Sunday, 6 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (105)



చిత్రంగా ఉన్నాడేమిటని రాజు ప్రశ్నించాడు. అక్కడున్న భక్తులు, ఇది పురాతన విగ్రహమని; శిల్పికి ఇట్లా మూర్తి సాక్షాత్కరించడం వల్ల మలిచాడని అన్నారు. రాబోయే కాలంలో అన్నీ తెలిసిన విద్వాంసుడు వచ్చి శాస్త యొక్క బాధను వెల్లడి చేస్తాడని అప్పుడు మిగతా విగ్రహాల మాదిరిగా ముక్కు మీద వేలు ఉండకుండా ఉంటుందని అన్నాడట. అప్పటికే ఎందరో విద్వాంసులు వచ్చారు. రకరకాల కారణాలను చెప్పినా మునుపటి మాదిరిగానే విగ్రహం ఉందన్నారు. ఎవ్వరూ ఇంతవరకూ ఆ వ్రేలును క్రిందకు దింపలేక పోయారని అన్నారు. రాజు తాతాచారి పంక చూసాడు. దానికి కారణాన్ని ఇట్లా శ్లోకరూపంలో ఆయన అందించాడు:


విష్ణో: సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సుర సేవితోహం 

తథాపి భూతేశ సుతోహమేతై: భూతైః వృతైః చింతయతీహ శాస్తా 


శ్లోకంలో శాస్త ఇట్లా అన్నాడని ఉంది: "నేను విష్ణువు యొక్క తనయుణ్ణి. కనుక బ్రహ్మతో సమానం. అందువల్ల దేవతలచే పూజలందుకొంటున్నాను” కాని...?


శ్లోకంలో తథాపి, అనగా అయినా అని అర్థం. ఇందువల్ల శివునకు సంబంధించిన విషయాలలో తల దూర్చనని తాతాచార్యులగారి అభిప్రాయం.


శాస్త ఏమి చెప్పి యుంటాడు? నేను శివుని కుమారుణ్ణి కూడా అనాలి కదా. తథాపి భూతేశ సుతోహం అని అనాలి. శివునకు చాలా పేర్లున్నాయి. శివ, ఈశ్వర, శంభు, పశుపతి మొదలైనవి. ఇన్ని పేర్లున్నా భూతేశ పదం వాడబడింది. అనగా భూతాలకు నాయకుడని; అట్టి వాని కొడుకునయ్యానని బాధపడినట్లు తాతాచార్యులూహించారు.


భూతాల ఆధిపత్యం అంటే అది అతని శక్తిని, అధికారాన్ని సూచించడం లేదా? పరమేశ్వరుడు భూతాలను నియమిస్తాడు, మంచివారిని బాధించకుండా చేస్తాడు. అట్లా వారిని రక్షిస్తున్నాడు కదా! భూతాలను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చేస్తున్నాడు కదా.

Saturday, 5 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (104)



అయ్యప్ప విషయంలో వివాదం


ఇక పరమేశ్వరుని మూడవ సంతానమైన అయ్యప్పకు తల్లి ఎవరు? ఇతనికి రాను రాను భక్తులధికమౌతున్నారు. ఇతడీశ్వరునకు, మోహిని అవతారమెత్తిన విష్ణువునకు కలిగిన బిడ్డ.


16 వ శతాబ్దంలో అప్పయ్యదీక్షితులనే మహానుభావులుండేవారు. ఆయన వంశంలో మున్నారు గుడి శాస్త్రిగారు పుట్టారు. దీక్షితుల వారద్వైతియైనా శివభక్తిని ప్రచారం చేసారు. వారి కాలంలో శివ ద్వేషం బాగా ఉండేది. అందువల్ల అట్టి వారిని ఎదుర్కొనడం వీరి లక్ష్యమైంది. తాతాచార్యులనే వైష్ణవుడు ఆకాలంలో వుండేవాడు. విజయనగర రాజులతనిని పోషిస్తూ ఉండేవారు. అతడు వైష్ణవ మతవ్యాప్తిని తీవ్రంగా కొనసాగిస్తూ ఉంటే దాని నెదుర్కొనడం కోసం దీక్షితులు తీవ్ర ప్రయత్నం చేసారు. కాని వీరికి విష్ణు ద్వేషం లేదు. విష్ణువును పరమాత్మ స్వరూపంగానే భావించేవారు. యుక్తులతో, శాస్త్రాధారంతో విష్ణువు, రత్నత్రయంలో ఒకడని నిర్ధారించారు కూడా.


ఒకనాడు రాజు, తాతాచార్యులు, దీక్షితులు ఆలయానికి వెళ్ళారు. ఆ రాజు రామరాయలుగాని, లేక వెల్లోర్ కి చెందిన చిన్న బొమ్మ నాయకుడు గాని కావాలి. లేదా తంజావూరునకు చెందిన వీర నరసింహ భూపాలుడైనా కావాలి. ఆలయంలో అయ్యప్ప విగ్రహముంది. అతణ్ణి శాస్త అని కూడా అంటారు. అది చిత్రమైన విగ్రహం. ముక్కుమీద వేలు వేసుకొన్నట్లుగా ఆ విగ్రహముంటుంది, ఏదో ఆలోచిస్తున్నట్లుగానూ ఉంటుంది.


