Sunday 3 May 2020

ఆయుర్వేదం - ఆహారం స్వీకరించే పద్ధతి



మన సంస్కృతియే మనకు శ్రీ రామ రక్ష (12) 

ఆయుర్వేదం  - ఆహారం స్వీకరించే పద్ధతి 

మన ఆచారవ్యవహారాలను తులనాడటం చాలా సులభం. నోటికి ఏది వస్తే అది అది అనచ్చు. కానీ వాటి వెనుకనున్న శాస్త్రీయతను అర్ధం చేసుకుంటే వాటిని నెత్తిన పెట్టుకుంటాము. అవి ఆచరణలోకి రావడానికి ఎంత సమయం పట్టి ఉంటుందో, కాలక్రమంలో వాటి మీద ఎంత పరిశోధన జరిగి ఉంటుందో ఆలోచిస్తే మతిపోతుంది.

ముందు మజ్జిగన్నం లేదా పెరుగున్నం తిని, ఆ తర్వాత సాంబారు, చివరలో కూర, పచ్చడి కలుపుకుని తినకూడదా? ఈ సందేహం మీకు ఎప్పుడూ రాలేదా? ఏ ఆహారం ఎలా, ఎప్పుడు స్వీకరించాలి అనేది ఆయుర్వేదం చెబుతుంది. ఆకలి కలిగినప్పుడు కడుపులో ఉదజహరికామ్లము (హైడ్రోక్లోరిక్‌ యాసిడ్) ఉత్పన్నమై, ఆహారన్ని పచనం చేయడానికి సిద్ధమవుతుంది. ముందుగా గట్టిగా ఉన్న పదార్ధాలను కలుపుకోవాలి, అంటే కూర, పొడి వంటివి. ఎందుకంటే ఈ ఉదజహరికామ్లము మనం తినే ఆహారాన్ని పచనం (అరిగిస్తూ) పలుచన (dilute) అవుతుంది. కనుక మొదట కూరను కలుపుకుంటాము, పొడి ఎండు పదార్ధము కనుక దానిలో తేమశాతం తక్కువ గనక మొదటి ప్రాధాన్యం దానికి ఇచ్చారు. ఆ తర్వాత కూర, పప్పు. కూర కంటే పప్పు కొంచం పలుచగా ఉంటుంది (ఇక్కడ గోదావరి జిల్లాల వారైతే ముందు పప్పు, ఆ తర్వాత కూరా కలుపుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ముందు కూర, ఆ తర్వాత పప్పు కలుపుకుంటారు. ఈ నాలుగుజిల్లాల వంట పద్ధతిలో స్వల్ప తేడాలు కూడా ఉంటాయి).  వీటి తర్వాత వచ్చేది సాంబారు లేదా పప్పుచారు. ఆ తర్వాత రసము, పాయసము, చివరలో మజ్జిగ. మజ్జిగ అనేది చాలా పలుచని పదార్ధము. అంటే నీ ఉదరంలో జీర్ణం చేసే ఆమ్లాలు పలుచున అవుతున్న కొద్దీ, నువ్వు స్వీకరించే ఆహారం పలుచున అవుతూ వస్తుంది.

దీని గురించి కంచి పరమాచార్య స్వామి వారు ఇలా అన్నారు - "విదేశాల్లో ఆహారం అనేది చివరలో ఫలాహారముతో ముగుస్తుంది, దాన్ని వాళ్ళు డెజెర్ట్స్ (desserts) అంటారు. దక్షిణభారత దేశంలోని ఆహారపద్ధతిలో, రసం కలుపుకుని తిన్న తర్వాత మొదటలో విస్తరిలో వడ్డించిన తీపి పదార్ధాలు తింటారు. ఆ తర్వాత చివరగా మజ్జిగను కలుపుకుంటారు. తీపి పదార్ధాలు మన పళ్ళకు (దంతములకు) హాని కలిగిస్తాయి. మజ్జిగ యొక్క రుచి పులుపు. చివరలో పులుపు మరియు ఉప్పు కలిగిన మజ్జిగను స్వీకరించడంవలన దంతాలకు బలం చేకూరుతుంది. ఈ పద్ధతిని అమెరికెన్ ఆహార శాస్త్రజ్ఞుడు సైతం కొనియాడారు. పంటినొప్పి వచ్చినప్పుడు వేడినీటితో పుక్కిలిస్తాము. విదేశీయులకు చిన్న వయస్సులోనే పంటి సమస్యలురాగా, మనకు మాత్రం జీవితాంతం వరకు బలమైన దంతాలు ఉండటంలో రహస్యం ఇదే."

అదేగాక ఆయుర్వేదంలో మజ్జిగ గుణాలను బాగా కొనియాడారు. మజ్జిగ అనేది ఆయుర్వేదంలో విషహారిణి. మనం తిన్న అన్నంలో ఏదైనా విషాలు కలిస్తే, వాటిని మజ్జిగ హరిస్తుంది. పైగా జీర్ణశక్తిని పెంచుతుంది. కొవ్వును తగ్గిస్తుంది. అందుకే మనము మజ్జిగతో ఆహారం ముగిస్తాము.

కేవలం ఒకే రకమైన ఆహారం - ఉదాహరణకు కేవలం పచ్చడి అన్న, కూర అన్నం, మజ్జిగ అన్నం - స్వీకరించమని ఆయుర్వేదం చెప్పదు గతి లేకపోతే తప్పించి. ఆహారంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఆయుర్వేదం చెబుతుంది. కనుక ఎప్పుడైనా పిల్లలు అడిగితే, వారికి మన పూర్వీకులు అందించిన ఈ పద్ధతిని వివరించి, దాని వెనుకనున్న శాస్త్రీయతను చెప్పండి.

1 comment:

  1. // “ .... గోదావరి జిల్లాల వారైతే ముందు పప్పు, ఆ తర్వాత కూరా కలుపుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారు ముందు కూర, ఆ తర్వాత పప్పు కలుపుకుంటారు.” //

    కృష్ణా జిల్లా వారు కూడా ముందు పప్పు, ఆ తరువాతే కూర కలుపుకుంటారండి (నేను కృష్ణా జిల్లా వాడినే).

    ReplyDelete