Showing posts with label ఆర్యసమాజం. Show all posts
Showing posts with label ఆర్యసమాజం. Show all posts

Sunday, 8 May 2016

హిందూ ధర్మం - 208 (యజ్ఞంలో బలి ఖండన - 2)

వక్రీకరణ - నరమేధంలో మనిషిని బలి ఇస్తారు.
వాస్తవం - మానవదేహానికి వేదం చెప్పిన విధంగా అంత్యేష్టి సంస్కారం (దహనసంస్కారం మొదలైనవి) చేయడమే నరమేధం - సత్యార్ధప్రకాశంలో స్వామి దయానంద సరస్వతీ.

వివరణ - భారతీయ సమాజం ఆటవికమని, తమ మతమే శ్రేష్టమని నిరూపించడానికి ఏ విధంగా అవకాశాం లేదని గ్రహించిన వక్రీకరణకారులు, యజ్ఞయాగాది క్రతువుల్లో మనుష్యులను బలిస్తారని వక్రీకరించారు. అదేకాక సంస్కృతిని నాశనం చేయడంలో పత్రికలు ముందుంటాయి. ఎవరైనా జనాలను మోసం చేస్తే, అవినీతి అధికారి జనాలకు శఠగోపం పెట్టాడని ప్రచురిస్తారు. భాషను తామేదో కాపాడుతున్నామని చెప్పుకునే ఈ పత్రికల వాళ్ళకు భాషలో పదాల అర్దం కూడా కనీసం తెలియదు. శఠగోపం మీద స్వామి పాదాలుంటాయి. ఆలయంలో శఠగోపం పెట్టించుకోవడం స్వామి పాదాలను నెత్తిన పెట్టించుకుని, ఆశీర్వాదం పొందడం. స్వామి పాదాలు పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడే కానీ నశించడు. మరి ఈ పద ప్రయోగాన్ని పత్రికలు నీచంగా ఎందుకు చేస్తాయో వారికే తెలియాలి. ఇలాంటిదే నరమేధం కూడా. ఎక్కడైన ఉగ్రవాద దాడి జరిగి, అనేకులు మరణిస్తే, భారి నరమేధం అంటూ ఆ పదానికి లేని అర్ధాన్ని ఆపాదించి, సమాజాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు.

శతపధబ్రాహ్మణం 13 వ అధ్యాయంలో నరమేధం గురించి చెప్పబడింది. 7 1/2 అడుగుల పొడవు, 5 1/2 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగుల లోతుతో గొయ్యి త్రవ్వాలి. పైన ఉన్న వెడల్పులో సగం మాత్రమే క్రింద ఉండాలి. అందులో కనీసం 49 పౌండ్ల గంధపుచెక్క, పలాశ (మోదుగ) చెట్టు చెక్క వేయాలి. శవానికి సమాన బరువుతో ఆవునెయ్యి తీసుకుని, కస్తూరి కలిపి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కర్పూరం మొదలైనవి వేయాలి. దాని మీద శవాన్ని ఉంచాలి. శవం మొత్తం ఆవునెయ్యిని చల్లి, నిప్పు అంటించాలి. ఈ విధంగా చేయడం వలన శవం కాల్చిన వాసన రాదు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దహన సంస్కారానికి యాగానికి సమానమైన స్థానం కల్పించారు. అసలు శవ దహనం అనకుండా దహన సంస్కారమని, అంత్యేష్టి అని అనడంలోనే ఎంతో అర్దం దాగుంది. సంస్కారం అనగా సంస్కరించునది. దేహన్ని, సూక్ష్మ శరీరాన్ని సంస్కరించి, ఆత్మ ఉద్ధతికి సహాయపడే కర్మలకు సంస్కారం అని పేరు. దానికి మరే ఇతర భాషలోను సమానమైన అర్దంలేదు. తాను దేహం కాదు, ఆత్మ అని స్థిరమైన భావన ఉన్నవారు, దేనీ మీద వ్యామోహం లేనివారికి మినహాయించి మరణం సంభవించగానే అందరి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. అది అక్కడే, ఆ దేహం మీద మమకారంతో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన ఎవరికి (సామాన్య మనవులకు) కనపడదు, వినపడదు. జీవుల కర్మ తీరడానికి కొత్త దేహం ధరించాలి. కానీ దేహమే తానన్న మమకారం వలన అది కొత్త ప్రదేశానికి దేహాన్ని విడిచి వెళ్ళెందుకు ఇష్టపడదు. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, అది కుళ్ళిపోతుంది. తన దేహం కుళ్ళిపోవడం దీనికి ఇంకా బాధను కలిగిస్తుంది. అలా కాక ఆత్మను ఉద్ధరించడం కోసం వచ్చిందే ఈ దహన సంస్కారం. అప్పుడు చదివే మంత్రాలు, ఆత్మకు ఈ దేహం తనది కాదని, ఇక తాను అక్కడి నుంచి విడిచి వెళ్ళాలని, తనకంటూ వేరే దేహం, జన్మ నిర్దేశించబడ్డాయని తెలియజేస్తాయి. శరీరాన్ని పూడ్చిపెట్టక, దాన్ని కాల్చివేయడం, మిగిలిన అస్థికలు, ఎముకలను నదిలో కలపడం వలన దేహం పూర్తిగా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక అక్కడ ఆత్మ తనది అంటూ కూర్చుని ఏడ్వడానికి ఏమీ మిగలదు. అలా జీవులను శవ దహనం ద్వారా ఉద్ధరించి, వెరొక జన్మకు పంపుతుంది కనుక దీనికి దహన సంస్కారం అని పేరు వచ్చింది. ఇందులో దహనం చేసేవారికి స్వార్ధం ఉండదు. వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం తప్పించి, ఏమీ ఆశించటం కూడా ఉందదు.

