Tuesday 13 November 2012

శ్రీ సూక్తం




ఓం

దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తాం.అలక్ష్మీ(దరిద్రం)పోవాలని,సుఖశాంతుల కలగాలని కోరుకుంటాం.నిజానికి కేవలం పూజ వల్లనే కాదు,మనలో ఉన్న చెడు లక్షణాలను తొలగితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శ్రీ సూక్తం చెప్తోంది."సు" అంటే మంచిది."ఉక్తం" అంటే చెప్పేది లేదా చెప్పబడింది.శ్రీ(లక్ష్మి) గురించి వివరంగా చెప్పేది శ్రీ సూక్తం.

"హిరణ్యవర్ణాం హరిణీం......." అంటే బంగారు వర్ణంతో వెలిగిపోతున్నది లక్ష్మీ దేవి అంటూ మొదలైన శ్రీ సూక్తం అంటుంది
"క్షుత్ పిపాసా మలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం|
అభూతిం అసమృద్దిఞ్చ సర్వానిర్ణుద మే గృహాత్||"

క్షుత్-ఆకలి,పిపాసాం-దాహం,మలాం-విడువదగినది,జ్యేష్ఠాం,అలక్ష్మీ-జ్యేష్ఠా దేవి,దరిద్ర దేవత,నాశయామ్యహం-నశించాలి.అభూతిం-పేదరికం,mischeif,misery,poorness,అసమృద్ది-సమృద్ధి లేకపోవటం,non-accomplishment,failure,ill-success,సర్వాన్-వీటినన్నిటిని,నిర్ణుద-తీసెవేయి,మే గృహాత్-నా ఇంటి నుండి అనే అర్ధాలు వస్తాయి.

ఇప్పుడు వివరంగా చెప్పుకుంటే ఆకలిని నాశనం చెయ్యమంటే మనకు ఆహారం తీసుకోవడానికి కారణమయ్యే ఆకలి కాదు.ఎంత తిన్నా తీరని ఆకలి.ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న కోరిక.అదే అవినీతికి,కుంభకోణాలకు కారణం.అటువంటి ఆకలి నశిస్తే కానీ లక్ష్మీ అనుగ్రహించదు.

ఇక పిపాసాం-దాహం.ప్రక్కవారి ఆస్తులను,వస్తువులను,మనవి కాని వాటిని పొందాలన్న కోరిక(తీరని దాహం)నశించాలమ్మా అని అర్ధం.

మలాం అంటే విడువదగినది.మనకున్న చెడు అలవాట్లు,మనలో ఉన్న చెడు లక్షణాలు.ధూమపానం(smoking),మద్యపానం(alochol drinking),ఇంకా అనేకానేక చెడు లక్షణాలను నాశనం చేయి,అంటే నాకు వాటిని విడిచిపెట్టగల శక్తిని ప్రసాదించు,నేను ప్రయత్నిస్తే,నా ప్రయత్నానికి తోడు నిలువమ్మా అని అర్ధం.    

అభూతిం-పేదరికం,లేనితనం నశించాలి.పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు.ఎన్ని ఉన్న ఆనందం లేనివాడు పేదవాడే కదా.కావలసినవన్ని తినే స్థొమత ఉన్నా ఆకలి లేనివాడు,హంసతూలికతల్పాన్ని మరిపించే పరుపున్నా నిద్రపట్టిన వాడే కదా నిజమైన పేదవాడు.అటువంటి పేదరికం వద్దమ్మా నాకు అని అర్ధం.

అసమృద్ధి-సమృద్ధి లేకపోవటం,అపజయాల పాలుకావటం.సమృద్ధి అంటే కేవలం material growth మాత్రమే కాదు.ఆనందం,సుఖసంతోషాలు కూడా.ఎంత సంపాదించిన ఇవి లేకపోవటం అసమృద్ధే కదా.అటువంటి అసమృద్ధిని నాశనం చెయ్యి.

