Tuesday 25 June 2013

మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.

మనిషికి దురాశ పెరిగిపొయింది. ప్రకృతిని నిలువు దోపిడి చేసి సంపద పోగేయాలని చూస్తున్నాడు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రకృతిని తన అదుపులో పెట్టుకునే శక్తి తనకు ఉందని చూసి పిచ్చి కలలు కంటున్నాడు. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా ఎత్తులువేసిన పిచ్చి మనిషి తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. ఉత్తరాఖండ్‌లో జరిగింది కూడా అదే.

హిమాలయ పర్వతాల్లో అనేక నదులు ఉద్భవిస్తాయి. హిమనీనదులకు వేగం ఎక్కువ. పైగా అవి ఎత్తైన పర్వతప్రాంతాల మీది నుంచి లోయలగుండా ప్రవహించడం వల్ల సహజంగానే అవి మరింత వేగంగా ప్రవహిస్తాయి. ఇది జలవిద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతుందని, పైగా చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్టులతో పర్యావరణానికి మేలు చేస్తాయని అభిప్రాయంతో కేంద్రప్రభుత్వం తన ఇంధన విధానంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించింది. కానీ అందులో కొంతమాత్రం కూడా నిజం లేదు. ఇక సంపాదనే ధ్యేయంగా పనిచేసే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ అధిక లాభాల కోసం దేవభూమి ఉత్తరాఖండ్‌పైకి దండేత్తాయి. పుట్టగొడుగుల్లా జలవిద్యుత్ ప్రాజెక్టులు పుట్టుకొచ్చాయి.  

ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో  14 నదీలోయల వెంట చిన్న, పెద్ద కలుపుకుని 220కి పైగా జలవిద్యుత్, గనుల ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవన్నీ కాకుండా కేంద్రం మరో 37 జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మరో 70 ప్రాజెక్టులు ప్రాధమిక దశలో ఉన్నాయి.

ఒక అంచనా ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా, యమున వంటీ ప్రధాన నదులతో పాటు వాటి ఉప్నదులన్నీ కలుపుకుంటే.....ప్రతి 5,6 కిలోమీటర్లకు ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు ఉందని నిపుణులు అంటున్నారు.    

ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అడవులు నరికేయడం, రహదారులు, పవర్‌హౌజులు, పంపిణీ లైన నిర్మాణం తదిర చర్యల వల్ల భూమి కోతకు గురైంది. ఉత్తరాఖండ్‌లో అలకానంద, భగీరథీ నదుల పొడవులో 70% వరకు ప్రాజెక్టులే ఉన్నాయి. అందువల్ల నదీ ప్రవాహం 70% మేర సొరంగాలు గుండా సాగడం లేదా రిజర్వాయర్ల రూపంలో మారిపోవడం జరిగింది. ఇవి అక్కడి ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాయి. పర్యావరణనికి, జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. అక్కడికి వాతావరణాన్ని మార్చేస్తున్నాయి.    

ఈ తరహాలో మనమూ, మన ప్రభుత్వాలు ప్రకృతి మీద చేస్తున్న దాడికి పడిన శిక్ష ఈ వరదలు. ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పర్యావరణాన్ని రక్షించాలి.

No comments:

Post a Comment