Sunday 10 September 2017

హిందూ ధర్మం- 251 (14 లోకాలు- Scientific analysis)


మనుష్యలోకంలో ఉన్న మనం ఈ 3-D జగత్తుకు చెందినవారము. ఇతరలోక జీవులు ఇతర Dimensions కు చెందినవారు. ఒక Dimension లో ఉన్నవారు ఇతర Dimensions లోకి వెళ్ళే ప్రక్రియను శాస్త్రపరిభాషలో teleportation అంటారు. Quantum teleportation అనే ప్రక్రియ కూడా ఉంది. దీని ప్రకారం ఒక వస్తువు భౌతికంగా ప్రయాణించకుండా, ఒక చోటు నుంచి వెరొక చోటుకు వెళ్ళగలదు. చాలామంది శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం మానవులు వంటి స్థూల ప్రపంచానికి చెందిన వస్తువులను teleportation చేయడం సాధ్యం కాదు... కానీ సూక్ష్మ ప్రపంచంలో teleportation  ప్రక్రియ ఉంది. క్వాంటం మెకానిక్స్, క్వాంటం ఎలక్ట్రోడైనమిక్స్‌లలో మూడు రకాల teleportations గురించి చెప్తారు. క్వాంటం సిద్ధాంతంలో వీటి గురించి చాలా పెద్ద వివరణ ఉంటుంది. చైనా ఈ teleportation  అనే ప్రక్రియను ఉపయోగించేందుకు ఒక టెలిస్కోప్‌ను తయారు చేసి, దాని మీద పరిశోధనలు చేస్తోందని, అది విజయవంతమైతే యుద్ధంలో కూడా ఈ teleportation ని ఉపయోగించి, ప్రపంచ దేశాలను మట్టి కరిపిస్తుందని  జనవరి 2017 భారతీయ సైన్స్ కాంగ్రెస్ సభలలో ప్రస్తావన వచ్చింది.


క్వాంటం సిద్ధాంతాన్ని అనుసరించి, ఒక రెండు వస్తువుల మధ్య సమాచార మార్పిడికి, వాటి మధ్య ఒక్కసారి క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ జరిగితే, ఇక ఆ తర్వాత ఏ ఇతర మాధ్యమం అక్కర్లేదు. కాంతి కంటే వేగంగా 'క్వాంటం సమాచారం' వాటి మధ్య మార్పిడి జరుగుతూ ఉంటుంది. అవి ఒక్కసారి అనుసంధానమైతే చాలు, ఇక ఆ తర్వాత అవి ఎంత దూరంలో ఉన్నాయనేది పట్టించుకోవలసిన పనిలేదు. అయితే ఇలా మనుష్యులు కూడా teleportation అవ్వాలంటే, వారి భౌతిక శరీరాన్ని కోల్పోవాలి. ఒక్కసారి అలా కోల్పోతే, మళ్ళీ వారికి యథారూపం ఇచ్చే Technology ప్రస్తుతానికి మానవుల దగ్గరలేదు. మన సనాతనధర్మానికి చెందిన అనేక వ్యవస్థల్లో, ఆచారాల్లో ఈ quantum entanglement ప్రక్రియనే ఉపయోగిస్తారు. విగ్రహారాధన, ఆశీర్వచనం, యజ్ఞం, వేదపఠనం, మంత్రజపం మొదలైనవి కొన్ని ఉదాహరణలు. కాకపోతే, మనకు ఆ విషయం తెలియదు, దాన్ని పసిగట్టే conscious state లో మనంలేము.