అంతేగాక, ఒక శరీరాన్ని అలాగే వదిలేస్తే అది కుళ్ళి రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని భయంకరమైన రోగాలు, అంటువ్యాధులతో మరణించినవారిని పూడ్చిపెట్టడం కంటే కాల్చివేయడం మంచిదని కూడా ఇప్పుడు ఋజువు అవుతోంది. ధర్మం కూడా అదే చెప్పింది. అనాధ శవాలను కూడా ఎవరూ లేరని వదిలేయక, ఆ జీవుడిని ఉద్ధరించడం కోసం వాటికి కూడా కర్మకాండ నిర్వహించమంటోంది. అది చేసింనందుకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా ఈశ్వరుడు నిర్దేశించాడు. ఈ చర్య నిస్వార్ధతతో కూడినదై, రోగాలు వ్యాపించకుండా ఇటు సమాజాన్ని, జీవుడి ప్రయాణాన్ని సులభతరం చేసి ఆత్మను ఉద్ధరిస్తున్న కారణాన దీన్ని యాగం అన్నారు. అంతేకాని నరమేధం అంటే వ్యక్తిని చంపి యాగంలో వేయడం కాదు.

To be continued ................

Sunday, 1 May 2016

హిందూ ధర్మం - 207 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 3)

ఇంతకముందు చెప్పుకున్నట్టుగానే అశ్వమేధాన్ని కూడా అగ్ని లేకుండా జ్ఞానకాండలో భాగంగా నిర్వహించవచ్చు. దీన్ని నిర్వహించడానికి వర్ణాశ్రమ బేధం ఉండదు. దేశరక్షణ, సంగ్రత, సమైఖ్యత కొరకు చేసే కర్మలన్నీ అశ్వమేధానికి సమానమైన ఫలితానిస్తాయి. దేశంలో విఛ్ఛినకరశక్తులు, దేశద్రోహులు తమ విషపడగలను విప్పి, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తరుణంలో, దేశప్రజలలో బుద్దిపరమైన జాగృతిని కలిగించి, ప్రజలను ఆలోచింపజేసి, వారిని సంఘటితం చేయడం, దేశద్రోహుల మనసులు మార్చే ప్రయత్నం చేయడం, అది కుదరని పక్షంలో వారిని దేశం నుంచి తరిమికొట్టడం అశ్వమేధం. ఒక దేశానికి రెండు రకాల శతృవులుంటారు. ఒకరు అంతర్గత శతృవులు, రెండవవారు శతృదేశాల వారు. శతృదేశాలవారి ఎత్తులను చిత్తు చేయడం, యుద్ధం చేయడం అంత కఠినం కాకపోవచ్చు కానీ, అంతర్గత శతృవులను పట్టుకుని, వారిని మట్టుబెట్టడం చాలా కష్టం. వీళ్ళు ఇంటిదొంగలు. ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ మాతృభూమినే ముక్కలు చేయాలని చూసే పరమకౄరులు. వీరు చేసే అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. అట్లాగే దేశప్రజలలో శక్తి క్షీణించి, దేశం పతనం దిశగా వెళుతున్న క్రమంలో, వారిలో పునరుజ్జీవాన్ని నింపి, నూతున శక్తులను సృష్టించి, దేశపతనాన్ని ఆపటం అశ్వమేధం. ఇవి అగ్ని లేకుండా చేసే అశ్వమేధ యాగాలు. నిరంతరం ఇవి జరుగుతూనే ఉండాలి.