Friday, 4 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (103)



ఇట్లా గంగతో వినాయకునకు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆమెను తల్లిగా భావించాడు. ఇది అతని ప్రేమతత్త్వాన్ని, స్నేహ తత్త్వాన్ని ప్రకటిస్తోంది. స్త్రీలనందరినీ తల్లులుగా భావించిన స్వచ్ఛమైన బ్రహ్మచారి.


ఏనుగుకి నీళ్ళంటే చాలా ఇష్టం. ఇట్లా గుఱ్ఱం, పెద్ద పులి, సింహం ఉండవు. బురదలో పొర్లాడడానికి ఇష్టపడతాయి గేదెలు. పెద్ద శరీరంతో నీళ్ళలో ఈత కొట్టడానికి ఇష్టపడుతుంది ఏనుగు. అవి గుంపులుగా నదులు వద్దకు వెళ్ళడం, అందులో జలకాలాడటం మనకు తెలిసిందే. అట్టి దృశ్యాన్ని మనం గజేంద్ర మోక్ష ఘట్టంలో చూడవచ్చు.


ఒకనికి ఆర్గురు తల్లులు


వినాయకునకు ఇద్దరు తల్లులైతే అతని తమ్ముడైన సుబ్రహ్మణ్యునకు ఆర్గురు తల్లులు. అతడు షాణ్మాతురుడు. అందు అమ్మవారు, గంగ లేరు. వీరు కృత్తికానక్షత్రానికి అధి దేవతలైన ఆర్గురు తల్లులు. వీరే ఇతనికి పాలనిచ్చారు. వీరిని తల్లిగా భావించాడు కనుక అతడు కార్తికేయుడయ్యాడు. 


Thursday, 3 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (102)



ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు (ద్వైమాతురుడు)


పై శ్లోకంలో మన స్వామి, ద్వైమాతురుడని పేర్కొనబడ్డాడు. అనగా ఇద్దరు తల్లులు కలవాడు. ఎప్పుడైనా ఒకనికి ఇద్దరి భార్యలున్నట్లు వింటాం. కాని ఒకనికి ఇద్దరు తల్లులుండడమేమిటి? అమ్మవారు తల్లియని తెలుసు.


ఈశ్వరుని నెత్తి పైనున్న గంగను అతనికి రెండవ భార్యగా తలుస్తాం. సౌందర్య లహరిలో శంకరులు, అమ్మవారి నేత్రాలు క్రోధాన్ని, ఆశ్చర్యాన్ని భయాన్ని, అసూయను ప్రదర్శిస్తున్నాయని, ఈశ్వరుని నెత్తిపై నున్న గంగను చూచినప్పుడు కోపమని సరోషా గంగాయం అని చెప్పారు (51 శ్లో). ఎవరీ గంగ? ఆమె నా తండ్రి భార్య, కాబట్టి ఆమెను కూడా తల్లిగా భావిస్తానని ప్రేమతో అంటాడట వినాయకుడు. అందువల్ల ద్వైమాతురుడు.


అంతకంటే సుబ్రహ్మణ్యుని గంగాతనయుడని అనడం మేలు, గంగనుండి పుట్టాడు కనుక. శివుని నేత్రం నుండి నిప్పురవ్వలు వచ్చాయని వాటిని గంగ భరించిందని, అపుడు సుబ్రహ్మణ్యుడవతరించాడని అందరికీ తెలుసు. కనుక అతడు గాంగేయుడు.

Wednesday, 2 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (101)



నేనిట్లా చెప్పానంటే శాస్త్రిగారి అభిప్రాయాన్ని అందించాను. అంటే ఒక్క వినాయకుణ్ణే పూజించి మిగతా దేవతలను పూజించవద్దని కాదు. రకరకాల అభిరుచులు, మనః ప్రవృత్తులుంటాయి కదా. ఆపైన ఒక్కొక్క దేవతనే పూజించడం వల్ల వారి విశ్వాసమూ గట్టిపడుతుంది. అందుకే తిరునల్లార్ లోని శనిని పూజించడం, మకర సంక్రమణకాలంలో అయ్యప్పను ఆరాధించడం విశేషంగా కన్పిస్తుంది. ఎవరికో గాని అద్వైత జ్ఞానం పట్టుబడదు. ఒక్కొక్క దేవతనే ఇష్టదైవంగా భావించేవారున్నా పెక్కుమందిని పూజించాలనే సాధారణంగా ఉంటుంది. అంతేకాదు, తమ ఇష్టదేవతనే రకరకాలుగా అలంకరిస్తారు.