శాస్త్రవేత్తలు teleportation అని చెప్పినట్లుగానే మన సనాతన ధర్మంలో ఇలాంటి ప్రక్రియలకు 'సిద్ధి' అనే పదాన్ని వాడతాము. సిద్ధులు కలిగినవారు ఒక లోకం నుంచి వేరొకలోకానికి ప్రయాణం చేయగలరు. ఈ సిద్ధులు సిద్ధించటానికి సాధనలు చేస్తారు. అయితే సిద్ధులు పొందడం గొప్ప అని ధర్మం చెప్పలేదు. సిద్ధులన్నీ మనసుకు సంబంధించినవని, మనసును దాటితేనే మోక్షమని ఋషుల వచనం. అయినప్పటికీ లోకకల్యాణం కోసం కొందరు జీవన్ముక్తులు సిద్ధులను ఉపయోగిస్తున్నారు......నారదుడు మొదలైన దేవర్షులు, మానవలోకంలో పుట్టి ఉన్నతస్థాయికి ఎదిగిన ఇంకా అనేకమంది మహర్షులకు ఈ సిద్ధులు ఉన్నాయి. నారదుడు సమస్త లోకాలకు సంచరించగలడు. ఆయన అంత శక్తిమంతుడు.....వాల్మీకి రామాయణంలో త్రిశంఖువు సశరీరంతో స్వర్గానికి వెళతాను అన్నప్పుడు, అది ధర్మవిరుద్ధమని, అలా వెళ్ళడం కుదరదని వశిష్టుడు హితోపదేశం చేస్తారు. దీన్ని ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చేసుకున్నప్పుడు కూడా ఇదే స్పష్టమవుతుంది. భౌతికజగత్తులో ఉన్న వ్యక్తి, శరీరంతో ఇతర Dimensions లోకి వెళ్ళడం అసాధ్యం..... కానీ మళ్ళీ మన ధర్మమే దీనికి మార్గం చూపింది. అదే సాధన, తపస్సు.... మనస్సును పరిశుభ్రంగా పెట్టుకోవడం. మనసును శుద్ధంగా ఉంచుకుంటే అది సూక్ష్మవిషయాలను గ్రహించే స్థాయికి చేరుతుంది. అప్పుడు క్రమక్రమంగా అది ఊర్ధ్వలోకాలను చూసే స్థాయిని పొందుతుంది. అయినప్పటికి స్వార్ధలక్ష్యంతో సిద్ధుల కోసం ప్రయత్నించేవారిని ప్రక్కదారి పట్టించడానికి, అణిచివేయడానికి ఆయా భూమికల్లో అనేమంది అధిదేవతలు సిద్ధంగా ఉంటారు. 

ఇప్పుడు మనమంతా గ్రహాంతర ప్రయాణం గురించే మాట్లాడుతున్నాము, కానీ ధర్మంలో లోకాంతర ప్రయాణం చెప్పబడింది. వేదవ్యాస మహర్షి శ్రీ మద్భాగవతం 9 స్కంధం, 3వ అధ్యాయం, 27-36 శ్లోకాల వరకు లోకాంతర ప్రయాణం చేసిన రేవతి, కకుడ్మి (రైవతుడు అని కూడా పిలుస్తారు) మహారాజుల గురించి చెప్పారు. వివాహ వయసుకు వచ్చిన తన కుమార్తెకు ఎంత వెతికినా సరైన వరుడు దొరకకపోవడంతో, ఆయన తన కుమార్తెను తీసుకుని బ్రహ్మలోకానికి వెళతారు. ఆయన వెళ్ళేసరికి బ్రహ్మదేవుడు గంధర్వ గానం వింటూ ఉండటంతో వారు కాసేపు వేచి ఉంటారు. ఆ తర్వాత ఆయన తన కూతురికి మంచి వరుడిని చూపమని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వి "బ్రహ్మలోకంలో మీరున్న సమయంలో భూలోకంలో 27 చతుర్-యుగాలు గడిచిపోయాయి, నీ మనస్సులో ఉన్న రాకుమారులు, రాజవంశాలు, రాజ్యాలు.... మొదలైనవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మీరు వారి పేర్లను కూడా వినలేరు" అని సమాధానం ఇస్తాడు. ఒక చతుర్-యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 27 గడిచిపోయినాయట. ఆ తర్వాత ఆ రేవతి దేవియే ఆదిశేషుని అంశ, శ్రీ కృష్ణునికి అన్నగారైన బలరాముడిని వివాహం చేసుకుంది. నిజానికి కకుడ్మి బ్రహ్మలోకంలో ఉన్నది దరిదాపుగా 3,456 సెకన్లు.

దీన్నే ఆధునిక సైన్స్ time dilation అంటుంది. అంటే ఒక వ్యక్తి విశ్వాంతరాళంలో కాంతి వేగంతో ప్రయాణిస్తే, అతడితో కలిసి జన్మించిన అతని కవల సోదరుడు భూమి మీద ఉంటే, ఇద్దరి వయసు ఒకేలా ఉండదు. మెల్లిగా తిరుగుతున్న భూమి మీద కాలం కంటే వేగంగా వెళుతున్న రాకెట్ లో కాలం నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాతంలో వివరించారు.

మనకు ఎన్నో సందేహాలు వస్తాయి.... అసలు పాలసముద్రం వుందా? మంథర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు కలిసి ఎక్కడ చిలికారు? అసలు అలా చిలకడం సాధ్యమేనా? యమలోకం గరుడపురాణంలో చెప్పినట్లుగా అంత భయంకరంగా ఉండటం సాధ్యమేనా?... ఇలా ఎన్నో..... ఇవన్నీ ఈ 3-D ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇతర పరిమాణాల (Dimensions ) కు చేరినప్పుడు బోధపడుతుంది. అలానే త్రిపురాసురునితో శివుని యుద్ధం మొదలుకుని దేవదానవ యుద్ధాలు అనేకం ఇలాంటి ఇతర Dimensions లోనే జరిగి ఉండవచ్చు.

To be continued ..........

No comments:

Post a Comment