Thursday 22 April 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (240)



ఇష్టదేవత


ప్రజలు భిన్నభిన్న మనః ప్రవృత్తులు కలిగియుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత, ఇష్టంగా ఉంటుంది. అందరిలోను భక్తిని, చిత్తశుద్ధిని కల్గించడం కోసం, ఏకాగ్రతను సిద్ధింపచేయడం కోసం, పరమాత్మయే భిన్న దేవతా మూర్తులను ధరించి అవతరించాడు.


ఈ హిందువులకు కోట్ల మంది దేవతలున్నారేమిటని పాశ్చాత్యులు వేళాకోళం చేస్తారు. కాని ఉన్నది ఒక్క స్వామియే అని సగటు హిందువు భావిస్తాడు. పెక్కు మంది దేవతలున్నారని భావించడు. ఉన్నది ఒక్క దేవతయే యని వైదిక మతం చెప్పడమే కాదు, జీవుడే పరమాత్మయని చెబుతుంది. ఇట్టి సిద్ధాంతాన్ని ఇతర మతాలు చెప్పవు. ఒక స్వామి, సర్వ నియామకుడని భావించని హిందువంటూ లేదు. ఆ ఒక్కడే అనేక రూపాలను ధరిస్తాడని, అతడు దయామూర్తియేయని భావిస్తాడు.


ఆ స్వామియే ఈ భరత భూమిలో భిన్న ఆకారాలలో మహాత్ములకు కన్పిస్తాడు. వారే మంత్రాలనందించారు. ప్రతి దేవతామూర్తికి ప్రత్యేక పూజా విధానాన్ని అందించారు. వారు నిర్దేశించిన మార్గంలో పయనిస్తే తమ ఇష్టదేవత యొక్క కృపకు భక్తులు నోచుకుంటారు. ఏ దేవత, ఏ ఆకారంలో ఉన్నా అంతిమ లక్ష్యం పరమాత్మను చేరుకోవడమే. అందువల్ల సందేహం లేకుండా భక్తిని అంకిత భావంతో అభ్యసిస్తూ ఉంటాం. అతడే సంసారవిముక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతాం. బంధవిముక్తికి అర్హత సంపాదించేటంత వరకు మన కోరికలను స్వామి తీరుస్తాడు.


No comments:

Post a Comment