Sunday 27 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వకుళమాత, పద్మావతీదేవి

ఓం నమో వేంకటేశాయ

వకుళ ఎవరో కాదు యశోద. ద్వారయుగంలో ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించి, కృష్ణపరమాత్మను పెంచింది యశోద. అంత చేసిన కృష్ణుడి వివాహాం చూసే భాగ్యం లేకపోయిందని బాధపడింది. కృష్ణయ్య , నువ్వు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూడలేకపోయాన్రా, నీ వివాహం చూడాలనుంది రా! అంటుంది. అప్పుడు కృష్ణుడు అమ్మా! నా వివాహం చూడడం ఇప్పుడు కుదరదు, రాబోయే 28 వ కలియుగంలో నీ చేతుల మీదుగానే వివాహం చేసుకుంటాను, నువ్వే జరిపిద్దుగానివి అంటూ ఓదారుస్తాడు.

ఆ యశోదయే ఈ వకుళమాత. ఈ యుగంలో శ్రీనివాసుడికి మాతృస్థానంలో ఆయన వివాహం జరిపిస్తుంది. వరాహస్వామి ద్వారా శ్రీనివాసుడికి చెంతకు చేరింది. శ్రీనివాసుడి తల గాయానికి మందు రాసింది. గోరుముద్దలు తినిపించింది. సపర్యలు చేసింది. తన ముందు నిల్చున్నది మాములు వ్యక్తి కాదు, తన చిన్ని కృష్ణుడేనని గుర్తుపట్టింది.

ఇది ఇలా ఉండగా, ఒకనాడు వేటకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. తన మనోసంకల్పంతో వాయుదేవునకు సందేశం పంపాడు శ్రీనివాసుడు. అశ్వరూపంలో (గుర్రం) వాయుదేవుడు వచ్చి సిద్ధంగా నిలుచున్నారు.

ఎక్కడున్నా లక్ష్మీదేవి మనస్సంతా స్వామి చెంతనే ఉంటుంది. అందుకే అమ్మవారు వాయువైన అశ్వానికి పగ్గాలుగా నిలిచింది. గోపిచదనంతో ఊర్ధ్వపుండ్రం ధరించి, కెంపురంగు తిలకధారణ చేసి, చక్కగా తయారయ్యి అశ్వం మీద వేటకు బయలుదేరాడు.

భగవంతుడు వేటాడడం ఏమిటి? ..... అంటే పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రతిజీవికి మృత్యువు ముందే నిర్ణయించబడి ఉంటుంది. కొందరికి మోక్షం లభించాలి, ఎంతో సాధన చేసినా, చేసిన పాపం అనుభవించక తప్పదు. అందులో భాగంగానే జంతు, పక్షి, ఇతర క్రిమికీటకాదులు మొదలైనవాటి జన్మ వస్తుంది. మరి ఆ పాపం తీరాకా జీవుడిని ఆ దేహం నుంచి విడిపించాలి కదా. అందులో భాగంగానే భగవంతుడు వేట ప్రారంభించాడు. సరదా కోసం కాదు, జీవుడిని తనలో ఐక్యం చెసుకోవడం కోసం, జనమరణ చక్రం నుంచి తప్పించడం కోసం.      

ఇంతలో శ్రీనివాసుడికి ఒక మదమెక్కిన ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగును శ్రీనివాసుడు వెంబడించగా, అది చాలా దూరం పరిగెత్తి, ఇక అలిసిపోయి శ్రీనివాసుడికి తొండంతో నమస్కరించి శరణాగతి వేడగా, స్వామి దాన్ని విడిచిపెట్టెస్తాడు. నమస్కరించిన వెళ్ళిపోతున్న ఏనుగు దిశగా చూసిన శ్రీనివాసుడికి ఒక మహాసౌందర్యవతియైన కన్య తన చెలికత్తెలతో కలిసి విహారం చేయడం కనిపించింది.

భగవంతుని దృష్టికి ప్రత్యేకంగా కనిపించిన ఆ కన్య ఎవరు? ఆమె వృత్తాంతమేమిటి? అని కధ వింటున్న శౌనకాది మహామునులు సూతమహర్షిని ప్రశ్నిస్తారు. అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్తున్నారు.

