Thursday 11 May 2017

వైశాఖ కృష్ణ పాడ్యమి- నారద జయంతి



వైశాఖ కృష్ణ పాడ్యమిని నారదజయంతిగా జరుపుతారు.

నారదుడి గురించి తెలియని హిందువు ఉండడు. నారదుడు దేవముని, బ్రహ్మదేవుని పుత్రుడు, శ్రీ మన్నారాయాణునికి అమిత భక్తుడు.

నారం దదాతి ఇతి నారదః అని వ్యుత్పత్తి. నార అనగా జ్ఞానం, దా అంటే ఇచ్చువాడు. బ్రహ్మానందాన్ని ఇచ్చే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చువాడు కనుక నారదుడని పేరు పొందాడు.

నారదుడు ఆత్మజ్ఞానం కోరుతూ సనత్కుమార మహర్షిని కలిస్నట్లు ఛాందగ్యోపనిషత్తులో కనిపిస్తుంది. అందులో నాకు బోధ చేయండి అని నారదుడు అడగ్గా, మీకేమి తెలుసో చెప్పండి అని సనత్కుమారుడు అడుగుతారు. అప్పుడు నారదుడు తనకు 4 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలు మొదలైనవన్నీ తెలుసనని చెప్తాడు. ఆ తర్వాత సనత్కుమార మహర్షి నుంచి ఆత్మజ్ఞానం పొందుతాడు. ఈ సంవాదంలో మనకు తేలుస్తున్నదేమిటంటే నారడునికి తెలియని విషయం లేదు. ఆయన అన్నీ లోకాల్లోనూ సంచరించగలడు.

కానీ సినిమాల పుణ్యమా అని నారద మహర్షిని కలహప్రియుడిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నారదునికి సర్వం తెలుసు. ఏమి చేస్తే లోకకళ్యాణ జరుగుతుందో తెలుసు, ఆయన చర్యలన్ని దైవకార్యం నెరవేర్చటానికే. అటువంటి నారదమహర్షిని వ్యంగ్యంగా చూపడం, అది చూసి నవ్వడం మహాదోషం, పాపం కూడా.

శ్రీ రామాయాణం వాల్మీకి రాయడానికి ఒక కారణం నారదుడు. ఈ లోకంలో 16 గుణాలతో విరాజిల్లుతున్న ధర్మమూర్తి ఎవరని నారదుడి వచ్చి వాల్మీకి మహర్షిని అడగడంతోనే శ్రీ రామాయణం మొదలవుతుంది.

మహాభారతంలో మనం నారదుని రాజనీతి తెలిసినవాడిగా చూస్తాము. ఆయన ఇంద్రప్రస్థానికి వచ్చి యుధిష్టరునికి రాజనీతి, ధర్మం మీద ఉపదేశం ఇస్తారు.

నారద భక్తి సూత్రాల పేరుతో నారదుడు చెప్పిన భక్తి సూత్రాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే నారదునికి సంబంధించి నారదపాంచరాత్రము, నారదస్మృఇతి, నారదపరివ్రాజోకప్నిషత్తు మొదలైన గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి.

ధృవుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, శ్రీ మహావిష్ణు దర్శనం పొందేలా చేసిన గురుస్వరూపుడు నారదుడు. అలాగే ప్రహ్లాదుడు తన తల్లికడుపులో ఉండగా, ఆమె ద్వారా ప్రహ్లాదునికి భక్తిని, పరమాత్మ తత్త్వాన్ని బోధించి, భక్తులలో అగ్రుడైన ప్రహ్లాదుని లోకానికి అందించినవాడు నారదుడు.

గురుస్వరూపుడు, త్రిలోకసంచారి, జ్ఞానమూర్తి అయిన నారదమునిని ఈనాడు స్మరించి, ధ్యానిద్దాం. 

No comments:

Post a Comment