Sunday 8 September 2024

శ్రీ గరుడ పురాణము (286)

 




రంభాతృతీయ వ్రతం


బ్రహ్మదేవుడింకా ఇలా చెప్పసాగాడు, "సౌభాగ్యం, లక్ష్మి, పుత్రాది ఫలప్రదమైన రంభాతృతీయ వ్రతాన్నుపదేశిస్తాను. దీనిని మార్గశిర శుద్ధ తదియనాడు చేయాలి. ప్రతి మాసంలో ఈ రోజు ఉపవసించి (కుశాలను ఉదకాన్ని కలపి ఆ) కుశోదకాన్ని చేత బట్టుకుని బిల్వ పత్రాల చివరలను దానిలో ముంచి వాటితో మహాగౌరిని పూజించాలి. ఈ పూజలో కదంబవృక్షాన్నుండి తీసిన పలుదోముపుల్లను వాడాలి. పుష్యమాసంలో మరుబక పుష్పాలతో పార్వతీదేవిని పూజించి క్రుసర (కృశర) అనగా బియ్యం, నువ్వులు కలిపి వండిన సిద్ధాన్నమును నైవేద్యం పెట్టి మల్లికా దంతధావన సాధనాన్ని దేవికి సమర్పించాలి. ఉపవాసం చేసి కర్పూరాన్ని మాత్రమే ప్రాశించాలి. మిగతా మాసాల్లో.


మాసం- ప్రాశ్న- పూలు- నైవేద్యం- దేవత- పల్దోము పుల్ల


మాఘ- నెయ్యి- తెల్లకమల- పెరుగన్నం- సుభద్రాదేవి

ఫాల్గున- 'జీవ- కుంద- శష్కులి- గోమతి- కుందనాళం

(జీవ అనేది ఒక కాయగూర పేరు. ఇది పంచదారంత తీయగా వుంటుంది.)

(శష్కులి అంటే పూరీయే గాక తిల, తందుల, ఉడద చూర్ణంతో చేసిన యవాగు అనే అర్ధం కూడా ఉంటుంది.)

(తగర అనే పదానికి పూలచెట్టు, తెల్లపూలు, మదన వృక్షమనే అర్థాలున్నాయి.)

చైత్ర- పెరుగు- దమనక- కృశరాన్నం- విశాలాక్షి - తగరకాష్ఠ

వైశాఖ- అశోకమొగ్గ- కర్ణికార- శ్రీముఖి- వట

జ్యేష్ఠ- లవంగం- శతపర్ణి- చక్కెర- నారాయణి- శతపర్ణి

ఆషాఢ- తిల- బిల్వపత్ర- నెయ్యి, పాయసం- మాధవి- గూలర

శ్రావణ- తగర- క్షీరాన్నం- శ్రీదేవి- మల్లిక

భాద్రపద- సింగడా- పద్మ- బెల్లం- ఉత్తమాదేవి

అశ్వయుజ- అన్నం- జపా- సుగంధాన్నం- రాజపుత్రి

కార్తిక- పంచగవ్య- జాతి- కృశరాన్నం- పద్మజ


ప్రాశ్నయనగా నోటిలో వేసుకొనుట.


ఈ ప్రకారంగా మార్గశిరం నుండి కార్తికం దాకా ఒక ఏడాదిపాటు వ్రతాన్నవలంబించి చివర కొందరు బ్రాహ్మణులను వారి పత్నులతో బాటు పూజించి వారికి నేయి, నువ్వులతో వండిన వంటలతో భోజనం పెట్టాలి. పిమ్మట శివపార్వతులకు వస్త్ర, ఛత్ర, సువర్ణాదులతో పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ రాత్రంతా జాగారం చేసి గీత వాద్యాదులతో భజనలను ఏర్పాటుచేసి తెల్లవారగానే యథాశక్తి గోదానాదులను చేయాలి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి అన్ని సంపదలూ అబ్బుతాయి.


ఈ వ్రతాన్ని రంభ తొలిసారి చేసి ధన్యురాలైనది కాబట్టి ఆమె పేరిటనే దీన్ని వ్యవహరిస్తున్నారు. (అధ్యాయం -120)

No comments:

Post a Comment