సువీర అనే రాజు కొడుకు సుధర్మ. సుధర్మ పుత్రుడు ఆకాశరాజు. ధార్మికుడు, సుపరిపాలకుడైన ఆకాశరాజుకు అన్నీ ఉన్నా సంతానం లేరు. ఈ లోటు ఆయన్ను బాధించసాగింది. ఇంత రాజ్యం ఉండి ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించే కొడుకు లేడు? నా తరువాత పితృతార్యాలు ఏవరు చేస్తారు? ఎన్నో దానాలు చేసిన నాకు కన్యాదానం చేసే భాగ్యం కలగదా? నాకీ దుస్థితి ఏంటి? అని దుఃఖించసాగాడు.

గురువులనుం, పెద్దలను, జ్ఞానులను సంప్రదించి సంతానం కోసం ఒక మహాయాగం చేయాలని నిశ్చయించుకుంటాడు. యజ్ఞస్థలం తిర్పతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు (అలిమేలుమగాపురం / మంగాపురం) ప్రదేశం. యజ్ఞం చేసే ముందు భూమిని శుద్ధి చేయడానికి భూమిని దున్నాలి. అలా భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశరాజు నాగలికి ఒక స్వర్ణపద్మం తగులుతుంది. ఆ స్వర్ణపద్మంలో ఒక మహా తేజోమూర్తి, లక్ష్మీకళ ఉట్టిపడుతున్న ఒక పసిపాప ఉంటుంది. ఇది చూసిన రాజు ఆశ్చర్యంతో ఏమి పాలుపోక నిల్చుని ఉంటాడు.

ఇంతలో అశరీరవాణి "మీ కోసమే ఈ బాలిక జన్మించింది. నీ కూతురుగా స్వీకరించి పెద్దదాన్ని చెయ్యి. మహాలక్ష్మీ అంశకలిగిన ఈ అమ్మాయిన విష్ణువు పెళ్ళి చేసుకుంటాడు" అని వినిపిస్తుంది. ఈ పసిపాపే మన కూతురు, ఈమెను ప్రేమతో పెంచు అని తన భార్యకు అప్పగిస్తాడు. యజ్ఞం పూర్తి చేస్తాడు. తర్వాత వసుద అనే కొడుకు పుడతాడు. పద్మంలో పుట్టింది కనుక పద్మావతి అని నామకరణం చేస్తారు ఆ పాపయికి. ఈ అమ్మాయే ఇప్పుడు శ్రీనివాసుడికి కనిపించిందని చెప్తారు సూతులవారు.

శ్రీనివాసుడు వేటకు భయలుదేరకముందే నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పద్మావతీదేవి చెలికత్తెలతో కలిసి విహరిస్తున్న ఉద్యానవనానికి వెళతాడు. శ్రీనివాసుడు యందు మొహం కలిగించడానికి చేసే ప్రయత్నం ఇది. నారదుడిని చూసి పద్మావతీ దేవి భయపడగా, ఏం ఫర్వాలేదునని, తాను ఆనె శుభం కోరేవాడినని, ఆమెకు భవిష్యత్తు చెప్తానని పద్మావతీదేవి చేయి చూపించమంటాడు.

హస్త రేఖలు పరీక్షించి శ్రీ మన్నారాయణుడే ఆమెకు భర్తగా వస్తాడని జోస్యం చెప్పి, వచ్చే భర్త ఏలా ఉంటాడు, అతడి అవయవలక్షణాలన్నీ వర్ణించి, ఆమెలో కాబోయే భర్త పట్ల ఆలోచనలు రేకెత్తిస్తాడు.

