Sunday 31 May 2015

హిందూ ధర్మం - 160 (వేదంలో విజ్ఞానశాస్త్రం)



వేదాల్లో టెలిగ్రాఫీ (తంతి) గురించి :

అశ్వినీ శక్తుల (రెండు వ్యతిరేక దిశల మధ్య ఉండే) సాయంతో, సైన్యం సమర్ధవంతంగా పని చేయడం కోసం  విద్యుత్ యొక్క మంచి కండక్టర్‌లైన తంతి పరికరాలను అమర్చి వాడుకోండి. కానీ జాగ్రత్తగా ఉపయోగించండి - ఋగ్వేదం 1.119.10

యజుర్వేదం 18-8, 12 మంత్రాల్లో వివిధ రకాల జంతువుల గురించి ఉంది. ఇది జంతుశాస్త్రానికి బీజం వేసింది.

అధర్వణ వేదం 10 వ కాండంలో శరీర నిర్మాణ శాస్త్రం గురించి ప్రాధమిక వర్ణన ఉంది.

రెండు మడమల మీద మానవదేహం నిలబడేలా యుక్తితో కూర్చిందెవరు? మాంసంతో మందంగా కప్పిందెవరు? చీలమండలను తయారుచేసిందెవరు?  అందమైన వేళ్ళను రూపొందించి, కీళ్ళ ద్వారా కలిపిన తత్వం ఏమిటి? మానవునికి జ్ఞానేంద్రియాలను ప్రసాదించిందెవరు? కాళ్ళకు అరికాళ్ళను అమర్చింది, నడుముకు బలాన్ని ఇచ్చిందెవరు? - అధర్వణవేదం 10-2-1 అంటూ ఈ మంత్రం భగవంతుని వైభవాన్ని ఒక వైపు కీర్తిస్తున్నా, మరొక వైపు దేహనిర్మాణం గురించి ప్రాధమిక అవగాహన కల్పిస్తోంది.

9 ద్వారములతో (9 రంధ్రాలు - 2 ముక్కు రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము), దేవతలు నివసించు 8 వృత్తములతో (5 జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం; మనసు, బుద్ధి, అహంకారము), బంగారు కాంతితో వెలిగిపోతున్న దివ్యతత్త్వముతో (ఆత్మతో), దాన్ని ఆవరించి ఉన్న దివతేజస్సుతో (భగవంతుని యొక్క కాంతి) అబేధ్యమైన నగరం వలే ఈ శరీరం నిర్మించబడింది - అధర్వణవేదం 10-2-31. ఇందులో కేవలం శరీరం నిర్మాణం గురించే కాక, ఆధ్యాత్మిక తత్వం గురించి కూడా వివరించబడింది. (స్వేచ్చానువాదం చేశాను కనుక తప్పులు దొర్లి ఉంటే క్షమించగలరు).

రోగకారక క్రిములు గురించి ప్రస్తావన

అధర్వణవేదం 4-37, 19-36-6 లో అప్సరసలు, గంధర్వులు అనే పదాలు కనిపిస్తాయి. అక్కడ వాటి అర్దం వ్యాధికారక క్రిములని, అవి త్వరగా చాలా దూరం వ్యాపించే శక్తి కలవనీ చెప్పబడింది. వాటి ఆకారాలు, రూపాలు, వాటి సంవృద్ధికారక విషయాలు, వాటిని నిరోధించుటకు, వాటి వ్యాప్తిని కట్టడి చేయుటకు తీసుకోవలసిన ఆయుర్వేద నివారాణోపాయల గురించి విపులంగా ఉంది. ఇది సూక్ష్మజీవశాస్త్రానికి బీజం వేసింది.

ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీగారు వైదిక సంస్కృతికి చేసిన సేవ ఎనలేనిది. వారు వేదాలకు రాసిన అర్ధాలు అత్యధ్బుతం, సశాస్త్రీయం. దయానంద సరస్వతికి మించిన హేతువాది నాస్తికులలో కూడా ఉండరు. ఇప్పటి ఆధునిక పరిశోధనలు కనుగొంటున్న అనేక విషయాలను వారు ఆకాలంలోనే ప్రస్తావించారు. గత 2000 ఏళ్ళలో వేదాలకు అటువంటు అర్ధాలు వెలువడలేదంటే అతిశయోక్తి కాదు. వారి వేదభాష్యం సనతానధర్మానికి కొత్త ఊపిరిలూదింది. ఇప్పటికీ అనేకమంది వాటిలో తప్పులు వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, విఫలం అవుతూనే ఉన్నారు. వారు వేదాల్లో వైమానికి, నౌకా నిర్మాణ శాస్త్రాలున్నాయని మంత్రసహితంగా 1876 లో తమ వేదభాష్య పరిచయంలో వివరించారు.  వాటిని ఐఐఎస్సి వారు పరిశీలించి, దయానందులు విమాన నిర్మాణం గురించి, దాని పనితీరు గురించి చెప్పినవన్నీ ఆచరణయోగ్యాలనీ, సాధ్యమని వెళ్ళడించారు. నిజానికి వారు విమానాల గురించి ప్రస్తావించే సమయానికి ఆధునిక కాలంలో ఇంకా విమానలు కనుగొనలేదు. దయానందుని మరణం తర్వాత 20 ఏళ్ళు గడిచాకా గానీ మానవ సహిత విమానం ఎగరలేదు. వారు విమానాల పనితీరుని గురించి ఈ మంత్రాలకు అర్ధాల్లో వివరించారు. ఋగ్వేదం 1.116.3, 1.116.4, 10.62.1, 1.116.5, 1.116.6, 1.34.2, 1.34.7, 1.48.8 మొదలైనవి.

అట్లాగే దురవాణి (రేడియో) గురించి తమ ఋగ్వేదభాష్య భూమికలో వివరించారు దయానంద సరస్వతీగారు. నిజానికి అప్పటికి ఇంకా రేడియో అనే పరికరం ఒకటి ఉందని కానీ, చాలా దూరం వరకు మనిషి మాటలను ఆకాశమాధ్యమం ద్వారా ప్రసారం చేయచ్చని కానీ పాశ్చాత్య ప్రపంచానికి తెలియదు. అప్పటికింకా రేడియో కనుగొనబడలేదు. వేదాల్లో అన్ని ఉన్నాయిష అని వ్యంగ్యంగా మాట్లాడేవారు, వేదాల్లో ఒట్టి మూఢనమ్మకాలని కొట్టిపారేసేవారికి ఈ విషయాలు చెప్పినా అర్దం కావడంలేదు. వారి లక్ష్యం విజ్ఞానాన్ని మెచ్చుకోవడం కాదు, వేదాన్ని ద్వేషించడం. అంతకుమించి ఏమీ లేదు. అసలు నిజానికి రేడియో కనుగొన్నది జగదీష్ చంద్రబోస్ గారే కానీ మార్కోని కాదు. కానీ కొన్ని కుటిల కారణల చేత మార్కోనికి పేరు వచ్చింది.

To be continued .....................

ఈ రచనకు సహాయపడినవి : http://agniveer.blogspot.in/2010/01/science-in-vedas.html
పూజ్యశ్రీ దయానంద సరస్వతీ (ఆర్యసమాజం) వారి వేద భాష్యం

1 comment:

  1. ఋగ్వేద 11.19.10 ఒరిజినల్ శ్లోక మేమిటో కోట్ చేయ గలరా ?

    జిలేబి
    (మా వేదం లో అన్నీ ఉన్నాయష !)

    ReplyDelete