Wednesday 28 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (05)



ఆంజనేయుణ్ణి చివర స్మరిస్తారు కదా! కాని ఆయన విగ్రహం, శంకరుల విగ్రహం ముందు ప్రవేశంలోనే ఉందేమిటి? ఎట్లా సబబు?


ఈ ఆంజనేయస్వామి, ఏనాడో తనంతట తాను వచ్చాడు. అతని విగ్రహం క్రొత్తగా ప్రతిష్ఠింపబడలేదు. స్వామి, తరువాతనే శంకరులు అడుగుపెట్టారు.


రుద్రనమక మంత్రాన్ని ఘనలో వల్లిస్తున్నపుడు అందులో ఉన్న శంకర పదం 13 సార్లు వస్తుంది. సాధారణంగా ఈ 13 అంకెలు శ్రేష్ఠం కాదంటారు. అందరికీ సుఖాన్ని కల్గిస్తుందని అర్థం ఇచ్చే శంకర పదం 13 సార్లు వస్తుంది.


ఆంజనేయుడు రుద్రాంశతో పుట్టినవాడు. అతడెప్పుడూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని కీర్తిస్తూ ఉంటాడు. ఈ మంత్రంలోనూ 13 అక్షరాలున్నాయి. 13 అంకెను ఉత్తర ప్రాంతంలో ప్రత్యేకంగా భావించి "తేరాక్షర్" అంటారు. ఆ హనుమ, సమర్థ రామదాస స్వామిగా అవతరించినపుడు ఈ త్రయోదశాక్షరీ మంత్రాన్నే జపిస్తూ ఉండేవాడు. ఆ మంత్రబలం వల్లనే శివాజీకి మార్గదర్శకుడయ్యాడు. హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించగలిగాడు.


ఘనలో శంకరపదం 13 సార్లు వస్తుందని చెప్పాను. శంకరుల విగ్రహం ముందున్న అంజనేయస్వామి 13 అక్షరాల మంత్రాన్నే జపిస్తాడు. సబబుగా లేదా?


అట్టి ఆంజనేయప్రతిమ వెనుక ఉండకూడదు. కనుక ముందే ఉంటుంది.


ఎట్లా కనిపిస్తున్నాడు? ఒక చేతిని పైకెత్తి చేయి చాచి యుంటుంది. అది అభయహస్తం. భయపడకండని సూచిస్తుంది. అంతేకాదు. ఆగండని మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటుంది కూడా. ఒక పెద్ద సముద్రం ముందుంది కదా! రామేశ్వరంలో సముద్రం పెద్ద అలలు లేకుండా ఉంటుంది. ఆగు, ముందుకు రాకు అని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు హనుమ. వేల సంవత్సరాల నుండి అతని ఆజ్ఞను సముద్రం పాటిస్తూనే ఉంది.


కనుక అతడు సముద్రానికి అభిముఖంగా ఉంటాడు. అతనికి, సముద్రానికి మధ్యలో ఏ విగ్రహమూ ఉండదు. శంకరుల కంటే ముందు వచ్చిన వానికి అట్టి గౌరవ స్థానం ఉండడం సబబే కదా!


No comments:

Post a Comment