ఏనుగు వెళ్ళిపోయిన తరువాత పద్మావతీదేవిని చూసిన శ్రీనివాసుడు, ఆమెను పరిచయం చేసుకోవడం కోసమని ఆమె దగ్గరకు వెళతాడు. తాను శ్రీకృష్ణుడననీ, తన తల్లిదండ్రులు దేవకీవసుదేవులనీ, తాను ఇప్పుడు వేంకటాచలంలో నివాసముంటున్నానని, తన వివరాలు చెప్తాడు. పద్మావతీదేవి కూడా తానది అత్రిగోత్రం అని, తన ప్రవర చెప్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగిరిస్తుంది. తన శ్రీనివాసుడితో వివాహం ఇష్టమేనని చెప్తుంది. కానీ అంతఃపురం స్త్రీలతో ఉద్యానవనంలో శ్రీనివాసుడు మాట్లాడిన విషయం ఆకాశరాజుకు తెలిస్తే, దండిస్తాడని, అందువల్ల త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వారిస్తుంది. కానీ శ్రీనివాసుడు వినడే! అక్కడే నిలిచున్నాడు.

ఎవరైనా చూస్తారని భయం పట్టుకుంది పద్మావతీదేవికి. అసలే మహాసౌందర్యవంతుడు, తాను ఇష్టపడినవాడు, తనను ఇష్టపడేవాడు, దండనకు గురైతే చూడలేదు, ఇతడేమొ కదలట్లేదు , ఇక చేసేది లేక తన చెల్లికత్తెలతో రాళ్ళు విసిరేలా ప్రేరేపిస్తుంది.  

రాళ్ళదాడిలో శ్రీనివాసుడు గుఱ్ఱం ప్రాణం విడిస్తుంది (వాయుదేవుడు ఆ ఆశ్వం యొక్క దేహాన్ని విడిచిపెడతాడు). స్వామికి దెబ్బ తగలదుకానీ, పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ హడవుడిలో ముడివేసిన స్వామి జుట్టు ఊడి, వస్త్రాలు చిందరమందరగా తయారవుతాయి. ఎలాగో అలాగ తప్పించికుని ఇంటికి చేరతాడు శ్రీనివాసుడు.

ఇంటికి చేరాక దిగులుతో అన్నం మానేసి, మంచం మీద పడుకుని ఏదో పోయినట్లు ఏడుస్తాడు (ఏడుపు నటిస్తున్నాడని అర్దం చేసుకోవాలి). ఇంతలో వకుళమాత చేతిలో భోజనపళ్ళెంతో శ్రీనివాసుడు వద్దకు వచ్చి "ఏం నాయనా! భోజనం చేయలేదేమి? ఆరోగ్యం బాగోలేదా? లేక భూతప్రేతపిశాచాలు బాధిస్తున్నాయా? అసలు నీ దుఃఖానికి కారణం ఏమిటి? చెప్పు " అంటూ ప్రశ్నిస్తుంది. కానీ ఈయన ఏమి చెప్పడు. మళ్ళీమళ్ళీ ప్రశ్నించడంతో కాసేపటికి శ్రీనివాశుడు వకుళమాతలో " పిశాచభూతాలు నన్నేం చేస్తాయమ్మ, నేనే మహద్భూతాన్ని (సర్వోత్తముడిని). నా పేరు చెబితినే ఇతరులకు పట్టిన పిశాచాలు తొలగిపోతాయి. నాకేం బాధలేదులే " అంటాడు.

కానీ వకుళమాత ఊరుకోదు. బిడ్డలు ఏడుస్తుంటే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అందుకే మరల మరల ప్రశ్నిస్తుంది. చాలాసేపటికి శ్రీనివాసుడు తాను పద్మావతీదేవిని చూసిన విషయం చెప్పి, ఆమె లేని జీవితం అసలు జీవితమే కాదని, ఆమెనే పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు.

ఒకసారి నువ్వు నా బిడ్డవైనప్పుడు, మోక్షం అడగవల్సిందిపోయి నీ వివాహం చూడాలని ఉంది అని వరం అడిగాను. అప్పుడు ఏదో మాయలో పడ్డాను కానీ, ఇప్పుడు పడను. నువ్వెంత మాయలో పడవేయాలనుకున్న, నేను ఆ ఆవకాశం నీకు ఇవ్వను. నీకూ పద్మావతీదేవికి వివాహం చేసి, నా వరం తీర్చుకుంటాను అంటుంది వకుళమాత.

No comments:

Post a Comment