునికి అర్థలాభాన్ని అంటే ధన, కనక, వస్తు వాహనాదులను ప్రదానం చేస్తారు. పాడ్యమీ, అశ్వనీ నక్షత్రాలు కలిసిన నాడు ఉపవాసం చేస్తే బ్రహ్మదేవుడు, సంతోషించి అర్ధాన్నిస్తాడు.


తిథి       పూజ్యదైవతాలు             ఫలాలు


విదియ      యముడు, లక్ష్మీనారాయణుడు   అర్థలాభం

తదియ      గౌరి, శివుడు, గణేశుడు

చవితి       చతుర్వ్యూహాలతో విష్ణువు

పంచమి     హరి

షష్ఠి        కార్తికేయుడు, సూర్యుడు (రవి)

సప్తమి      భాస్కరుడు (ఉపవాసంచేయాలి)  అర్థలాభం

అష్టమి      దుర్గ

నవమి      మాతృకలు, దిశలు           అర్థలాభం

దశమి      యముడు, చంద్రుడు

ఏకాదశి     ఋషిగణాలు

ద్వాదశి    హరి, మన్మథుడు

త్రయోదశి   శివుడు

చతుర్దశి, పున్నమి బ్రహ్మ               

అమావాస్య  పితృగణాలు               ధనసంపత్తి


ఆదివారం అశ్వనితో మొదలుపెట్టి వరుసగా నాలుగు నక్షత్రాలను సోమవారం అయిదునుండి మరోనాల్గింటిని అలా శనివారం మూడిటితో మొత్తం ఇరవైయేడు నక్షత్రాలనూ పూజించినవారి కోరికలన్నిటినీ ఆ నక్షత్రాలు నెరవేర్చగలవు. (అధ్యాయం 116)


Monday 2 September 2024

శ్రీ గరుడ పురాణము (282)

 


తమ తమ నెలవులు దప్పిన తమ వారే శత్రులగుట తథ్యము కదా!


వర్ణం, వంశం, దేశం, స్నేహం, భోజనం వాటంతటవే తెలుస్తాయి. ఎవరూ ఎవరినీ అడగనక్కరలేదు. ఆచారాన్ని చూసి వర్ణ, వంశాలనూ, భాష, భాషణల తీరును బట్టి దేశాన్ని, మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్దతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని, శరీరపుష్టిని గమనించి భోజనాన్నీ పోల్చివేయవచ్చు. ఆచారాదులే చెప్తాయి. సముద్రంలో వాన, బాగా కడుపు నిండిన వానిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం, అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చుట, నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థము.


దూరసో ఽపి సమీపస్థో 

యోయస్య హృదయేస్థితః |

హృదయా దపి నిష్క్రంతః

సమీప స్థోఽపి దూరతః ||


(ఆచార .. 115/76)


గుండెలో గూడు కట్టుకొని కూర్చున్న ప్రాణి ఎంతదూరంలో వున్నా మనకు దగ్గరలో నున్నట్లే అనిపిస్తుంటుంది. హృదయంలోంచి తొలగించబడినవారు కాని హృదయం దాకా రాలేనివారు గాని పొరుగింట్లోనే వున్నా పరాయిదేశంలోనున్నట్లే లెక్క.


ముఖంలో వికృతి, గొంతుపూడుకుపోత, దైన్యభావం, చెమటతో తడిసి ముద్దైన శరీరం, అత్యంత భయంకర చిహ్నాలు. అవి సామాన్యమానవుని ఆకృతి పై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి. కాని, బిచ్చమెత్తుకొని బతికేవాని ఆకారం నిరంతరం ఇలాగే వుంటుంది.


మనిషి కుంచించుకుపోవడం, క్రిమిదోషంతో సదా పీడితుడై వుండడం, వాయు వికారగ్రస్తుడై వుండడం, రాజ్యం లేదా గృహం నుండి తగిలేయబడడం, పర్వత శిఖరంపై నివసించడం ఇవన్నీ కూడా ముష్టి వానిగా బతకడం కన్నా మంచివే. యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం.


జగత్పతిర్హి యాచిత్వా 

విష్ణుర్వామనతాం యతః |

కోన్యోఽధిక తరస్తస్య

యోర్థీ యాతి న లాఘవం ॥


(ఆచార 115/71)


జగత్పతీ, కొండంత దేవుడూనైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినపుడు అంతటి ఐశ్వర్యవంతుడూ కుంచించుకుపోయి వామనుడై పోయాడంటే ఇక కడమ వారిని గూర్చి చెప్పాలా?


