Sunday, 8 March 2015

హిందూ ధర్మం -149 (మహాభారతం అణుయుద్ధమా?)

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రుకలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

ఇదికాక, మహాభారత యుద్ధం నాటి అణుబాంబుల రేడియో ధార్మికత ప్రభావం రాజస్థాన్ ప్రాంతంలో ఈనాటికి ఉంది. రేడియో ధార్మికత ప్రభావం కలిగిన బూడీ పొరలు జోధ్‌పూర్‌కు పశ్చిమంగా 10 మైళ్ళ దూరం లో 3 మైళ్ళ మేర విస్తరించి ఉంది. దాని మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు అంగవైకల్యాలతో పుట్టడం, క్యాన్సర్ బారిన పడడం గమనించారు. అక్కడున్న రేడియేషన్ స్థాయులు గమనించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాన్ని నివాసయోగ్యం కానిదిగా భావించి, అక్కడ గృహనిర్మాణాలు చేపట్టలేదు.

ఆ ప్రదేశంలో శాస్త్రవేత్తలు ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. దాని వయసు సుమారు 8,000 నుంచి 12,000 సంవత్సరాలుగా ఆత్యాధునిక పద్దతులలో పరిశోధించి నిర్ధారణకు వచ్చారు. ఆ ప్రాంతం భారీ అణువిస్పోటనానికి గురైందని, చాలా నిర్మాణాలు నాశమయ్యాయని, 5 లక్షలకు పైగా జనాభా ఆ బాంబు కారణంగా మరణించారని భావిస్తున్నారు. ఒక పరిశోధకుడి అంచనా ప్రకారం అక్కడ పడిన అణుబాంబు జపాన్‌లో పడిన అణుబాంబుకు సమానమైందని అంటున్నారు.

To be continued ...........................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.
http://higher-perspective.blogspot.in/2013/10/ancient-city-discovered-in-india.html

Friday, 6 March 2015

హోలీ శుభాకాంక్షలు

ఫాల్గుణ మాసంలో వసంత ఋతువు సమీపిస్తుంటే చలి తగ్గుతుంది. వాతావరణంలో వేడి పుంజుకుంటుంది. మొక్కలు, చెట్లకు పచ్చగా మారి ఆహ్లాదాన్ని పంచుతూ, మొగ్గలు తొడుగుతాయి. పక్షుల కిలకిలరావాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మానవుడిలో కామభావనలు పెరుగుతాయి. సామాజిక కట్టుబాట్లనే బంధనాలతో కట్టబడి ఉన్న మనిషి అధిక స్వేచ్ఛను ఆశిస్తాడు. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడతాడు. ఇది కట్టడి చేయకపోతే విశృంఖలత్వాం పెరిగి వ్యక్తికి, సమాజానికి, మొత్తం మానవజాతికి పెనుముప్పుగా మారుతుంది. కుటుంబవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇదంతా అజ్ఞానం వలన జరుగుతుంది.

శ్రీ కృష్ణపరమాత్మ గీతలో జ్ఞానాన్ని కామం ఆవరించి ఉంటుంది అని చెప్తారు. జ్ఞానం కావలంటే కోరికలు విడిచిపెట్టాలి. అన్ని కోరికలు విడిచిపెట్టనవసరం లేదు. ధర్మ బద్ధంకానీ కామాన్ని(కోరికలను) త్యజించాలి.

ఇక్కడ జరిగేది అదే. రాత్రి పూట కామదహనం. రాత్రి అంటే చీకటి, అజ్ఞానం. కామదహనం అంటే అసభ్యకరమైన, ధర్మబద్ధంకానీ కామపు ఆలోచనలను, విశృంఖలమైన కోరికలను భస్మం చేయడం. మరునాడు సూర్యోదయం అవుతుంది అంటే మనిషికి, సమాజానికి జ్ఞానోదయం అవుతుంది. రంగుల పండుగ హోలీ అవుతుంది అంటే జీవితం రంగులమయం అవుతుంది. కోరికలను అదుపులో పెట్టుకొమ్మనే సందేశాన్ని ఇస్తోంది హోలీ.

