Sunday 8 May 2016

హిందూ ధర్మం - 208 (యజ్ఞంలో బలి ఖండన - 2)

వక్రీకరణ - నరమేధంలో మనిషిని బలి ఇస్తారు.
వాస్తవం - మానవదేహానికి వేదం చెప్పిన విధంగా అంత్యేష్టి సంస్కారం (దహనసంస్కారం మొదలైనవి) చేయడమే నరమేధం - సత్యార్ధప్రకాశంలో స్వామి దయానంద సరస్వతీ.

వివరణ - భారతీయ సమాజం ఆటవికమని, తమ మతమే శ్రేష్టమని నిరూపించడానికి ఏ విధంగా అవకాశాం లేదని గ్రహించిన వక్రీకరణకారులు, యజ్ఞయాగాది క్రతువుల్లో మనుష్యులను బలిస్తారని వక్రీకరించారు. అదేకాక సంస్కృతిని నాశనం చేయడంలో పత్రికలు ముందుంటాయి. ఎవరైనా జనాలను మోసం చేస్తే, అవినీతి అధికారి జనాలకు శఠగోపం పెట్టాడని ప్రచురిస్తారు. భాషను తామేదో కాపాడుతున్నామని చెప్పుకునే ఈ పత్రికల వాళ్ళకు భాషలో పదాల అర్దం కూడా కనీసం తెలియదు. శఠగోపం మీద స్వామి పాదాలుంటాయి. ఆలయంలో శఠగోపం పెట్టించుకోవడం స్వామి పాదాలను నెత్తిన పెట్టించుకుని, ఆశీర్వాదం పొందడం. స్వామి పాదాలు పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడే కానీ నశించడు. మరి ఈ పద ప్రయోగాన్ని పత్రికలు నీచంగా ఎందుకు చేస్తాయో వారికే తెలియాలి. ఇలాంటిదే నరమేధం కూడా. ఎక్కడైన ఉగ్రవాద దాడి జరిగి, అనేకులు మరణిస్తే, భారి నరమేధం అంటూ ఆ పదానికి లేని అర్ధాన్ని ఆపాదించి, సమాజాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు.

శతపధబ్రాహ్మణం 13 వ అధ్యాయంలో నరమేధం గురించి చెప్పబడింది. 7 1/2 అడుగుల పొడవు, 5 1/2 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగుల లోతుతో గొయ్యి త్రవ్వాలి. పైన ఉన్న వెడల్పులో సగం మాత్రమే క్రింద ఉండాలి. అందులో కనీసం 49 పౌండ్ల గంధపుచెక్క, పలాశ (మోదుగ) చెట్టు చెక్క వేయాలి. శవానికి సమాన బరువుతో ఆవునెయ్యి తీసుకుని, కస్తూరి కలిపి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కర్పూరం మొదలైనవి వేయాలి. దాని మీద శవాన్ని ఉంచాలి. శవం మొత్తం ఆవునెయ్యిని చల్లి, నిప్పు అంటించాలి. ఈ విధంగా చేయడం వలన శవం కాల్చిన వాసన రాదు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దహన సంస్కారానికి యాగానికి సమానమైన స్థానం కల్పించారు. అసలు శవ దహనం అనకుండా దహన సంస్కారమని, అంత్యేష్టి అని అనడంలోనే ఎంతో అర్దం దాగుంది. సంస్కారం అనగా సంస్కరించునది. దేహన్ని, సూక్ష్మ శరీరాన్ని సంస్కరించి, ఆత్మ ఉద్ధతికి సహాయపడే కర్మలకు సంస్కారం అని పేరు. దానికి మరే ఇతర భాషలోను సమానమైన అర్దంలేదు. తాను దేహం కాదు, ఆత్మ అని స్థిరమైన భావన ఉన్నవారు, దేనీ మీద వ్యామోహం లేనివారికి మినహాయించి మరణం సంభవించగానే అందరి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. అది అక్కడే, ఆ దేహం మీద మమకారంతో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన ఎవరికి (సామాన్య మనవులకు) కనపడదు, వినపడదు. జీవుల కర్మ తీరడానికి కొత్త దేహం ధరించాలి. కానీ దేహమే తానన్న మమకారం వలన అది కొత్త ప్రదేశానికి దేహాన్ని విడిచి వెళ్ళెందుకు ఇష్టపడదు. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, అది కుళ్ళిపోతుంది. తన దేహం కుళ్ళిపోవడం దీనికి ఇంకా బాధను కలిగిస్తుంది. అలా కాక ఆత్మను ఉద్ధరించడం కోసం వచ్చిందే ఈ దహన సంస్కారం. అప్పుడు చదివే మంత్రాలు, ఆత్మకు ఈ దేహం తనది కాదని, ఇక తాను అక్కడి నుంచి విడిచి వెళ్ళాలని, తనకంటూ వేరే దేహం, జన్మ నిర్దేశించబడ్డాయని తెలియజేస్తాయి. శరీరాన్ని పూడ్చిపెట్టక, దాన్ని కాల్చివేయడం, మిగిలిన అస్థికలు, ఎముకలను నదిలో కలపడం వలన దేహం పూర్తిగా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక అక్కడ ఆత్మ తనది అంటూ కూర్చుని ఏడ్వడానికి ఏమీ మిగలదు. అలా జీవులను శవ దహనం ద్వారా ఉద్ధరించి, వెరొక జన్మకు పంపుతుంది కనుక దీనికి దహన సంస్కారం అని పేరు వచ్చింది. ఇందులో దహనం చేసేవారికి స్వార్ధం ఉండదు. వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం తప్పించి, ఏమీ ఆశించటం కూడా ఉందదు.

అంతేగాక, ఒక శరీరాన్ని అలాగే వదిలేస్తే అది కుళ్ళి రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని భయంకరమైన రోగాలు, అంటువ్యాధులతో మరణించినవారిని పూడ్చిపెట్టడం కంటే కాల్చివేయడం మంచిదని కూడా ఇప్పుడు ఋజువు అవుతోంది. ధర్మం కూడా అదే చెప్పింది. అనాధ శవాలను కూడా ఎవరూ లేరని వదిలేయక, ఆ జీవుడిని ఉద్ధరించడం కోసం వాటికి కూడా కర్మకాండ నిర్వహించమంటోంది. అది చేసింనందుకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా ఈశ్వరుడు నిర్దేశించాడు. ఈ చర్య నిస్వార్ధతతో కూడినదై, రోగాలు వ్యాపించకుండా ఇటు సమాజాన్ని, జీవుడి ప్రయాణాన్ని సులభతరం చేసి ఆత్మను ఉద్ధరిస్తున్న కారణాన దీన్ని యాగం అన్నారు. అంతేకాని నరమేధం అంటే వ్యక్తిని చంపి యాగంలో వేయడం కాదు.

To be continued ................

No comments:

Post a Comment