ఇక విద్య యొక్క గొప్పదనాన్ని గూర్చి వినండి.

(*తెలుగు వారు భర్తృహరి సుభాషితాల ద్వారా దీనిని చిన్నపుడే వినేశారు. ఆ భర్తృహరికే మూలం గరుడపురాణం)


విద్యానామ కురూపరూప మధికం విద్యాతి గుప్తం ధనం 

విద్యాసాధుకరీ జనప్రియకరీ విద్యా గురూణాం గురుః |

విద్యా బంధుజనార్తి నాశనకరీ విద్యా పరం దైవతం 

విద్యా రాజసుపూజితాహి మనుజో విద్యా విహీనః పశుః||


(ఆచార .. 15/81) 

Sunday 1 September 2024

శ్రీ గరుడ పురాణము (281)

 

మనస్సుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం, శుభం. ఇతరుల సేవకై సమర్పింపబడేదే నిజమైన జీవనం. ధనం అందరికీ ఉపయోగపడినపుడే దానికి సార్ధక్యముంటుంది. సమర భూమిలో శత్రువుకెదురుగా నిలబడిచేసే గర్జనయే వాస్తవిక గర్జన. మదోన్మత్తత లేని స్త్రీయే శ్రేష్ఠవనిత. జితేంద్రియుడే నిజమైన పురుషుడు.


ఎంత గొప్ప రాజ్యైశ్వరాలైనా బ్రాహ్మణుని శాపంతగిలితే నశించిపోతాయి. ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైనా పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది. అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది. అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా పోతుంది.


సంగ్రహానికి క్షయమూ, ఉత్కర్షకి పతనమూ, సంయోగానికి వియోగమూ, జీవనానికి మృత్యువూ అంతాన్ని తెస్తాయి. మరణమృదంగాన్ని వాయిస్తాయి.


రాజులేని రాజ్యంలోగాని అనేక రాజులున్న రాజ్యంలోగాని నివాసముండకూడదు. అలాగే ఆడపెత్తనం, బాలురకే అధికారం వున్న ఆవాసాలూ త్యాజ్యాలే.


(ఆచార .. 115/63)


డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు, బంధువులు మిగలరు. స్త్రీ వ్యసనం కానీ, ఇతర వాంఛలు కానీ విపరీతంగా నున్న వానికి సిగ్గూ, భయమూ వుండవు. చింతామగ్నునికి అనగా నిత్యం బాధలూ వాటి ఆలోచనలే గల వానికి సుఖమూ, నిద్రా రావు. ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం, తేజం నిలబడవు.


అర్థాతురాణాం న సుహృన్న బంధుః 

కామాతురాణాం న భయం న లజ్జా । 

చింతాతురాణాం న సుఖం న నిద్రా 

క్షుధాతురాణాం న బలం న తేజః ॥


(ఆచార ..115/67)


తన బాధలూ, వాటికి సంబంధించిన ఆలోచనలూ ఉన్నవానికే కాదు దుష్టునికీ ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీతాసక్తి గలవానికి కూడా నిద్ర పట్టదు. పరకాంతా సక్తునికీ నిద్రపట్టదు. దోషికి నిద్రపట్టదు. ఋణమూ, రోగమూ లేనివాడూ, ఆడదాని జోలికే పోనివాడూ మాత్రమే నిద్రనొక భోగంలాగ అనుభవించగలరు.


కమలానికి జలంలో నిలబడివున్నంత కాలమే వరుణ, సూర్యదేవుల స్నేహం లభిస్తుంది. పడిపోతే ఏమీలేదు. ఎవరూ లేరు. మనిషైనా పదవిలో నున్నపుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు. దిగిపోయిన తరువాత ఎవరూ పట్టించుకోరు. ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మిగలవు. పైగా పదవిలోనున్నపుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయట పడుతుంటారు. కేశములూ, దంతములూ, గోళ్ళూ శరీరంపై నున్నంతకాలమే గదా, వాటికి విలువ!


స్థానా స్థితాని పూజ్యంతే పూజ్యంతే చ పదేస్థితాః |

స్థానభ్రష్టా న పూజ్యంతే కేశా దంతా నఖా నరాః ॥


(ఆచార .. 115/73)