పరమశివుడు కామదహనం చేశాడు. ఈ సంఘటన వలన మనకు చక్కని సత్యం బోధపడుతుంది. వసంతాన్ని కారణం చేసుకుని మన్మధుడైనా మర్యాదను ఉల్లంఘిస్తే పరమేశ్వరుని చేత దండన అనుభవించాల్సి ఉంటుంది. మర్యాదను, సమాజపు కట్టుబాట్లను, ధర్మాన్ని పాటించడం సంపద, ఉల్లంఘించడం వినాశనం.

అందరికి హోలీ శుభాకాంక్షలు                        

దివ్య లీల హోలీ

మనిషి అందం శరీరవర్ణంలో కాదు, మనసులో ఉంటుంది, అతని గుణగణాలలో, చేసే కర్మ(పని)లో ఉంటుంది. అది చెప్పడానికే అన్ని వర్ణాలకు అతీతమైన పరమాత్మ, ఏ రూపమూ, ఏ రంగు లేని పరమాత్మ, కృష్ణ (నల్లని)వర్ణంలో శ్రీ కృష్ణుడిగా అవతరించాడు.


ఒకసారి చిన్ని కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చి " అమ్మా! చూడమ్మా! రాధ తెల్లగా, అందంగా ఉంది. నల్లగా ఉన్నానని నన్ను ఆటపట్టిస్తోంది" అంటాడు. బాధ ఎందుకు కన్నయ! నేను ఉన్నానుగా, ఆ విషయం మనం చూసుకుందాంలే అన్న యశోద, రాధ మీద రంగులు చల్లమని సలహా ఇస్తుంది.

అల్లరి కృష్ణుడు రాధతో పాటు బృందావనంలో ఉన్న గోపికల మీద కూడా రంగులు చల్లుతాడు. ఎన్ని రంగులు చల్లినా రాధ మాత్రం పున్నమి చంద్రుని వలె వెలిగిపోతుంటుంది. అలా శ్రీ కృష్ణపరమాత్మ రాధతో జరిపిన లీల హోలీ.

నిజానికి రాధ అంటే ఒక పాత్ర/వ్యక్తి కాదు. మహాభారతంలో రాధ ప్రస్తావన ఎక్కాడ కనిపించదు. రాధ అంటే ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాల మీద పట్టు సాధించినవారని/జయించినవారని అర్దం. ఆత్మ తత్వం అర్దమైనవారు ఇంద్రియాలను జయిస్తారు. అలాంటి వారు పరమాత్మకు చాలా దగ్గరగా జీవిస్తారు. అలా పరమాత్మకు దగ్గరైనవారి మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ ఉంటుంది. అటువంటి వారితో(రాధ)  పరమాత్ముడు ఆడే దివ్య లీల హోలీ.

1st Edit: 14-March-2014
2nd Edit: 06-March-2015

హోలి కధ

హోలి పండుగ గురించి శ్రీ మద్భాగవతంలో ఒక ఘట్టం ఉంది (క్లుప్తంగా చెప్పుకుందాం).

హిరణ్యకశిపుడనే వాడు రాక్షసులకు రాజు. ఇంట్లో లేదా బయట, పగులు లేక రాత్రి సమయంలో కానీ, మనిషి లేదా మృగం చేత కానీ, భూమి లేక ఆకాశంలో కానీ, రోగాల వలన, ఆయుధముల వలన తనకు మరణం ఉండరాదని బ్రహ్మ దేవుని వద్ద వరం కోరుతాడు. వరం పొంది తనను ఎవరు ఏమీ చేయలేరన్న అహకారంతో యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తాడు. గోశాలలను, పోలాలను, అడవులను, ఉద్యానవనాలకు నిప్పు పెట్టిస్తాడు. చెరువులను కలుషితం చేసి, విషతుల్యం చేస్తాడు. జనాలను అష్టకష్టాలు పెడతాడు. స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రుడి ఆధిపత్యానికి విఘాతం కలిగిస్తాడు. తానే దేవుడినని, తననే పూజించాలని ప్రజలకు ఆజ్ఞ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువంటే హిరణ్యకశిపుడికి మహాద్వేషం.

ఈయన పుత్రుడే 'ప్రహ్లాదుడు'. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఎల్లప్పుడు విష్ణు నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సజీవంగా అగ్నిలో పడేసి ప్రహ్లాదుడిని చంపాలనుకుంటాడు.