రకరకాల రుచులను మనస్సు కోరుతుంది. కోరనీయండి. దానిని సహజ మార్గంలో పోనీయండి. అది ఒక్కదాని పై లగ్నమగునట్లు నెమ్మది నెమ్మదిగా దీనిని నియమించండి. అనగా ఒక్కదానినే పట్టుకోవాలని నిర్భంధంగా మనస్సును బిగించకూడదు. మనస్సునకు ఒత్తిడి చేస్తే అది మన అదుపులో అస్సలుండదు. ఇట్లా పెక్కుమంది దేవతలను ఆరాధించి మనస్సులోని మాలిన్యాన్ని క్రమక్రమంగా పొగొట్టుకొనేటట్లు చేయడమే మన లక్ష్యం. డ్వైతభావన నుండి అద్వైతానికి పయనించునట్లుగా చేయడమే లక్ష్యం. ఇదంతా విఘ్నేశ్వరుదొక్కడే చాలనే తతః హేతున్యాయాన్ని వివరించడం వల్ల ఇంతగా చెప్పవలసి వచ్చింది. అంత మాత్రంచే ఇతర దేవతలను భజించకూడదని కాదు. ఈ శ్లోక రచయిత కూడా పెక్కు దేవతలను భజించినవాడే. ఇట్లా చెప్పినవాడు శివుణ్ణి అర్చించాడు కదా!


ఏదో బౌద్ధిక స్థాయిలో (Intellectual Plane) చెప్పితే సరిపోదు. మనకు మనస్సుంది కదా. భక్తి విషయం వచ్చేప్పటికి బుద్దికి అవకాశం ఉండదు. అందువల్ల మనం ప్రాథమిక దశలో ఉన్నాం కనుక ముందుగా అందర్నీ కొలుద్దాం. ఇష్ట దైవాన్ని భజిద్దాం. ఏది మనకు తృప్తి నిస్తే అట్లా కొలుద్దాం. 


శ్లోకం చివరలో అనేక దేవతలను భజించవడం వల్ల వచ్చే అన్ని ఫలాలను వినాయకుడిస్తాడని ఉంది. సర్వార్థ ప్రతిపాదనైక చతురో ద్వైమాతురో, అనగా నాల్గు పురుషార్ధాలను ఇస్తాడని ఉంది.

3 డిసెంబరు 2020, గురువారం, కార్తీక బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.



ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :


సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, సంకష్టహర చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.


ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.


సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.


ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.


సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.


ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )


ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.


ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.


(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి గురువారం వచ్చింది.)


3 డిసెంబరు 2020, గురువారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.12 నిమి||


మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html


కార్తీక మాసంలో వచ్చిన దీనికి గణాధిప సంకష్టహర చవితి అని పేరు.


ఓం గణాధిపాయ నమః

ఓం గం గణపతయే నమః

Tuesday, 1 December 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (100)

ఒక్క దేవతను పూజించే వారు అరుదు అని చెప్పాను కదా! ఆలయాలకు వెడితే అనేక దేవతల సన్నిధాలు కన్పిస్తారు. ప్రతి సన్నిధికి వెళ్ళి అందర్నీ పూజిస్తాం. శివాలయంలో విష్ణు విగ్రహం లేకపోయినా, విష్ణ్వాలయాలలో శివమూర్తి లేకపోయినా, శివాలయానికీ, విష్ణ్వాలయానికీ వెడతాం. కాంచీపురంలో భిన్న భిన్న మూర్తులకు భిన్న భిన్న దేవాలయాలు విడిగా ఉన్నాయి. కామాక్షి, ఏకామ్రేశ్వరుడు, వరదరాజు మొదలైనవి అనేకం ఉన్నాయి అన్నిటికీ వెడతాం. విష్ణ్వాలయంలో విఘ్నేశ్వరుడు, విష్వక్సేన నామంతో పిలువబడతాడు. అతనికి నామం ఉంటుంది నుదుటిపై.


ఇక ప్రతి దేవత వినాయకుణ్ణి పూజించాడని లోగడ చెప్పాను కదా. 


కనుక ఆటంకాలను తొలగించే బాధ్యత అతనికి అప్పజెప్పారు కనుక దానిని సమస్త దేవతలూ పాటించారు, పూజించారు. అందువల్ల అన్ని కోరికలను తీర్చే దేవతయని భావించక ఒక్కొక్క ఫలానికి ఒక్కొక్క దేవతను కొలుస్తున్నాం. ఇట్టి సందర్భంలో తతః హేతున్యాయాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి.


సారాంశమేమనగా ఏ దేవతను పూజించినా ముందితణ్ణి పూజించాలని అందరి దేవతలపై ఆధిపత్యం కలవాడని, ఇతర దేవతలను ఫలాలనీయ వలసిందిగా ఆజ్ఞాపించగలడని, అతని ఆజ్ఞను మిగతా దేవతలు శిరసా వహిస్తారని, అట్టి ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఆటంకాలెదురౌతాయని తేలింది.