అశ్వం అంటే విశ్వాత్మ అయిన సూర్యుడని, సర్వజీవుల యందు అంతర్గతమైన ఆత్మ అని, ప్రాణశక్తులు ఆత్మతో సంయోగం చెందేలా జీవించడమే అశ్వమేధమని దయానంద సరస్వతీ వివరించారు.  ప్రాణం ఇక్కడ దేహంలోని ప్రాణశక్తులను సూచిస్తోంది, ఆత్మను కాదు. భోజనం చేయనప్పుడు నీరసంగా అనిపిస్తుంది, ఆ నీరసానికి కారణం ప్రాణం. నచ్చిన, ఆసక్తికరమైన విషయం విన్నప్పుడు తెలియని ఉత్తేజం కలుగుతుంది, అది ఉత్తేజితమైన ప్రాణం యొక్క బహిర్ రూపం. అలా దేహంలో నిత్యం ప్రాణశక్తి సంచారం చేస్తూ ఉంటుంది. జీవి యొక్క ప్రతి కదలిక వలన అది దేహం నుంచి బయటకు వెళుతూ ఉంటుంది. ఉద్రేకాలు, అధికమైన ఆలోచనలు, భావాల మీద నియంత్రణ లేకపోవడం, మితిమీరిన శృంగారం, వీర్యనష్టం లాంటి వాటి వలన అది శరీరం నుంచి అధికంగా బయటకు వెళ్ళిపోతుంది. దాని వలన నాడీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోవడాన్ని యోగులు తమ సూక్ష్మ దృష్టితో దర్శించగలుగుతారు. అందుకే గురువులు ఉపదేశం చేస్తూ 'ఏ పనిని ఇష్టం లేకుండా చేయకండి. ఇష్టపడి పనిచేయండి. కష్టంగా భావించకండి' అంటారు. ఎందుకంటే భారమనుకుని చేసే కర్మ ప్రాణశక్తిని అధికంగా బయటకు లాగేస్తుంది. ఈ ప్రాణశక్తిని ప్రాణాయామం మొదలైన సాధనాలతో, ధ్యానంతో, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహాలతో, యోగంతో ఆత్మవైపు మళ్ళించడం అశ్వమేధం.

ఆ సందర్భంలో మేధం ఇక్కడ చక్కని బుద్ధిని తెలియజేస్తుంది. బుద్ధి ఎలా వికసిస్తుందంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా. మంచి ఆహారం, శుద్ధమైన, ఔషధ మొక్కల నుంచి వీచే గాలి, అన్నీ అవసరమే అయినా, బుద్ధి ధర్మ శాస్త్రాన్ని తెలుసుకోవడం వలననే వికసిస్తుంది. అట్లా బుద్ధిని, మేధస్సును వృద్ధి చేసుకుని, గురువు చెప్పిన విషయాన్ని మననం చేసుకుని, దానిపై ధ్యానించి, ప్రాణశక్తిని ఆత్మవైపు మళ్ళించటమే అశ్వమేధం.

కర్మసాక్షి సూర్యనారాయణ మూర్తి. ఆయనతో జీవనాన్ని ముడి వేసింది సనాతనధర్మ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదం. సూర్యోదయం నుంచి మరునాడు సూర్యోదయం వరకు ఒక రోజులో ఏ సమయంలో ఏది తినాలో, ఎప్పుడు ఏ పనికి అనుకూలంగా ఉంటుందో ఋషులు పరిశోధించి ఆయుర్వేద గ్రంధాల్లో నిక్షిప్తం చేశారు. ఆ సమయపట్టీని పాటించడం వలన వ్యక్తి ఆరోగ్యవంతుడై సూర్యునితో దృఢమైన సంబంధం ఏర్పరుచుకుంటాడు. అతడు చేసే జపధ్యానాదులు కొన్ని వేల జన్మల పరిణామ దశలను దాటిస్తాయి. అటువంటి జీవితాన్ని గడపడం అశ్వమేధం.

To be continued ...........