హిరణ్యకశిపుడికి హోలికా అనే సోదరి ఉంది. సజ్జనులకు (మంచివారికి) అపకారం కలిగించనంతవరకు ఈమెకు అగ్ని వల్ల ప్రమాదం ఉండదని వరం ఉంది. ప్రహ్లాదుడు అగ్నిలోంచి పారిపోకుండా ఉండడానికి అగ్ని జ్వాలల మధ్య హోలికను కూర్చోబెట్టి, హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెడతారు. ప్రహ్లాదుడు ఏ మాత్రం భయపడకుండా విష్ణు నామన్ని జపిస్తూ హాయిగా కూర్చుంటాడు. తనని కాపాడమని కూడా విష్ణువును ప్రార్ధించడు.

ఎందుకంటే నమ్ముకున్న వారిని రక్షించడం పరమాత్ముడి బాధ్యత. ప్రత్యేకించి అడగాల్సిన అవసరం లేదు. 'నా మే భక్తః ప్రణశ్యతి', నన్ను పూర్తిగా నమ్మినవారు ఎన్నటికి నాశనమవ్వరు అని పరమాత్మే గీతలో చెప్పాడు. అసలు భక్తి అంటే అవ్యాజయమైన ప్రేమ. నేను నమ్మాను కనుక నన్ను దైవం రక్షించాలి, నన్ను ఉద్ధరించాలి అని నిజమైన భక్తుడు కోరుకోడు. నాకు ఏది మంచో అది నా దేవుడు ఇస్తాడని కష్టాలను సైతం ఎదురుకుని పరమాత్ముడిపై మరింత ప్రేమను పెంచుకుంటాడు. అందుకే ప్రహ్లాదుడు ప్రత్యేకించి రక్షించమని అడగలేదు.

పరమాత్ముడి అనుగ్రహం ప్రసరించింది. హిరణ్యకశిపుడి ఆలోచన బెడిసికొట్టింది. అగ్ని ప్రహ్లాదుడికి చిన్న అపకారం కూడా చేయలేదు. కానీ హోలిక ఆ అగ్నిజ్వాలలకు మడి మసైపొయింది. పసివాడు, పరమభాగవతుడైన ప్రహ్లాదుడు చిరునవ్వులు చిందిస్తూ అగ్ని నుండి బయటకు వచ్చాడు.

మన చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు చిహ్నంగా హోలికా దహనాన్ని చేసి హోలి జరుపుకుంటాం.

సజ్జనులు, తపస్వులు, సత్యవంతులైన భగవత్భక్తులకు అపకారం చేయదలిస్తే సర్వనాశనమవుతారని, భగవంతుడుని నమ్ముకున్న వారు సదా రక్షింపబడతారని చెప్పడానికి ఇది ఒక తార్కాణం మాత్రమే.

ఓం నమో నారాయణాయ              

Thursday, 5 March 2015

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు

## Must read this ##

6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

పురాతన కాలంలో వైజ్ఞానికంగా హోలీ - ఆధునిక పోకడలు.

భారతీయుల ప్రతి పండుగలోనూ పర్యావరణము, ఆరోగ్యం ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. హోలీకా దహనం కూడా అలాంటిదే. హోలికా దహనంలో వాడే కట్టెలు కూడా ఔషధగుణములున్న వాటినే ఎంచుకునేవారు. యావత్ భారతదేశంలో ఒకేరాత్రి హోలికా దహనం చేయటం వల్ల శీతాకాలపు చలి- వేసికాలపు వేడి కలిసే ఈ ఋతుపరివర్తన సమయంలో వ్యాపించే మలేరియా, చర్మవ్యాధులు వంటి అంటురోగాలకు కారకాలైన క్రిమికీటకాలు నశిస్తాయి. సూర్యుడి వేడి ఇంకా పెరగకముందే వాయుమండలాన్ని వేడెక్కించడం, వాతావరణలోనికి ఔషధ గుణములున్న పొగను పంపించడం ద్వారా రోగకారక క్రిములు నాశనమవుతాయి. హోలీ దహనజ్వాలకు ప్రదక్షిణం చేయటం వలన 140 °F శరీరానికి తగిలడం, అక్కడున్న వారంత ఆ వాయువును పీల్చడం వలన శరీరంలో ఇంతకముందే ప్రవేశించి ఉన్న రోగకారక క్రిములు నాశనమవుతాయి.

