Saturday 29 June 2013

అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి మీద మనిషి చేసిన దాడి చిన్నదేం కాదు. కొండల మీద హోటళ్ళు, రిసార్టులు నిర్మించారు. అత్యాశకు పోయి కొండల పైకి నిర్మాణాలను పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలో కొండరాళ్ళను బద్దలు చేశారు. ఫలితంగా కొండలు బీటలు బారాయి. కొండలను తొలగించగా మిగిలేది మట్టే. మట్టి కొట్టుకుపోకుండా చెట్లు ఆపుతాయి. వాటిని కూడా ఇష్టానుసారం నరికేశారు. ఫలితంగా అక్కడ కురిసిన భారీవర్షాలకు అటు కొండచరియలు విరిగిపడ్డాయి. మట్టి కొట్టుకుపోయి నది ప్రవాహంలో కలిసింది.

జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టే సమయంలోనూ, గనుల తవ్వకాల్లో సమయంలో వచ్చిన మట్టిని తరలించడం కష్టమని నదీ గర్భంలో పడేశారు. నదీగర్భంలో ఉన్న ఇసుకను ఇసుకను ఇసుక మాఫియా దోచుకుంది. పర్యావరణానికి ప్రమాదం అని తెలిసినా నదీగర్భంలో ఉన్న ఇసుకను మొత్తం అక్రమంగా తరలించారు. ఆఖరికి నదీగర్భంలో సహజంగా ఉండే రాళ్ళను కూడా స్టోన్ క్రషర్‌లతో విరగ్గొట్టి తరలిచారు. ఒక్క ఉత్తారఖండ్‌లోనే భగీరథి నది వెంట నదిగర్భంలో అక్రమంగా 141 స్టోన్ క్రషర్‌లు ఉన్నాయి.

ఇసుక పొరలన్నీ తీసివేయగ మిగిలేది మట్టే. ఇసుక నీటి ప్రవహాన్ని తట్టుకుని నిలబడుతుంది. కానీ మట్టికి ఆ బలం లేదు. బురదగా మారి నీటి ప్రవహాంలో కొట్టుకుపోతుంది. అక్కడ అదే జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో నదీగర్భంలో పడవేసిన రాళ్ళు, మట్టి, నదీగర్భంలో ఉన్న మట్టి ఇవన్నీ ఒక్కసారిగా వచ్చిన వరద ఉదృతికి కొట్టుకువచ్చాయి. భయంకరమైన ఉత్పాతాన్ని సృష్టించాయి. ఎన్నో ఇళ్ళు, గ్రామాలు, హోటళ్ళు బురదతో నిండిపోయాయి. వరదలో కొట్టుకువచ్చిన బండరాళ్ళు ఎన్నో ప్రాణాలను బలిగొన్నాయి.

ఇవన్నీ మానవుడు ఆ ప్రాంతంలో చేసిన చర్యలకు ప్రతిఫలాలు. ఉత్తారఖండ్‌లో నదుల మీద జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా స్వామి నిగమానంద 19 ఫిబ్రవరి 2011 నుంచి 14 జూన్ వరకు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. అప్పుడే మనం మేల్కొని ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదా?
          

No comments:

Post a Comment