Saturday, 16 April 2016

హిందూ ధర్మం - 204 (యజ్ఞంలో బలి ఖండన - 1)

వక్రీకరణ - అశ్వమేధం, గోమేధం మొదలైన యజ్ఞాల్లో జంతుబలి ఉంటుంది. గోమేధంలో ఆవును బలి ఇస్తారు.
వాస్తవం - అశ్వమేధం, గోమేధం అన్న పేర్లలో పదాలకు మీకు తెలిసిన ఒకటి, రెండు అర్దాలను పట్టుకుని చేస్తున్నా నిరాధార ఆరోపణలివి. ముందు గోమేధం గురించి చూద్దాం. గోవును వధించి చేసే యజ్ఞం కనుక దానికి గోమేధమని పేరని కుహనా చరిత్రకారులు, కిటుల బుద్ధి కలిగిన అంగ్లేయులు, కమ్యూనిష్టులు అర్దం చెప్పారు.

శతపధ బ్రాహ్మణం 13.3.6.2 ప్రకారం మేధ అంటే ఆజ్యం (ఆవునెయ్యి). ఏ యజ్ఞంలోనైతే విశేషంగా ఆవునెయ్యిని వాడుతారో, అందులో మేధ అనే పదం చేర్చారు. పతంజలి మహర్షి గారి ఉనది కోశం 2-67 ప్రకారం గో అనే పదం ఇంద్రియాలను, వాతవరణాన్ని, కిరణాలను (సూర్యుడు, ఇత్యాదుల), భూమిని సూచిస్తుంది. అలాగే భూమిపై జరిగే క్రతువులను సూత్రప్రాయంగా స్వీకరిస్తుంది. పైన చెప్పుకున్న వాటిని కాలుష్య రహితంగా, పవిత్రంగా ఉంచడమే గోమేధ యజ్ఞం.

అదేకాక
అన్నం హి గావః
ఆజ్యం మేధః అని కూడా శతపధ బ్రాహ్మణం చెప్తున్నది.

సస్యవృద్ధి కొరకు చేసే యజ్ఞమే గోమేధమని అర్దం. చలికాలంలో అలుముకునే పొగమంచు కారణంగా భూమిపై సూర్యకిరణ ప్రభావం తగ్గుతుంది. దాంతో జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న జీవరాశికి పుష్టినివ్వడం కోసం గోమేధ యజ్ఞం చేస్తారు. ఇక్కడ గోవు అంటే భూమి, వాతావరణం. అలాగే సూర్యకిరణాలకు అడ్డుపడే పొగమంచును చేధించడం. అయితే వక్రీకరణ కారులు ఏం చేశారంటే గోమేధంలో పదం ఒకటి పట్టుకున్నారు. అలాగే చలికాలంలో సూర్యకిరణాల ప్రభావం తగ్గిపోతుందనే అర్దం వచ్చే మంత్రాలను యజ్ఞంలో గోవును బలిస్తారు అన్నట్టుగా వక్రీకరించారు. కానీ ఆ తర్వాత వచ్చే మంత్రంలో వసంత ఋతువులో గోవు (భూమి, సూర్యకిరణాలు) తిరిగి పుష్టి పొందుతుందని చెప్పబడింది. కానీ వీరు ఆ మంత్రాన్ని విస్మరించారు. ఒకవేళ అక్కడ చెప్పబడింది ఆవు అయితే బలివ్వబడిన ఆవు తిరిగి ఎలా పుష్టిపొందుతుంది? ఇది నికృష్ఠులైన వక్రీకరణకారులకు తట్టలేదు. అందుకే అలా గోమేధం అంటే గోవును బలిచ్చే యాగం అని వక్రీకరించి, ప్రచారం చేశారు. గోమేధం పాడిపంటల వృద్ధి కోసం, అడవులు, పచ్చదనం వృద్ధి కోసం, వాతావరణాన్ని కాలుష్యరహితం చేయడం కోసం చేస్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానందులు సత్యార్ధప్రకాశంలో వివరించారు.

యజ్ఞం కేవలం బాహ్యమే కాదు, ఆంతరంగికం కూడా. బయట చేసే యజ్ఞం పాప ప్రక్షాళనకైతే, ఆంతరములో చేసే యజ్ఞం జ్ఞానవృద్ధికి, మోక్షానికి. రెండూ ముక్యమే. ప్రతి యజ్ఞంలో ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం ఎల్లవేళలా కలిగి ఉండడమే గోమేధ యజ్ఞం.

To be continued ...............