కానీ మనం ఆధునికులం కదా. అందుకే మన పూర్వీకులకు భిన్నంగా హోలీకా దహనంలో రబ్బరు టైర్లు, ఇతర చెత్తాచెదారం వేసి, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం, మన ఆరోగ్యాలను చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. భూతాపాన్ని ఇంకా పెంచేస్తున్నాం.

రంగుల విషయానికి వద్దాం. మోదుగ పూలు తెచ్చి, రోట్లో దంచి కుండలోపోసి, రసం తీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. దానీ వావివరసుల పాటించకుండా అందరూ ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ మోదుగ పూల నుండి తీసిన కషాయం ఈ మాసం వాతావరణంలో మన దేహం మీద పడటం వలన శరీరానికి కాంతి, వర్ఛస్సు పెరుగుంతుందని, ఆరోగ్యం చేకూరుతుందని, శరీరంలో రక్తపోటు వంటి జబ్బుల వలన కలిగే ఉద్రేకాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇదంతా మన పూర్వీకుల ఆలోచన.

కానీ మనమేం చేస్తున్నాం? చెట్ల వ్రేళ్ళు, ఆకుల నుండి తీసిన సహజ రంగులకు భిన్నంగా రసాయన రంగులు వాడుతున్నాం. వాటిలో బోరిక్ యాసిడ్, గాజు పొడితో తయారైన పొటాషియం డైక్రోమేట్, ఆంలం వాడతారు. జింక్ క్లోరైడ్ కలిసిన రంగులు కొంత విషప్రభావాన్ని కలిగుంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మన శరీరానికి చర్మం  రక్షాకవచం లాంటిది. స్వల్పంగా హానీ కలిగించే రసాయనిక తత్వాలు తగిలినా రక్తంలో కలువనివ్వదు. కాని, శరీరంపై గాయం ఉండటం, గాయం అప్పుడే జరిగి ఉండడటం లేదా పూర్తిగా మానని స్థితిలో ఉన్న పరిస్థితుల్లో దానిపై ఈ రసాయనిక రంగులు తగిలితే, ఆ గాయం రంగుల రసాయనిక ప్రభావం వలన రక్తంలో ప్రసరించే ప్రమాదం ఉంది. నీటితో కలిసి లోపల ప్రవేశించిన రంగులు మలమూత్రాదుల ద్వారా బయటకు వెళ్ళిపోవచ్చు. కానీ, సీసం - తగరం వంటి పదార్ధాలు శరీరంలోనికి ప్రవేశిస్తే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. జింక్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిసిన రంగులు చర్మంపై పడితే బొబ్బలు లేచే ప్రమాదం ఉంటుంది. ఈ రంగులు ప్రమాదవశాత్తు నోటిలో పడి శరీరంలో ప్రవేశిస్తే శరీరంలోని సునితమైన భాగాలు దెబ్బతినటమే కాక చర్మం రంగు నీలంగా మారే ప్రమదం ఉంటుంది. గులాల్ తయారిలో పొటాషియం డైకోమేట్ ఉపయోగించారంటే వివిధ చర్మవ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.  

బజారులో దొరికే గులాల్ చాలావరకు రసాయనిక మిశ్రమాలే. అందుచేత వాటిని శరీరంపై ఉత్సాహం కొద్దీ రాసుకోవటంలో సంతోషం కంటే ప్రమాదమే అధికం. పిల్లల విషయంలొ మరీ  జాగ్రత్తగా ఉండాలి. కారణం- వారికి వెంటనే రంగులను దులుపుకోవాలని కానీ, కడిగేయాలని కాని తోచదు. అందుకే పిల్లలు హోలీ ఆడుతుంటే పెద్దలు దగ్గరే ఉండండి. కళ్ళలో రంగులు పడనీయకండి.