జ్యేష్టా లక్ష్మి,అలక్ష్మీ-అంటే దరిద్రం.దరిద్రం అంటే పేదరికం మాత్రమే కాదు అవినీతి సంపాదన అంటున్నది శాస్త్రం.అవినీతితో వేల కోట్లు సంపాదించడం,వాటితో బంగారు స్నానపుగదులు చేయించుకోవటం,వాటితో వందల గదుల భవనాలు నిర్మించుకోవటం లక్ష్మీ కటాక్షం కాదని గుర్తించమంటోంది శ్రీ సూక్తం.అంతేకాదు తెల్లవారుజామున నిద్రలేవకపోవటం,తల్లిదండ్రులను గౌరవించకపోవటం,మాట్లాడకూడని మాటలు మాట్లాడ్డం,తినకూడనివి తినడం,వినకూడనివి వినడం,చూడకూడనివి చూడడం,అత్యాస,చంద్రకాంతిని ఇంట్లోకీ రానివ్వకపోవటం,అక్రమాలు చేయడం,ఇంట్లో రెండు పూటల దీపారాధన చేయకపోవటం,మొహాన బొట్టు పెట్టుకోకపోవడం,తప్పులను సమర్దించడం,అసత్యాలను పలకడం(ఇంకా ఎన్నొ ఉన్నాయి,ఇంకొకసారి చెప్పుకుందాం)వంటివి ఎక్కడ జరుగుతాయో అక్కడ అలక్ష్మీదేవి(దరిద్ర దేవత) ఉంటానని చెప్పింది.అలక్ష్మి ఉన్నచోట లక్ష్మీ ఉండదు.కనుక అటువంటివి ఉంటే వాతిని సరిచేసుకోండి,విడిచిపెట్టండి అని అర్ధం.

ఇటువంటివన్ని మన ఇంట ఉంటే కనుక వాటిని సమూలంగా నాశనం చేయమని కోరుకోండి అంటోంది శ్రీ సూక్తం.అంతేకాని నలుగురి పొట్టకొట్టో,నాలుగు దోపిడిలు చేసో సంపాదించిన డబ్బు లక్ష్మి కాదని తెలుసుకోండి.అటువంటి అవలక్షణాలు ఉంటే వాటిని విసర్జించండి(విడిచిపెట్టండి).అప్పుడే లక్ష్మీ అనుగ్రహిస్తుందని గుర్తుంచుకోండి.లక్ష్మీ దేవికి కేవలం పూజలు కాదు ఆచరణ ముఖ్యం.

శ్రీ మహా విష్ణుతో ఉన్న లక్ష్మీ దేవినే ఆరాధించాలని లక్ష్మీ దేవియే స్వయంగా చెప్పింది.విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు,విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్ధం.అంతా వ్యాపించి ఉన్నది ప్రాణశక్తి.ప్రాణశక్తికి ప్రకృతి(పర్యావరణం)హృదయం/ఆధారం(లక్ష్మీ దేవి శ్రీ విష్ణు మూర్తి హృదయంలో ఎప్పుడూ కొలువై ఉంటుంది).ప్రకృతే ప్రాణుల మనుగడకు మూలం.అటువంటి ప్రకృతి లక్ష్మీ రూపం."ఓం ప్రకృత్యై నమః" అని లక్ష్మీ అష్టొత్తరశతనామాల్లో మొట్టమొదటి నామం.అటువంటి ప్రకృత్లో,పర్యావరణంలో అమ్మను(లక్ష్మీ దేవి) చూడండి.ప్రకృతిని గౌరవించండి.పర్యవరణాన్ని కాపాడండి.ఈరోజు నుండే పర్యావరణపరిరక్షణకు చర్యలు చేపట్టండి.లక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి.  

అందరికి దీపావళి శుభాకాంక్షలు.                              

         


 


No comments:

Post a Comment