ఈ వసంతం తయారు చేసుకోవడంలో ఎంత సరదా ఉండేదో. తయారు చేస్తూనే ఒకరు మీద ఒకరు చల్లుకునేవారు, చాలా సరదాగా గడిపేవారు. పెద్దవాళ్ళని ఒకసారి కదిపితే, ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎంత సంతోషపడతారో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు, జనానికి అన్నీ రెడీమేడ్ కావాలి, అవసరమైతే డబ్బు పడేస్తాం, కానీ అంత కష్టం ఎవరు పడతారు, మాకు అంత ఓపిక లేదంటారు, ఇలా అనే చాలా సరదాలను, మధురజ్ఞాపకాలను కోల్పోతున్నారు. పైగా మార్కెట్‌ను చైనా రంగులు ముంచెత్తుతున్నాయి. ఆ రంగులను కొని చైనా ఆర్ధికవ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నాం. ఒకసారి ఆలోచించండి ..................

కొత్త పోకడలు ఆరోగ్యాన్ని, ప్రకృతిని, సరదాలను, పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నాశనం చేసేవిగా ఉన్నాయి. భారతీయులు తిరిగి సంప్రదాయ బద్దంగా పండుగుల జరుపుకోవాలి. సంప్రదాయాలను కాపాడాలి.

సహజ రంగులనే వాడండి. పర్యావరణాన్ని కాపడండి. ఆరోగ్యవంతులుగా జీవించండి.

హోలీ శుభాకాంక్షలు

Wednesday, 4 March 2015

హోలికా దహనం వీశేషాలు

5 మార్చి 2015, గురువారం, హోలికా దహనం
6 మార్చి 2014, శుక్రవారం, హోలీ

హోలికా దహనం ఆంతర్యం, విశేషాలు తెలుసుకుందాం.

సనాతన భారతీయ ధర్మంలో అగ్ని ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగలోనూ అగ్నిదేవుని ఆరాధన ఉంటుంది. హోలి అగ్నిదేవుడికి సంబంధించిన పండుగ. హోలీ ముందురోజు రాత్రి చేసే హోలికా దహనంతో మొదలవుతుంది హోలీ అంటారు Yogi Ananda Saraswathi గారు. అగ్ని దహించడానికే కాదు, కొత్త ఆరంభానికి సూచిక. అందుకే మనం ప్రతి శుభకార్యాన్ని దీపారాధనతో ప్రారంభిస్తాం. ఋగ్ వేదంలో తొలి సూక్తం కూడా అగ్నితోనే 'అగ్ని మీళే పురోహితం' అంటూ మొదలవుతుంది.

అగ్ని దేవుడు మానవులు అగ్నిహోత్రంలో వేసిన హవిస్సును (యజ్ఞ గుండంలో వేసే వాటిని హవిస్సు, హవ్యము అంటారు) ఎంత పవిత్రంగా వేస్తామో, అంతే పవిత్రంగా దేవతలకు చేరవేసి, యాగశాలకు దేవతలను తీసుకువస్తాడు. జనుల కోరికలను తీరుస్తాడు. అందుకే అగ్ని దేవుడు సంతృప్తి చెందితే సకల దేవతలు సంతృప్తి చెందుతారు.

వైదిక కాలంలో ఈ పండుగను 'నన్నావేష్టి యజ్ఞం' అనేవారు. పొలంలో సగం పండి, సగం పచ్చిగా ఉన్న ధాన్యం తెచ్చి హోమం చేసి ప్రసాదంగా స్వీకరించేవారు. ఆ అన్నం హోలీ అనబడేది. అందుచేత ఈ పండుగను హోలికోత్సవం అనేవారు.


ఆయుర్వేద శాస్త్రంలో హోలికా దహనం గురించి తెలుసుకుందాం. హోలికి ముందు రోజు రాత్రి కామదహనం చేస్తారు. కామదహనమైనా, హోలికా దహనమైనా అగ్నిని ప్రజ్వలింపజేయడం, అక్కడ నలుగురు చేరడం కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఉంది. హోలీ శిశిర ఋతువు చివరలో వస్తుంది. కామదహనంలొ ఔషధ మూలికలకు (మామిడి, రావి, లేక మరేదైనా కావచ్చు, ఋతువును బట్టి కూడా ఏ ఏ సమిధిలను దహనం చేయాలో కూడా మనవాళ్ళు చెప్పారు) సంబంధించిన కర్రలను వాడాలి. ఈ ఆయుర్వేద ఔషధ సమిధలు కాలుతున్న సమయంలో వెలువడే ఔషధవాయువు వల్ల కొద్ది రోజుల్లో వాతావరణమార్పుకు తట్టుకునేల అక్కడున్న జనంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. తద్వారా అందరి ఆరోగ్యం కాపాడబడుతుంది. అందుకే కామదహనంలో ఔషధమూలికలను మాత్రమే కాల్చాలి. ఏ చెత్త పడితే ఆ చెత్తను కాల్చి, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. హోలికా దహనం వెనుకనున్న ఆయుర్వేద రహస్యం ఈ లింక్‌లో ఉంది. http://ecoganesha.blogspot.in/2013/03/blog-post_26.html

ఈ పోస్టు రాయడంలో కొంతవరకు సహాపయడిన పుస్తకం :  దైవం, దివ్యానుగ్రహ మాసపత్రిక).

Edited 1st time: 15- March-2014
Edited 2nd time: 04-March-2015

Sunday, 1 March 2015

హిందూ ధర్మం -148 (మహాభారతం అణుయుద్ధమా?)

47,23,920 మహాభారత యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ముగిసేసరికి 10 మాత్రమే మిగిలారు. అందులో పాండవుల పక్షం నుంచి పంచపాండవులు (ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు), శ్రీ కేష్ణుడు, సాత్యకి (యుయూధనుడు) కలిపి 7 మంది, కౌరవుల పక్షం నుంచి 3, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు. ఇంత భారీ జననష్టం కలగడానికి కారణం మహాభారత యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగించడమే అనే వాదన కూడా ఉంది. మహాభారతం మాములు యుద్ధం కాదు అణుయుద్ధం అని అనేకమంది పాశ్చాత చరిత్రకారులు, శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ విషయం మీద దాదాపు 100 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఇక్కడ కొంత సంధిగ్దత నెలకొంది.

18 రోజుల్లో 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం సామాన్యమైన విషయం కాదు. అది మాములు ఆయుధాలతో సాధ్యమయ్యేదీ కాదు. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పుడు చెప్పబడుతున్న కురుక్షేత్రం ప్రాంతం కంటే చాలా పెద్దది. ధార్మిక గ్రంధాల్లో రెండు రకాల అస్త్రాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి అస్త్రాలు, రెండు శస్త్రాలు. అస్త్రం అనగా మంత్రించి ప్రయోగించేది, మంత్రించిన గడ్డిపరక కూడా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. శస్త్రం అనగా అణ్వస్త్రం, మిస్సైల్. బాణాలను లాంచర్స్ గా అర్దం చేసుకోవచ్చు.

అర్జునుడి గాండీవం కూడా లాంచరే (launcher) అంటున్నారు పాశ్చాత్య పరిశోధకులు. అట్లాగే అక్షయ బాణ తూణీరాలు అనగా మిస్సైల్స్‌ అని చెప్తున్నారు. ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది.

మహాభారతంలో గ్రహాంతరవాసులు కూడా పాల్గొన్నారని కొంతమంది విదేశీ పరిశోధకుల వాదన. 'కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. ఈ విద్యలో సైతం గ్రహాంతరవాసులే శిక్షణను ఇచ్చినా మరీ భీకర అస్త్రాల నియంత్రణ గెలాక్సీ నివాసుల చేతుల్లోనే వుండివుండాలి. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చు' అంటున్నారు జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు. ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

అసలు ఆ కాలంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉందా? క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన ‘అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి’ అనే పుస్తకంలో పేర్కొన్నాడు.

మహాభారతం అణుయుద్ధం అనడానికి ఏమైనా ఆధారాలు దొరికాయా?

To be continued ..................

ఈ రచనకు సహాయపడిన వెబ్‌సైట్లు:
https://ramanan50.wordpress.com/2013/09/29/details-of-army-strength-mahabharata/
ఆంధ్రప్రభ 3 జనవరి 2015, శనివారం ప్రచురితమైన వ్యాసం.